భారతీయ చలనచిత్ర సీమ చెక్కిలి మీద ఘనీభవించిన కన్నీటి చుక్క గురుదత్.

నా అభిమాన దర్శకుడూ, నా అబ్సెషన్ గురుదత్ .ఇటువంటి అక్టోబర్ నెలలోనే  పదవతేదీ 1964 సంవత్సరంలో ఈ లోకంతో నాకేమి పని అని నిష్క్రమించాడు  .అది హిందీ చిత్రసీమకు అత్యంత విషాదకరమయిన రోజు గురుదత్ ఎవరని ఈ తరం ప్రేక్షకులడిగితే యేంచెప్పాలి.కేవలం అతనొక నిర్మాత,దర్శకుడూ, కొరియోగ్రాఫర్ అని చెపితే చాలదు.అతను పని చేసిన పదమూడు సం"రాలలో తీసిన సినిమాల సంఖ్య యాభై లోపే అయినా "క్లాసిక్స్ "అనదగిన చిత్రాలు తీశాడు. 1951లో "బాజీ"తో చిత్రరంగ ప్రవేశం చేసి 1964లో తనువు చాలించే వరకూ గడచిన పదమూడేళ్లలో హిందీ చిత్రరంగాన్ని ఒక కుదుపు కుదిపాడు,ఒక కొత్త ఒరవడి సృష్టించాడు.అందుకే ఈనాటికీ అతని చిత్రాలు చిత్ర సీమలో ప్రవేశించే విద్యార్థులకు పాఠాలు గానూ,స్ఫూర్తిగానూ నిలుస్తున్నాయి.కొంతమంది అతనిని "ఇండియన్ ఆర్సన్ వెల్స్ "అంటారు .అతని సినిమాలలో"ప్యాసా","సాహిబ్,బీబీ,అవుర్ గులామ్ "టైమ్ మాగజీన్ ఎన్నుకున్న "వంద ఉత్తమ ప్రపంచ చిత్రాలు" జాబితాలో చేరాయంటే అతని ప్రతిభను గురించి వేరే చెప్పాలా? 

అయితే ఒక విషయం అతని సినిమాలలో కమర్షియల్ విలువలు లేవా? అంటే వున్నాయి .నాకేమనిపిస్తుందంటే అతని సినిమాలు కళాత్మక విలువలున్న కమర్షియల్ చిత్రాలు అని.
అంతే కాదు సాంకేతికంగా,భావోద్వేగాలపరంగా,నటనాపరంగా,సంగీతపరంగా,తీసుకునే థీమ్ పరంగాఉన్నత ప్రమాణాలు సాధించినవి గురుదత్ సినిమాలు.అతని సినిమాలలో కొన్ని ముఖ్యమయిన వాటి పేర్లు "బాజీ,జాల్ ,బాజ్ ,ఆర్ పార్ ,మిస్టర్ అండ్ మిసెస్ 55,ప్యాసా, కాగజ్ కే ఫూల్ ,సాహిబ్ బీబీ అవుర్ గులామ్ "సాంకేతికంగా ఈ నాడు ఎంతో అభివృధ్ధి సాధించినప్పటికీ నాకు గురుదత్ సినిమాలలో కనిపించే "క్లోజప్ "లు లాంటివి ఇప్పటి వరకూ ఏ సినిమాలోనూ కనిపించలేదు ముఖ్యంగా "ప్యాసా" లో పరిశీలించండి అవి వహీదావి కావొచ్చూ,జానీ వాకర్ వి కావొచ్చూ.మనలో మనమాట నాకు "ప్యాసా "లో కనిపించినంత అందంగా వహీదా ఇంకే సినిమాలోనూ కనపడలేదు. వ్యక్తిగా అతని గురించి చెప్పాలంటే అతనొక అంతర్ముఖుడు,మితభాషి,పర్ఫెక్షనిస్టు,కావలసిన యెఫెక్ట్ కోసం యెన్ని టేకులు తీయడానికయినా వెనకాడడు.తనదగ్గర పనిచేసేవారినుండీ క్రమశిక్షణనూ,విశ్వాసాన్నీ కోరుకుంటాడు.సున్నితమనస్కుడూ,పనిరాక్షసుడూ.

ప్రతి మనిషీ వ్యక్తిగతంగా గానీ వృత్తిపరంగా గానీ యెదగడానికి అతను పుట్టి పెరిగిన వాతావరణం,ఆర్థిక,సాంఘిక, రాజకీయ పరిస్థితులూ ప్రభావం చూపుతాయనిపిస్తుంది అలా అతని జీవన గమనాన్ని పరిశీలిస్తే అతనొక దిగువ మధ్య తరగతికి చెందిన ,కొంకణి మాట్లాడే సారస్వత బ్రాహ్మిన్ కమ్యూనిటీకి చెందినవాడు."సారస్వత" అనేది సరస్వతీ నదినుండీ వచ్చింది .వీరు ఉత్తరభారతీయులయినప్పటికీ మంగుళూరు ప్రాంతంలో విస్తరించి వున్నారు. వీరిలో కళాకారులూ,విద్యావేత్తలూ యెక్కువట.అన్నట్టు దర్శకుడు శ్యామ్ బెనెగళ్ గురుదత్ కి తల్లితరఫు బంధువు
గురుదత్ తండ్రి శివశంకర్ పదుకోనె,తల్లి వాసంతి.గురుదత్ అసలు పేరు "వసంతరావు శివశంకర్ పదుకోనె".అతను జూలై 9న1925లో గురువారం బెంగుళూరులో జన్మించాడు తండ్రికి చాలాకాలం స్థిరమైన ఉద్యోగం లేదు కొన్నాళ్లు టీచరుగానూ,బ్యాంక్ లోనూ ప్రెస్ లోనూ పనిచేసి చివరకు కలకత్తాలో "బర్మా షెల్ "కంపెనీలో గుమస్తా గా దాదాపు ముఫ్పయి సం"రాలు పని చేశాడు.తల్లి టీచర్ ,ఆమెకు బెంగాలీ,కన్నడ సాహిత్యాలతో పరిచయం వుండేది.తల్లిదండ్రుల మధ్య సయోధ్య వుండేది కాదు

గురుదత్ పేరు వెనక చిన్న కథ వుంది అతను పుట్టినపుడు అతని మేనమామ రెండు పేర్లు సూచించాడట ఒకటి "వసంతకుమార్ " అనీ రెండోది గురువారం పుట్టాడు కాబట్టి "గురుదత్ "అనీ .వసంతకుమార్ అనే ఖాయం చేశారట.అయితే అతని రెండో పుట్టినరోజు చక్కగా ముస్తాబయ్యి ఆడుకుంటూ ఒక బావి దగ్గరలో పడిపోయి రెండు వారాలు మూసిన కన్నెరగకుండా జ్వరం తెచ్చుకున్నాడట.ఇదంతా చూసి భయపడిన తల్లి వాసంతి ఎవరో జ్యోతిష్కుడిని అడిగితే అతని నిజమైన పేరుతో పిలవకుండా మార్చి పిలవమన్నాడట .అలా అప్పటినుండీ అతని రెండో పేరు "గురుదత్ "స్థిరపడి పోయింది .అతని పేరు చూసి బెంగాలీ అని భ్రమ పడతారు చాలామంది.అయితే చిన్నతనమంతా కలకత్తాలో గడపడంతో అతనికి బెంగాలీ కల్చరన్నా,ఆ ప్రాంతాలన్నా చాలాఇష్టం. చాలా సినిమాల్లో కథకి అవసరం లేకపోయినా కలకత్తా పరిసర ప్రాంతాలలో షూటింగ్ చేయడానికి ఇష్టపడేవాడట అని రచయిత అబ్రార్ అల్వీ చెబుతాడు, అతని చిన్నతనం విషయానికొస్తే చాలా చిలిపిగా వుండే వాడట,తల్లిని ప్రశ్నలతో వేధించే వాడట.తొందరగా కోపం  కూడా వచ్చేదట. గురుదత్ కుటుంబం బెంగుళూరులో చాలా కొద్ది కాలం గడిపి తండ్రికి స్థిరమైన ఉద్యోగం దొరికాక కలకత్తాలో యెక్కువకాలం గడిపారు రెండవ ప్రపంచ యుధ్ధకాలంలో కుటుంబమంతా బొంబాయికి మకాం మార్చింది.

గురుదత్ కుటుంబం గురించి చెప్పాలంటే అతనే ఇంటికి పెద్ద కొడుకు .అతని తర్వాత శశిధర్ అనే పిల్లవాడు పుట్టి ఏడు నెలల వయసులో చనిపోయాడట .ఇది గురుదత్ ని చాలా బాధించిందట .తర్వాత ముగ్గురు తమ్ముళ్లు ఆత్మారామ్ ,దేవీదత్ ,విజయ్ దత్ ఒక చెల్లెలు లలితా లాజ్మీ.అందరికీ సినిమాతో కొద్దో గొప్పో సంబంధముంది.తమ్ముడు ఆత్మారామ్ అంటే చాలా ఇష్టం అతను గురుదత్ దగ్గర కొన్ని సినిమాలకు అసిస్టెంట్ గా పని చేశాడు .గురుదత్ పోయాక అతని మీద "శ్రధ్ధాంజలి" అనే డాక్యుమెంటరీ తీశాడు .గురుదత్ ,గీతాదత్ ఇద్దరూ పోయాక వారి పిల్లలు ఆత్మారామ్ దగ్గరా గీతా సోదరుడు ముకుల్ రాయ్ దగ్గరా పెరిగారు. సోదరి లలితా లాజ్మీ ఆర్టిస్ట్ పెయింటర్ ఆమె కూతురు కల్పనా లాజ్మీకి కూడా చిత్రసీమతో సంబంధాలున్నాయి.

ఇక విద్యార్థి జీవితం గురించి పరిశీలిస్తే స్కూలులో మంచివిద్యార్థి మెట్రిక్యూలేషన్ పాసయ్యాడు అయితే కాలేజ్ మొహంచూడలేదు.అయితేనేం బెంగాలీ,హిందీ ,ఇంగ్లీష్ బాగా వచ్చు.ఇంగ్లీషులో బాగా మాటాడే వాడట,రాసేవాడట.సాహిత్యం బాగా చదివే వాడట.ఈ విషయంలో అతనిది తండ్రి పోలిక అంటారు తండ్రి కొన్నాళ్లు జర్నలిస్ట్ గా పని చేశాడట.ఇంగ్లీషులో మంచి కవిత్వమూ,వ్యాసాలూ రాసే వాడట అయితే అవేవీ వెలుగు చూడలేదట.అతని తండ్రి యెక్కువ చొరవగా వుండే వాడుకాదట ఆర్థిక సమస్యలూ,కుటుంబ భారం అతనిని అలా తయారు చేసి వుండవచ్చు అంటాడు అతని బంధువు బి.బి. బెనగల్ . భర్త మనస్తత్వానికి  విరుధ్ధంగా చాలా చలాకీగా ,కలుపుగోలుగా వుండేదట గురుదత్ తల్లి.ఆమె హిందీ ,బెంగాలీ,కన్నడ,ఇంగ్లీష్ ,మరాఠీ భాషలలో చదవడం మాటాడటం అతి సులువుగా చేయగలిగేదట.ఆమె కన్నడంలో గురుదత్ గురించి పుస్తకం రాసిందట. ఒక స్కూలులో టీచర్ గా పని చేస్తూ ఇంట్లో ట్యూషన్లు చెప్పేదట .ఆమెకు గురుదత్ ని ఎక్కువ అభిమానించేదట .అతనికి కూడా తల్లి అంటే ప్రత్యేక అభిమానం తన మొదటి సినిమా "బాజీ "హిట్టవ్వంగానే ఆమెకోసం ఒక సీలింగ్ ఫాన్ బహుమతిగా ఇచ్చాడట.గురు దత్ మీద తల్లి దండ్రులిద్దరి ప్రభావమూ పడినట్టు కనపడుతుంది .సాహిత్యం చదవడం రాయడంలో తండ్రి పోలిక వచ్చిందని బి.బి. బెనగల్ చెబుతారు.

ఈ బి.బి .బెనెగల్ అనే ఆయన గురుదత్ జీవితంలో చాలా దశలలో ప్రభావం చూపాడు.ఆయన వాసంతి పదుకోనెకి సోదరుని వరస.ఆయన పెయింటర్ సినిమాలకి హోర్డింగ్స్ రాసేవారు .ఆయనకొక స్టుడియో వుండేది కలకత్తాలో .వాసంతి కుటుంబం ఆర్థిక సమస్యలలో వున్నపుడూ ఇతర సమస్యలలోనూ అనేక రకాలుగా తన పరిథిలో తను సహాయం చేసేవాడు.ఆయనకు గురుదత్ అంటే ప్రత్యేకాభిమానం.గురుదత్ ఆయన వేసిన "జీవన పోరాటం" (struggle for existance)చూసి చాలా ఇష్టపడి తనకు తనే డాన్స్ కంపోజ్ చేసుకుని చేసేవాడట .అప్పుడే అతనికి కళల పట్లవున్న అభిరుచి అర్థమయిందట అలా అతనిలో వుండే కళాకారుడు బయటకొచ్చాడు. ఆ తర్వాత అతను ఉదయశంకర్ (సితార్ మాస్ట్రో రవిశంకర్ సోదరుడు)నడుపుతున్న "ఇండియా కల్చరల్ సెంటర్ " లో చేరి డాన్స్ నేర్చుకోవాలనుకున్నపుడు ప్రోత్సహించి సహాయం చేశాడు. ఈ "ఇండియా కల్చర్ సెంటర్ "నైనిటాల్ దగ్గర అల్మోరాలో విదేశీ నిధులతో నడుస్తూ వుండేది.అందులో నటనలోనూ, నాట్యంలోనూ,సంగీతంలోనూ అంతర్జాతీయ స్థాయిలో శిక్షణనిస్తూ వుండేవారు.ఉద్దండులయిన గురువులుండే వారు.ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ (అన్నపూర్ణాదేవీ,అలీ అక్బర్ ఖాన్ తండ్రీ,రవిశంకర్ కి గురువూ)శంకరన్ నంబూద్రి లాంటి వారు కొంతకాలం అక్కడ పని చేశారు.గురుదత్ సుమారు రెండు సంవత్సరాలు అక్కడ శిక్షణ పొందాడు అది అతనికి తర్వాత చలన చిత్ర జీవితం లో అనేక రకాలుగా వుపయోగ పడి వుంటుందనిపిస్తుంది.

రెండవప్రపంచ యుధ్ధ సమయంలో విదేశీ నిధులాగి పోయి ఆ సెంటర్ మూత పడింది గురుదత్ తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి కుటుంబమంతా బొంబాయి చేరుకుంది .మాతుంగా ప్రాంతంలో వుండే వారు.ఒకటి రెండు సంవత్సరాలు నిరుద్యోగం. ఈ సమయంలో నే "కష్మ కష్ " అనే కథ రాసుకున్నాడు అదే తర్వాత "ప్యాసా " గా రూపుదిద్దుకుందిఅలా కొంతకాలం గడిచాక పూనాలోని "ప్రభాత్ "స్టుడియోలో అసిస్టెంట్ కొరియో గ్రాఫర్ గా చేరడంతో అతని జీవితం ఒక ముఖ్యమయిన మలుపు తిరిగింది. గురుదత్ పూనాలో ప్రభాత్ స్టుడియోలో కొరియో గ్రాఫర్ గా బి.బి. బెనగల్ సహాయంతో ప్రవేశించాడు .ఆయన తనకున్న పరిచయంతో అక్కడ చీఫ్ ఎక్జిక్యూటివ్ గా పనిచేస్తున్న బాబూరావ్ పాయ్ కి గురుదత్ ని రికమెండ్ చేశాడు. "ప్రభాత్ ఫిల్మ్ కంపెనీ" ని ప్రఖ్యాత దర్శకుడు వి.శాంతారామ్ ,వి.జి. దామ్లే,ఫతేలాల్ ,యస్వీ కులకర్ణి లతో కలిసి స్థాపించి ,కొన్నేళ్ల తర్వాత బొంబాయికి మకాం మార్చి తన సొంత కంపెనీ "రాజ్ కమల్ కళా మందిర్ "స్థాపించుకొన్నప్పటికీ ఈ స్టుడియో ఉన్నత ప్రమాణాలలో నడుస్తూ వుండేది. అక్కడ గురుదత్ కొరియో గ్రాఫర్ గానే కాక అసిస్టెండ్ డైరెక్టర్ గా,అప్పుడప్పుడూ నటుడిగా కూడా పనిచేసేవాడు.

అక్కడ అతనికి అమూల్యమయిన స్నేహితులు దేవానంద్ ,రహమాన్ కూడా దొరికారు.దేవానంద్ తో పరిచయం విచిత్రంగా జరిగింది.అక్కడ వుండే దోభీ ఒకరి షర్ట్ లు ఒకరికి మార్చి ఇవ్వడంతో జరిగిన పరిచయం గాఢమైన స్నేహంగా పరిణమించింది.దేవానంద్ ,రహమాన్ ,గురుదత్ ముగ్గురూ కలిసి పూనా రోడ్లమీద సైకిళ్ల మీద తిరిగేవారట. అప్పుడే దేవానంద్ తనూ ఒక ఒప్పందం చేసుకున్నారట ఎవరికి ముందు ఛాన్స్ వస్తే వారు మరొకరిని ప్రమోట్ చెయ్యాలని .అలాగే దేవానంద్ మాట తప్పకుండా తన సినిమా "బాజీ"కి గురుదత్ ని డైరెక్టర్ గా పెట్టుకున్నాడు. ఆ సినిమా చాలామంది జీవితాలలో చాలా ముఖ్యమయిన మార్పులు తీసుకొచ్చింది.ఆ సినిమాలో "తడ్ బీర్ సే బిగడీ హుయీ "పాటతో గురుదత్ ,గీతాదత్ ల మధ్య ప్రేమ అంకురించింది.రచయితగా సాహిర్ లూథియాన్వీకీ,సంగీత దర్శకుడుగా యస్ .డి.బర్మన్ నీ ఒక స్థాయిలో నిలబెట్టింది.గజల్ కనుగుణంగా రాసిన పాటని కేబరే పాటగా మార్చిన ఘనత బర్మన్ దాది.వి.కె మూర్తి లోని ప్రతిభని గురుదత్ కనిపెట్టింది ఈ సినిమాలోనే.  ప్రభాత్ స్టుడియోలో రెండు సం"రాలు పనిచేసిన తర్వాత,బాబూరావ్ పాయ్ బొంబాయిలో సొంతగా స్టుడియో ప్రారంభించేటపుడు ఆయనతో పాటు తల్లి అభ్యర్థన మేరకు బొంబాయి చేరుకుని అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయనారంభించాడు గురుదత్.

అలా 1947నుండీ 1950 వరకూ అమియా చక్రవర్తి దగ్గరా,గ్యాన్ ముఖర్జీ వద్దా అసిస్టెంట్ గా పనిచేసిన అనుభవం చాలా ఉపయోగపడింది.ముఖ్యంగా గ్యాణ్ ముఖర్జీ అంటే అతనికి చాలా గౌరవాభిమానాలు.గ్యాన్ ముఖర్జీ బాగా చదువుకున్నవాడూ,సైంటిస్ట్ గా పనిచేసినవాడూ.అతని దగ్గర పెద్ద లైబ్రరీ వుండేదట అప్పటికే "కిస్మత్ "సినిమా తీసిపేరు గడించాడు.ఆయన మీదున్న అభిమానానికి నిదర్శనంగా "ప్యాసా" సినిమాను ఆయనకు అంకితం చేశాడు గురుదత్ .1950లో దేవానంద్ సినిమా "బాజీ"తో దర్శకుడుగా మారాడు.అది సూపర్ హిట్టయ్యింది. సినిమా అంటే సమిష్టి కృషి కాబట్టి మంచి టీమ్ ని యేర్పాటు చేసుకోవాలి అనే విషయం గురుదత్ బాగా గ్రహించి వుండాలి .అతని దగ్గర చాలా మంచి టీమ్ వుండేది. టాలెంట్ని పసికట్టడంలో అతనిని మించిన వాళ్లు లేరు."బాజీ"తీసే సమయంలో ఆ కథా రచయిత బలరాజ్ సాహ్ని ద్వారా పరిచయమైన బద్రుద్దీన్ జమాలుద్దీన్ ఖాజీ లో వున్న కమెడియన్ ని గుర్తు పట్టి అతని పేరు "జానీ వాకర్ " గా మార్చి తను తీసిన ప్రతిసినిమాలోనూ స్థానం కలిపించడమే కాక అతనితో చాలా స్నేహంగా వుండేవాడట.

"బాజ్ "సినిమా తీసే సమయంలో పరిచయమైన అబ్రార్ అల్వీ లో అద్భుతమైన రచనా ప్రతిభ దాగుందని కనిపెట్టి అతనిని ప్రోత్సహించి చివరి వరకూ తన చిత్రాలకు రచయితగానూ "సాహిబ్ బీబీ అవుర్ గులామ్ "కి దర్శకుడు గానూ అవకాశ మిచ్చాడు "బాజీ" సినిమాలో ఒక కష్టమయిన షాట్ ని ఉపాయంగా తీసిన అసిస్టెంట్ సినిమటోగ్రాఫర్ వి.కె. మూర్తిని గుర్తించి నా తర్వాత సినిమాకి నువ్వే సినిమటో గ్రాఫర్ వి అని చెప్పి ఆ ప్రామిస్ ని నెరవేర్చడమే గాక వరసగా తన సినిమాలన్నిటిలో అవకాశ మిచ్చాడు "కాగజ్ కే ఫూల్ "లో సినిమటో గ్రఫీ కి చాలా పేరొచ్చింది. ఇక మ్యూజిక్ డైరక్టర్లుగా సాధారణంగా యస్ .డి .బర్మన్ ,ఓ.పి.నయ్యర్ ,హేమంత్ కుమార్లను ఇష్టపడేవాడు."చౌదవీ కా చాంద్ "కి మాత్రం రవి ని తీసుకున్నాడు. గురుదత్ సినిమాలలో పాటల చిత్రీకరణ చాలా ప్రత్యేకంగా వుంటుంది.అవి సన్నివేశానికి పరిపుష్టత చేకూర్చడానికీ,ఒక మూడ్ ని సృష్టించడానికీ వుపయోగించాలే గానీ ప్రేక్షకుడు పాట వచ్చినపుడు బయటకు లేచి వెళ్లేటట్టుగా వుండ గూడదని శ్రధ్ధ తీసుకునే వాడట. తన చిత్రాలు ఇతరులెవరైనా డైరెక్ట్ చేసే వాటిల్లో పాటలు మాత్రం వాళ్లకు వదలకుండా తనే డైరెక్ట్ చేసే వాడట అబ్రార్ అల్వీ చెబుతాడు.

అతని ప్రొడక్షన్ ఎక్జిక్యూటివ్ గా గురుస్వామి అనే అతను వుండే వాడు అతనితో పరిచయంబాంబే స్టుడియోస్ నాటినుండీమొదలయి చివరి వరకూ కొనసాగింది. పాటల రచయితలుగా కొనసాగిన వారు సాహిర్ లూథియాన్వీ,కైఫీ ఆజ్మీ,మజ్రూహ్ సుల్తాన్ పురీ.వీరిలో సాహిర్ "బాజీ" నుండీ "ప్యాసా "వరకూ అధ్భుతమైన పాటలందించాడు.ప్యాసా లో వాడుకున్న కవితలన్నీ సాహిర్ రాసిన "తలాఖియా"అనే పుస్తకం లో నుండీ తీసుకున్నవి. ఇక గాయనీ ,గాయకులుగా రఫీ, గీతా ,హేమంత్ లు చూపిన ప్రతిభ మాటలకందనిది.గురుదత్ సినిమాలలోని పాటలలో రఫీ తన ప్రాణప్రతిష్ట చేశాడనిపిస్తుంది.గీతా ,హేమంత్ లు అందుకేమీ తీసిపోలేదు
అలాంటి మంచి టీమ్ తో కావలసిన యెఫెక్ట్ కోసం యెక్కడా రాజీ పడకుండా ఆణిముత్యాల్లాంటి సినిమాలను మన కందించాడు గురుదత్ ఇక "బాజీ"లో అంకురించిన ప్రేమ పండి పెళ్లికి దారి తీయడానికి రెండు సం"రాల కాలం పట్టింది .ఈ సమయం కూడా గీతా తల్లిదండ్రులను ఒప్పించడానికే.సంపాదనా పరురాలయిన ఆమెను వదులుకోవడానికి వారు తొందరగా ఇష్టపడలేదట .వారి పెళ్లి సమయానికి ఆమె పేరొందిన గాయని అతను అప్పుడే పరిశ్రమలో ప్రవేశించి నిలదొక్కుకోడానికి ప్రయత్నిస్తున్న యువ దర్శకుడు.చాలా మంది అతనామెని సంపాదన కోసమే చేసుకున్నాడని చెవులు కొరుక్కున్నారట మొదట్లో.అతనికి ప్రభాత్ స్టుడియోలో వున్నపుడే ఒకటి ,రెండు చిన్న చిన్న ప్రణయాలున్నా అవి పెళ్లికి దారితీసేంత గాఢమయినవి కావు.

1953లో ఇద్దరూ యెంత ఆనందంగా వివాహబంధంతో ఒక్కరయ్యారు, కొంతకాలం   వారి జీవితం సాఫీగా ఆనందంగానే సాగింది అయితే నెమ్మదిగా వారి స్వభావాల మధ్య వున్న వైరుధ్యం వారి వివాహ జీవితం మీద ప్రభావం చూపసాగింది. ఆలోచిస్తే అసలు ఇద్దరు గొప్ప ఆర్టిస్టులు పెళ్లి చేసు కోకూడదేమో అనిపిస్తుంది నాకు. గురుదత్ అంతర్ముఖుడు ,సోషల్ ఫంక్షన్స్ ని ఇష్టపడడు వృత్తి జీవితంలో యెంత క్రమశిక్షణగా వుంటాడో వ్యక్తిగత జీవితంలో అంత అరాచకంగా వుంటాడు కుటుంబాన్ని పట్టించుకోడు అంటాడు అతని తమ్ముడు ఆత్మా రామ్. గీతా చాలా కలుపుగోలు మనిషి,యెప్పుడూ చుట్టూ స్నేహితులుండాలి,సరదాలూ,సంతోషాలూ ,సోషల్ పార్టీలు. స్వభావ రీత్యా ఇద్దరికీ పడక పోవడం మొదలయి నెమ్మదిగా వారి వివాహ జీవితం బీటలు వారడం మొదలయింది.

953మే 26వతారీఖున పెళ్లాడిన గురుదత్ ,గీతాదత్ లకు 1954జూలై 9వ తారీఖున సరిగ్గా గురుదత్ పుట్టిన రోజునే తరుణ్ జన్మంచాడు.అందుకేనేమో తండ్రికి ఆ కొడుకంటే ఎక్కువ ఇష్టం, 1956లో అరుణ్ జన్మించాడు తర్వాత ఆరేళ్లకి ఆడపిల్లకోసం తపించి పోతున్న గురుదత్ కి 1962ఆగస్ట్ 19వతేదీ నీనా జన్మించింది. ఈ మధ్య కాలంలో వారి వివాహ జీవితంలో అనేక సార్లు తగాదాలూ,విడిగా వుండడాలూ జరుగుతూనే వున్నాయి .వారి మధ్య విభేదాలకు గురుదత్ కీ వహీదారహమాన్ కీ వున్న అనుబంధమే కారణమనే వొక అభిప్రాయం కూడా బలంగా వుంది. అసలు వహీదా తో పరిచయమే అతి విచిత్రంగా జరిగిందంటాడు రచయిత అబ్రార్ అల్వీ.

అదెలా అంటే"బాజీ "విజయం సాధించాక అదే బాటలో ఇంకో రెండు రొమాంటిక్ క్రయిమ్ థ్రిల్లర్స్ "జాల్ ","బాజ్ "తీశాడు గురుదత్ .మొత్తం మూడు సినిమాలలో గీతాబాలి హీరోయిన్ ."బాజ్ "సినిమాకి ఆమె సోదరి హరిదర్శన్ కౌర్ గురుదత్ కి సహనిర్మాత.HG ఫిల్మ్స్ పేరుతో తీశారు .ఆ సినిమా తీసే సమయంలో ఆమెప్రేమికుడూ నటుడూ అయిన యశ్వంత్ కి బంధువయిన అబ్రార్ అల్వీ షూటింగ్ చూడటానికి వస్తూ వుండేవాడు.గురుదత్ అతనిలో మంచి రచయిత దాగున్నాడని గ్రహించి తన తదుపరి సినిమా "ఆర్ పార్ "కి రచయితగా నియమించుకున్నాడు అది సూపర్ హిట్టయ్యింది అప్పటినుండీ అతను చివరి వరకూ గురుదత్ కి ఆస్థాన రచయితగానూ ఆంతరంగిక మిత్రుడుగానూ మిగిలాడు. అబ్రార్ రాసిన "మోడ్రన్ మారేజ్ "అనే కథ ఆధారంగా మిస్టర్ అండ్ మిసెస్ 55రూపొందింది.

అందులో హీరో కార్టూనిస్ట్ .ఆ సినిమాలో వాడిన కార్టూన్లన్నీ ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్శణ్ వి గీసే చెయ్యి కూడా అతనిదే .ఈ సటిల్ కామెడీ పిక్చర్లో హీరోయిన్ మధుబాల అందంగా హాస్యాన్ని పండించింది .హీరో పాత్రని కూడా చక్కటి కామెడీ టచ్ తో తీర్చిదిద్దాడు అబ్రార్ అల్వీ .ఇది ఘన విజయం సాధించింది.తర్వాత సినిమా సబ్జెక్ట్ కోసం వెతుకుతుంటే తెలుగునాట "మిస్సమ్మ "అనే సినిమా సంచలనాలు సృష్టిస్తోందనీ అది చూసి దానిని హిందీలో రీమేక్ చేస్తే బాగుంటుందనీ గురుదత్ కి హైద్రాబాద్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ సూచించాడు.అబ్రార్ ని హైద్రాబాద్ వెళ్లి చూసి రమ్మన్నాడు గురుదత్ .అయితే ఫ్లయిట్ కీ,ట్రెయిన్ కీ టికెట్లు దొరకక పోవడంతో కారులో బయలు దేరిన అబ్రార్ గురుదత్ ని కూడా తోడు రమ్మన్నాడు. అలా బయలుదేరిన వారి కారుకి ఒక ఎద్దుల బండి అడ్డం వచ్చి యాక్సిడెంటయి కారు బాగవ్వడానికి రెండు మూడురోజులు పట్టింది.ఆసమయంలో వాళ్లు "మిస్సమ్మ "చూశారు కానీ యెందుకో గురుదత్ కి ఆ సినిమా నచ్చలేదు.ఈ లోగా వారు మాట్లాడుకుంటున్న ఆఫీసు యెదురుగా బిల్డింగ్ లోకి ఒక తార కారులో రావడం వీథిలో పిల్లలు ఆమె కారు వెంటపడటం చూసి "ఎవరామె" అని అడిగితే ,ఆమె ఒక వర్థమాన నృత్య తార అనీ "రోజులు మారాయి "లో ఆమె చేసిన డాన్స్ ప్రజలకు వెర్రెక్కిస్తోందనీ ,ఆమె పేరు వహీదా రెహమాన్ అనీ చెప్పారట.అంతేకాక ఆమెను ఆఫీసుకి పిలిచి వీరికి పరిచయం చేశారట.ఆమె సాదా సీదాగా వుండి ముక్తసరిగా దక్షిణాది యాసతో వున్న హిందీ మాట్లాడిందట.తర్వాత "రోజులు మారాయి "లో ఆమె డాన్స్ కూడా చూసి గురు దత్తూ,అబ్రార్ ఆమె ముఖం ఫోటోజెనిక్ గా వుందని అభిప్రాయ పడ్డారు.

బొంబాయి వచ్చాక "సిఐడి"సినిమా నిర్మాణ సమయంలో ఒక వాంప్ కారెక్టర్ కి వహీదాని గుర్తు చేసుకుని తమ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మూడేళ్లకు కాంట్రాక్ట్ రాయించుకుని బుక్ చేయమన్నాడు గురుదత్ .అది ఆ తర్వాత అయిదేళ్లయింది.ఆమె ను సినిమా కోసం పేరు మార్చుకోమన్నా, ఆమెకు ఇష్టం లేని దుస్తులు వేసుకోమన్నా ఖరాఖండిగా తిరస్కరించింది వహీదా .ఇది ఆమె రాజీ పడని స్వభావాన్నీ ,ధృఢ నిర్ణయాన్నీ సూచిస్తుంది "సిఐడీ" లో ఆమె కు నటన విషయంలోనూ ,డైలాగులు పలకడంలోనూ శిక్షణ ఇచ్చింది గురుదత్ ఆదేశం ప్రకారం అబ్రార్ అల్వీ . ఆమె చాలా పట్టుదలగా నేర్చుకొని మంచి నటి గా పరిణతి చెందింది .ఆమె పర్ఫార్మెన్స్ చూసి "ప్యాసా "లో "గులాబ్ "రోల్ ఇచ్చారు.ఈ సినిమాలో కూడా అబ్రార్ తర్ఫీదు కొనసాగింది "ప్యాసా" గురుదత్ నిరుద్యోగ పర్వంలో ,నిరాశా దినాలలో రాసుకున్న "కష్మ్ కష్ "ఆధారంగా అబ్రార్ కథా,మాటలూ సమకూర్చాడు .ఇది గురుదత్ "మాగ్నమ్ ఓపస్ "గా చెబుతారు.

సాహిర్ లూథియాన్వీ పాటలూ,బర్మన్ దా సంగీతం,గాయనీ గాయకులు రఫీ,గీతా,హేమంత్ పాడిన విధానం,నటీనటులందరూ తమ పాత్రలకు న్యాయం చెయ్యడం (ముఖ్యంగా వహీదా నటనా,అందం ఈసినిమాలో వంక పెట్ట లేనట్టుగా వుంటాయి)ఈ సినిమాని అజరామరమైన కళాఖండంగా మలిచాయి .మన తెలుగులో వచ్చిన "మల్లెపూవు "దీనికి పేలవమైన అనుకరణ."సిఐడి" సమయంలోనే వహీదా,గురుదత్ ల గురించి సినీ జీవులు చెవులు కొరుక్కున్నారు."ప్యాసా" సమయానికి గురుదత్ కీ భార్యకీ గొడవలు తారస్థాయిలో వున్నాయి .అతను మొదటి సారి ఆత్మ హత్యా ప్రయత్నం కూడా చేసి అదృష్ట వశాత్తూ బయట పడ్డాడు.

గీతాదత్ పరిణతి చెందని ప్రవర్తనా,అనుమానించే స్వభావమూ గురుదత్ ని మరింతగా వహీదాకి దగ్గర చేశాయేమో.అబ్రార్ అల్వీగానీ,గురుదత్ తల్లీ ఇతర కుటుంబ సభ్యులూ గానీ గురుదత్ కి వహీదానే ఇంటలేక్చ్యువల్ గా తగిన జోడీ అని భావించే వారట.అయితే అంతర్ముఖుడూ ,గుట్టు మనిషీ అయిన గురుదత్ యెక్కడా యెవరి దగ్గరా తమ సంబంధం గురించి మాట్లాడలేదట .చివరికి ఎంతో ఆంతరంగిక మిత్రుడయిన అబ్రార్ దగ్గరకూడా.అతని సోదరుడు ఆత్మారామ్ యేమంటాడంటే "గురుదత్ ,గీతా ఇద్దరూ గొప్ప ఆర్టిస్టులూ ,మంచి వాళ్లూ కానీ వారి ఇంటలెక్చ్యువల్ లెవల్స్ వేరు "అని.

అబ్రార్ అల్వీ కి వహీదా తల్లి గారితో కూడా పరిచయముండేదట ఆమె అతనితో "మా అమ్మాయి జీవితం యేం కాబోతోంది అతను పెళ్లాం ,పిల్లలున్న వాడు.మా అమ్మాయి కోసం ప్రాణాలయినా ఇస్తానంటున్నాడట . మా అమ్మాయి ఇవా ళొకళ్లనీ రేపొకళ్లనీ మార్చే మనిషి కాదు" అని. గీతా అబ్రార్ దగ్గరకొచ్చి "నీ స్నేహితుడికి చెప్పూ అతను వహీదా పిచ్చిలో వున్నాడు" అని బాధపడిందట
అబ్రార్ యేమంటాడంటే ఇంట్లో కోల్పోయిన సుఖమూ -శాంతీ గురుదత్ కి వహీదా దగ్గర దొరికాయేమో అనుకున్నాం మేమెవ్వరమూ దానిని తప్పుగా భావించలేదు కానీ వారిద్దరి మధ్యా వున్నది మానసిక బంధమే శారీరక సంబంధం లేదు అని. ఇటు వహీదా వైపునుండీ ఆలోచిస్తే ఒక చిన్న టౌన్ అయిన బెజవాడ నుండీ(అలా అని అబ్రార్ పుస్తకంలో వుంది)గురుదత్ ని నమ్ముకుని తల్లీ,సోదరి సయీదా లతో బొంబాయి చేరుకుంది .అతనే ఆమెకు మార్గదర్శి,గురువూ,తనని మంచినటిగా తీర్చి దిద్దిన వాడూ.హఠాత్తుగా తల్లి మరణించిన ఒంటరి తనం లో తోడు గా నిలిచాడు సహజంగా ఆకర్షణ కలిగి వుంటుంది.అయినప్పటికీ వహీదా ఈనాటి వరకూ తనిచ్చిన యే ఇంటర్వ్యూలోనూ తమ మధ్య అనుబంధం వున్నట్టు ధృవీకరించలేదు"ఆయనొక గొప్ప డైరెక్టర్ నన్ను హిందీ చిత్రసీమకు పరిచయం చేసి నటిగా మంచి అవకాశాలిచ్చారు అంతకు మించి మా మధ్య యే అనుబంధం లేదు" అంటుంది

గురుదత్ సోదరి లలితా లాజ్మీ యేమంటుందంటే గురుదత్ సినిమాలలో వేసిన పాత్రలు అతని నిజజీవితం మీద ప్రభావం చూపాయనీ వాటిలో వుండే నైరాశ్యం అతనిని నిజజీవితంలో కూడా వెంటాడిందనీ. అందుకు ఉదాహరణగా "ప్యాసా", "కాగజ్ కే ఫూల్ "పాత్రలను చెప్పుకోవచ్చు. "కాగజ్ కే ఫూల్ "సినిమాకు గురుదత్ జీవితమూ,అతని రోల్ మోడల్ గ్యాన్ ముఖర్జీ జీవితమూ ఆధారమంటారు.అది భారత దేశంలో నిర్మించిన మొట్టమొదటి సినిమా స్కోప్ చిత్రం.దానికోసం వి.కె.మూర్తిని విదేశాలకు కూడా పంపాడు గురుదత్ .బెస్ట్ సినిమటోగ్రఫీ అవార్డు కూడా గెలుచుకుంది .కానీ బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది.ఆసినిమా ఫ్లాపవడం గురుదత్ ని బాగా కృంగ దీసింది మళ్లీ ఇక డైరక్షన్ చెయ్యనని తీర్మానించాడు చెయ్యలేదుకూడా.విచిత్రంగా ఈసినిమా తర్వాత్తర్వాత గొప్ప క్లాసిక్ గా పేరొందింది.

తర్వాత తీసిన "చౌదవీకా చాంద్ "సూపర్ హిట్ దర్శకుడిగా యం.సాదిక్ ని ఎన్నుకున్నప్పటికీ పాటలను తనే చిత్రీకరించాడు  ఆ సినిమాలో వహీదాను తన మనసు తీరా అందంగా చూపెట్టాడంటారు. 1962లో వచ్చిన "సాహిబ్ బీబీ ఒౌర్ గులామ్ "ఒక రకంగా అతని చివరి చిత్రం .దీనికి బిమల్ మిత్రా కథ ఆధారం.దర్శకుడు అబ్రార్ అల్వీ.మీనా కుమారి హీరోయిన్ .ఆమె నిజ జీవితం మీద ఈ పాత్ర ప్రభావం వుందంటారు.ఈ సినిమా దర్శకుడిగా అబ్రార్ మంచి ప్రతిభ చూపాడు ,పాటలు మాత్రం గురుదత్ చిత్రీకరించాడు అయితే చాలామంది అబ్రార్ అల్వీ పేరుపెట్టి గురుదత్తే దర్శకత్వం వహించాడని అపోహ పడతారట అబ్రార్ చాలా వాపోయాడు.నాకు గురుదత్ సినిమాలన్నింటిలో ఇష్టమయిన సినిమా.ఈ సినిమాలో గీతాదత్ వహీదాకు ప్లేబాక్ పాడనందట అందుకే ఆషా భోన్స్ లేతో పాడించారు.గీతా పాడిన రెండు పాటలూ మీనా కుమారి మీదనే చిత్రీకరించారు.ఈ సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డూ,ప్రెసిడెంట్స్ అవార్డూ వచ్చాయి బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు అనుతించారు.

ఈ సినిమా చిత్రీకరణ చివరి రోజులలో గురుదత్ ,గీతాదత్,వహీదాల మధ్య వున్న ముక్కోణపు ప్రేమకథ ముగిసిపోయింది ఎలాగంటే వహీదా,గురుదత్ లని అనుమానించిన గీతా యేదో ప్రోగ్రామ్ కి లండన్ వెళ్లి తిరుగు ప్రయాణంలో కాశ్మీర్ వెళ్లిపోయిందట.ఎంతకూ రాని గీతా కోసం కబురు చేస్తే గుర్రం మీదనుండీ పడ్డాననీ కాలర్ బోన్ ఫ్రాక్చరయ్యిందనీ తెలిపిందట.తన అసిస్టెంట్ ని పంపి ఆమవేరొకరితో స్నేహంగా మసులుతున్నట్టు తెలుసుకున్న గురుదత్ ఈగో హర్టయ్యిందట.వెంటనే తన ప్రవర్తనలో మార్పు వచ్చిందట వహీదాను దూరం పెట్టాడట.తనస్టుడియోలో ఆమెకొక మేకప్ రూమ్ వుండేదట అందులో అడుగు పెట్టటానికి వీల్లేదని ఒక మనిషితో చెప్పించాడట.అలా రెండురోజులు జరిగేటప్పటికి ఆమె కళ్లనీళ్లతో వెనక్కి తిరిగి వెళ్లిపోయిందట.ఇదంతా అబ్రార్ కి చెప్పి బాధపడిందట మళ్లీ స్టుడియోలో అడుగు పెట్టడానికి ఇష్టపడలేదట.మళ్లీ ఆఖరి సీన్లో ఆమె తో అవసరం పడి అడిగితే యెంతకీ ఒప్పుకోలేదట .చివరికి యెంతో బతిమాలగా యెన్నో షరతులు పెట్టి షూటింగ్ కి వచ్చిందట .అవి అతనితో మాటాడను,అతను నన్ను ముట్టుకోకూడదు ఇలాని.. అలాని... అబ్రార్ గురుదత్ ని ఈ విషయమై నిలదీశాడట "పెళ్లాం,పిల్లలున్న వాడివి నిన్ను ఇంకో సంబంధం పెట్టుకోమని యెవరం ప్రోత్సహించం యేదో ఓదార్పు కోరుకుని ఆమెకు దగ్గరయ్యావని మేమంతా అనుకున్నాం.అలాంంటిది ఆమెను కారణం చెప్పకుండా కఠినంగా దూరం పెట్టడం న్యాయమా "అని ఏమీ సమాధానం చెప్పలేదట గురుదత్ .అప్పటి నుండీ ఒకరినొకరు కన్నెత్తి చూసేవారు కాదట పన్నెత్తి పలకరించుకునే వారు కాదట.

ఆ తర్వాత గురుదత్ కాశ్మీర్ వెళ్లి గీతాను ప్రసన్నం చేసుకుని అక్కడే కొంతకాలం గడిపి వచ్చారట అప్పుడే అతనుకోరుకున్నట్టుగా అమ్మాయి పుట్టింది 1962ఆగస్ట్ 19న. 1961లో "సాహెబ్ బీబీ ఒౌర్ గులామ్ "నిర్మాణం చివరి దశలో దూరమైన వహీదా,గురుదత్ మళ్లీ కలవలేదు వారిమధ్య దూరం అలాగే వుండిపోయింది.ఆ సినిమా లో బాకీ వున్న సీన్లో నటించడానికి వహీదాని యెంతో బతిమాల వలసివచ్చింది దర్శకుడయిన అబ్రార్ అల్వీకి అని చెప్పుకున్నాం కదా .విచిత్రంగా ఆ కాంబినేషన్ సీన్లో నటించడానికి గురుదత్ కూడా ఆసక్తి చూపలేదట "ఆమె లేకుండా "కుదరదా అని అడిగాడట. ఆ తర్వాత రెండేళ్లకి 1963లో బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కలసినపుడు కూడా ఇద్దరూ ఒక్క మాట మాటాడుకోలేదట యెడ మొహం పెడ మొహమేనట.అటునుండీ లండన్ వెళ్లిపోయిన వహీదాకి యేమైనా సహాయం అవసరమైతే చేయమని అబ్రార్ అల్వీ తనకూ,గురుదత్ కీ తెలిసిన కామన్ ఫ్రెండ్ లండన్లో వుండే ఒకాయనకి లేఖ రాసిస్తే ,దానిని కూడా తప్పు పట్టాడట గురుదత్ ."నీకా లండనాయన్ని పరిచయం చేసింది అందరికీ వుత్తరాలు రాసిమ్మనా"అని కోపంగా మాటాడాడట.

గీతా ,గురుదత్ ల మధ్య సమస్యలు సమసిపోయి సయోధ్య నెలకొన్నట్టే కనపడింది .కాశ్మీర్ నుండీ వచ్చాక ఇద్దరూ కలిసే జీవించ సాగారు.1964సం"మొదట్లో మళ్లీ తగాదాలతో విడిపోయి ఇద్దరూ విడి విడిగా నివసించడం మొదలుపెట్టారు.గీతా ముగ్గురు పిల్లలతో కలిసి తల్లిదగ్గర "శాంతాక్రజ్ "ప్రాంతంలోనూ,గురుదత్ తన నమ్మినబంటు రతన్ తో కలిసి పొద్దార్ రోడ్ లోని ఆర్క్ రాయల్ అనే ఫ్లాట్ లోనూ వుండేవారు.అబ్రార్ అల్వీ సాయంత్రాలు తప్పకుండా అక్కడే గడిపే వాడు గురుదత్ నిర్వేదంగా వుంటున్నాడని తెలిసి. గురుదత్ సొంత సినిమా "బహారే ఫిర్ భీ ఆయేగీ "లతీఫ్ దర్శకత్వంలో తనూజ,మాలాసిన్హా హీరోయిన్లుగా ,గురుదత్ హీరోగా మొదలయింది.అబ్రారే రచయిత.స్టుడియో నడవడానికీ ,కంపెనీ ఖర్చులకోసం గురుదత్ బయటి చిత్రాలలో కూడా నటించడం మొదలు పెట్టాడు.అందులో కొన్ని దక్షిణాది వారి చిత్రాలు కూడా వున్నాయి.కె.ఆసిఫ్ "లవ్ అండ్ గాడ్ "నిర్మాణంలో వుంది.

గురుదత్ లో గూడుకట్టుకున్న నిర్వేదం అతనిని అతిగా మద్యం సేవించడానికీ ,నిద్రమాత్రలకీఅలవాటు పడేటట్టు చేసింది."ఇంకా యేం చూడాలి జీవితంలో విజయాన్నీ చూశానూ,ఓటమీనీ చూశాను.అనుకున్నవన్నీ జరిగాయి అంటూ యే దునియా అగర్ మిల్ భి జాయేతో క్యా హై "అనే"ప్యాసా" లోని పాటను వుదహరించే వాడట అతని సినిమటోగ్రాఫర్ వి.కె.మూర్తి చెబుతాడు. 1964అక్టోబర్ 9వతేదీ మధ్యాహ్నం గురుదత్ "బహారే ఫిర్ భీ ఆయేగీ(వసంతం తిరిగి మళ్లీ వస్తుంది)షూటింగ్ లో చాలా ఉల్లాసంగా కనపడ్డాడు .అతనికి పిల్లలంటే చాలా ఇష్టం ముఖ్యంగా ఆడపిల్ల నీనా అంటే .షూటింగ్ కి పిల్లలను పంపమని కబురు చేస్తే గీతా పంపింది .వారితో కలిసి తనకెంతో ఇష్టమయిన గాలిపటాలెగరవేశాడు .అందరూ కలిసి తనూజ,మాలాసిన్హా,తన సోదరుడూ దేవీదత్ లను కూడా కలుపుకుని భోంచేశారు .పిల్లలను షాపింగ్ కి తీసికెళ్లి వాళ్లకు కావలసినవీ,తమ్ముడు దేవీకి కావలసినవీ కొనిపెట్టాడు .సాయంత్రం పిల్లలను తల్లి దగ్గరకు పంపించి వేశాడు .

సాయంత్రం "ఆర్క్ రాయల్ "నివాసం చేరుకున్న అబ్రార్ కి గురుదత్ చాలా సేపటినుండీ తాగుతున్నట్టు కనపడ్డాడు సహాయకుడు రతన్ సాయంత్రం అయిదున్నరనుండీ తాగుతున్నారని చెప్పాడు.
అబ్రార్ తో గురుదత్ తనకు ఒక స్నేహితుడు పిచ్చాసుపత్రి నుండీ రాసిన లేఖ చదివాననీ అది తనను కలచి వేసిందనీ అసలు అతను పిచ్చిలో రాశాడంటే నమ్మేట్టుగా లేదనీ అప్పుడప్పుడూ తనకు డా పిచ్చెక్కుతుందేమోనని భయంగా వుంటుందనీ చెప్పాడు .కాసేపటికి కూడావున్న తమ్ముడితో బయటకు వెళ్లి గీతాకి పిల్లలని పంపమని ఫోన్ చెయ్యమన్నాడు.అతను ఫోన్ చేసి తిరిగి వచ్చి "పిల్లలు మధ్యాహ్నమంతా తిరిగి అలసిపోయారు రేపు పంపుతానని చెప్పిందని" చెప్పాడు.దాంతో చిరాకు పడ్డాడు గురుదత్ .కాసేపటికి దేవీ వెళతానని చెప్పి వెళ్లిపోయాడు.టాక్స్ కన్సల్టంట్ మిస్టరగోల్ అనే ఆయన కూడా వచ్చి చేరాడు కలసి మద్యం సేవించ సాగారు,అబ్రార్ షూటింగ్ జరుగుతున్న సినిమాలో ఆఖరిసీన్ మాలాసిన్హా చనిపోయే సీన్ రాస్తున్నాడు .అతనికి అప్పుడు తెలీదు తనముందు జరిగేది గురుదత్ జీవితంలో ఆఖరి సీనని. మళ్లీ గురుదత్ కిందకు వెళ్లి పిల్లలకోసం ఫోన్చేసి "పిల్లలను ఇప్పుడు పంపకపోతే రేపు నా శవాన్ని చూస్తావు " అని బెదిరించినట్టు అతని మాటలవలన అబ్రార్ కి తెలిసింది.మిస్టర్ గోల్ కూడా వెళ్లాక గురుదత్ ,అబ్రార్ కలసిడిన్నర్ తీసుకున్నారు గురుదత్ సరిగా తినకుండానే లేచి "అబ్రార్ నువ్వేమనుకోకపోతే నేనిక పడుకుంటాను "అన్నాడు అవే అతని ఆఖరు మాటలు.అబ్రార్ తిరిగి తను పనిచేస్తున్న వేరే సినిమా ఆఫీసుకి వెళ్లిపోయాడు.

అతని సహాయకుడు రతన్ చెప్పిన ప్రకారం తెల్లవారుజామున మూడుగంటల ప్రాంతంలో లేచిన గురుదత్ అబ్రార్ వున్నాడా అని అడిగి తాగడానికి ఒకసిసా వెతుక్కుని తీసుకుని మళ్లీ తన గదిలోకి వెళ్లి తలుపేసుకున్నాడని. తెల్లవారి అనేక సార్లు ఫోన్చేసిన గీతా పదకొండు గంటల ప్రాంతంలో తలుపులు పగలకొట్టించి చూస్తే యేముందీ తిరిగి రాని వసంతంలా విగత జీవుడై పడి వున్నాడు గురుదత్ .ఎదురుగా టీపాయ్ మీద ఖాళీగ్లాసూ,పక్కమీద సగం చదివిన హిందీ నవల.గ్లాసులో వున్న ద్రవాన్ని పరీక్షించి నిద్రమాత్రల అవశేషాలున్నాయనీ,తెల్లవారుజామున అయిదూ,ఆరుగంటల మధ్య మరణం సంభవించి వుంటుందనీ నిర్ధారించారు డాక్టర్లు .అలా ముఫ్పయి తొమ్మిదేళ్లకే దర్శకమేధావి గురుదత్ శకం ముగిసి పోయింది

గుండె పగిలిన గీతా ఆర్నెల్ల వరకూ కన్నబిడ్డలను కూడా గుర్తు పట్టలేదట.తన జ్యూయలరీ అమ్మి కొంతవరకూ అప్పులు తీర్చిందట.కోల్పోయిన కెరీర్ పొందడానికీ ,ఆర్థికావసరాలకోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలప్రయత్నాలే అయ్యాయి.చివరకు సినిమాలలో నటించడానికి కూడా సిధ్ధపడింది.ఆఖరికి తను కూడా అతిగా మద్యం సేవించిన కారణంగా వచ్చిన లివర్ సమస్యతో 1972లో ఈ లోకం నుండీ శాశ్వతంగా శెలవు తీసుకుంది. వారి పిల్లలు తల్లి దండ్రులస్మ్రతికి నివాళిగా"మాసూమ్ "అనే సినిమా సమర్పించారు. కొన్ని కుటుంబాలను విధి వేటాడుతూనే వుంటుంది.తరుణ్ చిన్నవయసులో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.అరుణ్ అతిగా మద్యం సేవించి లివర్ సమస్యత మరణించాడు.కూతురు నీనా నటుడు మహమూద్ సోదరి కొడుకు నౌషద్ ని పెళ్లి చేసుకుని గాయనిగా తన తల్లికి "శ్రధ్ధాంజలి "గా ఒక ఆల్బమ్ రిలీజ్ చేసింది

గురుదత్ భౌతికంగా మన మధ్య లేక పోయినా అతని చిత్రాలు మనకు అతనేమిటో చెబుతాయి.అలా అతనిని ప్రేక్షకుల మదిలో చిరంజీవిని చేశాయి.అందుకే నేనంటాను అతనికి మరణం లేదని .ఒక "ప్యాసా "ఒక "కాగజ్ కే ఫూల్ ""ఒక "సాహిబ్ బీబీ ఔర్ గులామ్ "తీయాలంటే ఇంకో గురుదత్ పుట్టాలