చేతులు కడుక్కోవడం - దాని వెనుక చరిత్ర. ఇంకా ఇగ్నోజ్ సెమ్మల్ వీజ్ గురించి విశేషాలు


ఈ రోజు ఒక పక్క ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నాం, ఇంకో పక్క కరోనా భయంతో వణికి పోతున్నాం. కరోనా ను తప్పించుకోవడానికి పదే పదే చేతులు శుభ్రంగా కడుక్కోవడమే మార్గమని ప్రపంచ దేశాలన్నీ ఘోషిస్తున్నాయి.ఇలాంటి పరిస్థితుల్లో అసలు చేతులెలా పరిశుభ్రం చేసుకోవాలి?దానివలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి?ఇలా చేతులు పరిశుభ్రంగా కడుక్కుంటే వ్యాథులు దరి చేరకుండా వుంటాయని మొదటగా చెప్పిన మహానుభావుడెవరూ?చివరికాయన జీవితమెలా పరిణమించిందీ?ఒకసారి తెలుసుకుందామా?

ప్రతి వ్యక్తీ తన చేతులను సబ్బు తోగానీ,ఇతర డిసిన్ఫెక్టంట్ ద్రావణంతో గానీ రుద్ది,తోమి ,తేటగా వుండే చన్నీళ్లతో గానీ,వేడినీటితో గానీ కడుక్కుని పొడి బట్టతో తుడుచుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి చేతులు పరిశుభ్రంగా వున్నాయని అర్థం.మామూలుగా నీళ్లతో మాత్రమే కడుక్కుంటే అవి పరిశుభ్రం కావు యే ప్రయోజనమూ వుండదు.

అలా శుభ్రం చేసుకోవడం వలన కలిగే ఉపయోగాలు- చేతులపై వుండే దుమ్మూ,ధూళీతో పాటుజిడ్డూ తో బాటు కంటికి కనపడని అనేక వ్యాథి కారక క్రిములు కూడా తొలగింపబడతాయి, ఆ విధంగా అనేక వ్యాథులు రాకుండా నివారించ వచ్చు.

నివారింపబడే వ్యాథులు- జలుబు (సాధారణంగా వచ్చేది), ఫ్లూ జ్వరమూ,ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లూ, విరోచనాలు, కలరా, ఫీకో ఓరల్ కంటామినేషన్ వల్ల వచ్చే వ్యాథులు,అంటే మలంలో వుండే సూక్ష్మ జీవులు నోటికి  తగలడం వలన వచ్చే వ్యాథులు----ఉదా:హెపటైటిస్ ఎ,నులి పురుగులూ ఇతర పురుగులూ కడుపులో చేరడం, ఇంకా అనేక బాక్టీరియాల ద్వారా సంక్రమించే అంటు వ్యాథులను కూడా నివారించ వచ్చు,అందుకే వైద్య శాస్త్రంలో ప్రతి చిన్న ప్రొసీజర్ కీ ముందూ,వెనకా చేతులు కడుక్కోవడం తప్పనిసరి.


ప్రతి రోజూ తప్పనిసరిగా చేతులు కడుక్కోవలసిన సమయాలు: వంట వండే ముందూ,వండిన తర్వాతా, ఆహారం తీసుకునే ముందూ,తీసుకున్న తర్వాతా, మాంసమూ,చేపలూ మొదలయిన నాన్ వెజ్ పదార్థాలు శుభ్రం చేసేముందూ,చేసిన తర్వాతా, మల విసర్జన తర్వాత, పిల్లల డైపర్స్ మార్చే ముందూ తర్వాతా, పిల్లలకు ఆహారం పెట్టే ముందూ తర్వాతా సబ్బుతోనూ,నీళ్లతోనూ చేతులు శుభ్ర పరుచుకోవాలి.

మామూలుగా సబ్బు అందుబాటులో లేకపోతే కొన్ని ప్రదేశాలలో ,మసి గానీ, ఇసక గానీ సబ్బుకి ప్రత్యామ్నాయంగా వాడవచ్చునని చెపుతున్నారు.మసిని  చేతులకు రుద్దుకుని నీళ్లతో కడుక్కున్నపుడు ఒక ఆల్కలైన్ మీడియమ్ యేర్పడి మలినాలని శుభ్రపరుస్తుందని చెప్పబడింది. సబ్బులలో సాలిడ్ సోప్ కంటే లిక్విడ్ సోప్ వాడటం ఉత్తమం ఎందుకంటే సాలిడ్ సోప్ పైన మన చేతులనుండీ చేరిన బాక్టీరియా నిలవ వుండే అవకాశముంది

మెడికల్ ఫీల్డ్ లో చేతులు కడుక్కునే విధానం: వ్యాథులు కలిగించే బాక్టీరియానీ,వైరస్ లనీ,ఇంకా ఇతర ఫంగస్ లనీ తొలగించడానికి,మెడికల్ ఫీల్డ్ లో యే చిన్న ప్రొసీజర్ ముందయినా  పధ్ధతిగా చేతులు కడుక్కోవడం తప్పని సరి,ఉదాహరణకి ప్రతి పేషంట్ నీ పరీక్ష చేసేముందూ,తర్వాతా,డెలివరీ చేసేముందూ,ఆపరేషన్లకి ముందూ చేతులుకడుక్కొన్న తర్వాతే యే పనైనా. ఇంకా  ధారగా నీళ్లు వచ్చే టాప్ కింద చేతులు తడుపుకుని,సబ్బుతో నురగ వచ్చేట్టు రుద్దు కోవాలి. చేతి ముందు భాగమూ,వెనక భాగమూ,వేళ్లూ,బొటన వేలూ,మణికట్టు వద్దా సాధారణంగా కడుక్కుంటారు. ఆపరేషన్లకు ముందయితే మోచేతి వరకూ బాగా రుద్ది కడుక్కోవాలి,ఒకో వేలూ ముందూ ,వెనకా,రెండు పక్కలా అంటే ఒకవేలికి నాలుగు పక్కలా శుభ్ర పరుచుకోవాలి. గోళ్లను రుద్ది రుద్ది కడగాలి,చేతులు ఒక దానితో ఒకటి కత్తెర వేసినట్టుగా పట్టుకుని కడగాలి.

ఆ విధంగా మొదటి దశలో చల్లని సబ్బు నీటితో ఇరవై సెకండ్లు కడిగాక,బీటాడిన్ తో కానీ ఇతర డిసిన్ ఫెక్టెంట్లతో కానీ ఒక నిముషం పాటు రుద్ది రుద్ది ,ఆ తర్వాత వేడి నీటితో కడగాలి.మూడవ దశలో చేతిని స్టెరిలైజ్డ్ టవల్ తో తుడుచుకుంటారు,పొడి చేతులు మంచివి,తడిచేతులతో ఇన్ ఫెక్షన్ కి ఛాన్స్ ఎక్కువ.ఆ తర్వాత స్పిరిట్  కానీ శానిటైజర్ కానీ వేసుకుని తుడుచుకున్నాక సర్జికల్ గ్లవ్స్ వేసుకుని సర్జరీకి ప్రొసీడ్ అవుతారు

సాధారణ హేండ్ వాష్ లో సబ్బు నీళ్లతో మణికట్టు వరకూ ,పైన చెప్పిన విధానంలో చేతినీ,వేళ్లనీ శుభ్ర పరుచుకుంటే చాలు సరిపోతుంది అయితే కామన్ గా బొటన వేలినీ,మణికట్టునీ సరిగా శుభ్ర పరుచుకోరు ,ఆ విషయంలో జాగ్రత్తగా వుండాలి.చేతులు కడుక్కున్నాక టిష్యూ పేపర్ తో తుడుచు కోవడం ముఖ్యం,మరువరాదు.

ఇందాక లిక్విడ్ సోప్ మంచిదని చెప్పుకున్నాం కదా బజారులో డెట్టాల్ ,శావలాన్ ,లైఫ్ బాయ్ లిక్విడ్ సోపులు దొరుకుతున్నాయి.

ఈ కరోనా వైరస్ ప్రబలుతున్న కష్ట కాలంలో మనని వ్యాథి బారిన పడకుండా కాపాడే విధానాలలో హేండ్ వాష్  పాత్ర చాలా ప్రధానమైనది.హేండ్ శానిటైజర్ ఉపయోగించడం కంటే కూడా హేండ్ వాషే మంచిది.చేతులు సబ్బుతో కడుక్కునే వీల్లేనప్పుడే శానిటైజర్ వాడాలి,అదికూడా 70%ఆల్కహాల్ కలిగి వున్నది సమర్థవంతంగా పనిచేస్తుంది.

అసలు ఇలా హేండ్ వాష్ వలన వ్యాథులను నివారించ వచ్చునని కనుక్కుని వైద్య విధానంలో  పెను మార్పు తీసుకు వచ్చి ,మానవజాతికి మహోపకారం చేసిన మహనీయుడు హంగరీకి చెందిన ఇగ్నోజ్ సెమ్మల్ వీజ్ Ignoz semmelweis అనే స్త్రీ వైద్య నిపుణుడు.ఇది జరిగింది సుమారు 170యేళ్ల క్రితం .అతను వియన్నా లోని వైద్య శాలలో 1846ప్రాంతాలలో గైనకాలజిస్ట్ గా పనిచేస్తూ వుండేవాడు.ఆ కాలంలో ప్రసవసమయంలో వచ్చే "బాలింత జ్వరం"తో చాలా మంది స్త్రీలు మరణిస్తూ వుండే వారు.దీనినే  "ఛైల్డ్ బెడ్ ఫీవర్ "అని పిలిచే వారు.కారణమేమిటో సరిగా తెలియదు,అప్పటికి సూక్ష్మజీవులు ఇన్ ఫెక్షన్ కలగ జేస్తాయనే సిధ్ధాంతం కూడా ఇంకా తెలియదు. .సెమ్మల్ వీజ్ పనిచేసే హాస్పిటల్ లో ప్రసవం జరిపే క్లినిక్ లు రెండుండేవి ఒక దానిని డాక్టర్లు నడిపే వారు,ఇంకొకటి మిడ్ వైఫ్ ల టీచింగ్ కోసం మిడ్ వైఫులు నడిపేది.ఈ డాక్టర్లు నడిపే క్లినిక్ లో పని చేస్తున్న సెమ్మల్ వీజ్ ని ఈ బాలింత జ్వరాలు కలవర పరిచినాయి,వాటి గురించి స్టడీ చేయడం మొదలెట్టాడు.అతను ఒక సంగతి కని పెట్టాడు తమ డాక్టర్లు నడిపే క్లినిక్ లో బాలెంత మరణాల సంఖ్య ,మిడ్ వైఫులు నడిపే దానికంటే ఎక్కువ వుందని.ఎంత ఎక్కువంటే 10%డాక్టర్స్ క్లినిక్ లో మరణాల సంఖ్య అయితే మిడ్ వైఫ్స్ క్లినిక్ లో 4%వుండేది ,ప్రజలు సహజంగానే మంత్ర సానులతోనే కానుపు చేయించుకుంటామని కాళ్లు పట్టుకునే వారట,డాక్టర్స్ క్లినిక్ లో కానుపయ్యే కంటే రోడ్డు మీద కానుపవ్వడమే మేలనుకునే వారట.

అయితే దీనికి కారణమేంటో కనిపెట్టడానికి చాలా కష్ట పడ్డాడు,ఎన్నో కారణాలు అన్వేషించి వేసారి పోయిన సమయంలో అతని స్నేహితుడైన ఒక డాక్టర్ జబ్బుతో చనిపోతాడు.అతనిని అటాప్సి చేసినపుడు అతని అంతర్గత అవయవాలలో కనపడిన లక్షణాలూ,బాలెంత జ్వరంలో కనపడిన  లక్షణాలూ ఒకే రకంగా వుండటం గమనించాడు,డాక్టర్ల క్లినిక్ లో పనిచేసే డాక్టర్లందరూ అటాప్సీ రూమునుండీ ,డైరెక్ట్ గా కానుపు రూముకి రావడం కూడా గమనించి ,అటాప్సీ రూమునుండీ మోసుకు రాబడిన "కడావరిక్ మెటీరియల్ "ఈ జబ్బుకి కారణమనుకుని దానికి విరుగుడుగా ఆ శవాల వాసనని తగ్గించడానికి వాడే "క్లోరినేటెడ్ లైమ్ "తో చేతులు కడుక్కోవాలని నిర్దేశించాడు.ఆశ్చర్యంగా అలా చేయడం మొదలెట్టాక మరణాల రేటు గణనీయంగా తగ్గింది.(ఇంతకీ ఆశ్చర్య కరమైన విషయం ఆ క్లోరినేటెడ్ లైమ్ లో వుండే కాల్షియమ్ హైపో క్లోరైట్ నే ఇప్పుడు కరోనా వ్యాథి రాకుండా నివారించే స్ప్రేలలో వాడుతున్నారు).అయితే డాక్టర్ల బృందం ఈ విషయాన్ని విశ్వసించలేక పోయింది,అప్పట్లో నీటి వలన జబ్బులొస్తాయనుకునే వారు,అందువలన ఇతను నీటితో చేతులు కడుక్కోమనడం వారికి అంగీకారంగా అనిపించలేదు,అంతే కాకుండా బాలింత జబ్బుకి కారణం ఆ రోగి కడుపులో వుండే కల్మషమని భావించి,అదిపోవడానికని బాలింతరాళ్లకి విపరీతంగా ఎనిమాలు ఇస్తుండేవారు,అందుకని వారు ఈ "కడావరిక్ మెటీరియల్ "జబ్బుకలగ జేస్తుందనే థీరీ నమ్మలేదు.ఇంకా కొంతమంది పెద్ద పెద్ద డాక్టర్లకి తమంత పెద్దమనుషులు చేతులు కడుక్కు రావాలా?తమ వల్ల జబ్బు వస్తుందా? అని అహం అడ్డు వచ్చింది.బాలింత జబ్బుల వల్ల మరణించే వారి సంఖ్య తగ్గినా సరే తోటి వైద్యలోకం అతని కృషిని గుర్తించక పోగా,అతనిని హేళన చేసింది,అవమానించింది.చివరకు అతనిని 1849లో వియన్నా హాస్టిటల్  నుండీ తొలగించారు.దీనిని సెమ్మల్ వీజ్ తట్టుకోలేక పోయాడు బుడాపెస్ట్ వెళ్లి అక్కడహాస్పిటల్ లో చేరి ,అక్కడ కూడా బాలింత మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించాడు,అయినా అక్కడ కూడా ఇలాగే అవమానాల నెదుర్కున్నాడు.1857ప్రాంతాలలో పెళ్లి చేసుకున్నాడు ,అయిదుగురు పిల్లలు కలిగారు.అతని కృషినెవ్వరూ గుర్తించలేదనే నిర్వేదానికీ,డిప్రెషన్ కీ గురయ్యాడు.చాలామంది పెద్ద పెద్ద ప్రొఫెసర్లకి హేండ్ వాషింగ్ ప్రాముఖ్యతని గుర్తించకుండా,ఫాలో అవ్వకుండా "బాలెంత మరణాలకి"కారణమైన హంతకులు మీరు అని ఉత్తరాలు రాస్తుండే వాడు,కొంతమందితో గట్టిగా వాదిస్తూ వుండే వాడు.1865 సంవత్సరంలో అతని స్నేహితులూ,అతని భార్యా కూడా అతనికి మతి స్థిమితం లేదని భావించి మాయమాటలు చెప్పి అతనిని ఒక మెంటల్ అసైలమ్ లో చేర్చారు.అక్కడ నుండీ బయట పడాలని ప్రయత్నీంచిన అతనిని అక్కడి గార్డులు గొడ్డుని బాదినట్టు బాది ,గొలుసులతో కట్టేశారు.అతని చేతికి గాయమయింది.చివరకు ఆ అసైలమ్ లో చేరిన 14 రోజులకి సెమ్మల్ వీజ్ చేతికి అయిన గాయం కుళ్లి(గాంగ్రీన్ తో) అనాథగా మరణించాడు.అతను జీవితాంత బాలింతలను కాపాడటానికి యే సెప్సిస్ తో పోరాడాడో అదే సెప్సిస్ తో మరణించడం జీవితంలో ఐరనీ.

అతను చనిపోయిన ఇరవై సంవత్సరాల తర్వాత లీవెన్ హాకూ,లూయీ పాశ్చరూ వచ్చి సూక్ష్మ జీవుల ఉనికిని నిర్థారించాక వైద్య లోకం సెమ్మల్ వీజ్ కృషిని గుర్తించింది,హేండ్ వాష్ వలన సూక్ష్మజీవులను తొలగించ వచ్చని అంగీకరించింది.ఆయనని "ఫాదర్ ఆఫ్ హేండ్ వాషింగ్ "అని గౌరవిస్తున్నారు.ఈ నాడు వెనిస్ లోనూ ,బుడాపెస్ట్ లోనూ అతని పేర యూనివర్సిటీలున్నాయి,హాస్పిటల్సున్నాయి.అతను నివసించిన ఇంటిని మ్యూజియం చేశారు.

చివరికి అతను మరణించిన 155యేళ్ల తర్వాత కూడా ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా మహమ్మారిని తట్టుకోవడానికి ఆయన సూచించిన హేండ్ వాషే శరణ్యమయింది.ఎందరో మహానుభావుల వారి జీవితాలనే ధారపోయడం,వారు చేసిన కృషీ ,త్యాగం వీటి వలననే వైద్య శాస్త్రం లో ఇన్ని ఆవిష్కరణలు జరిగి ఇంత అభివృధ్ధి సాధించింది.ఎందరో మహాను భావులు అందరికీ వందనములు

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము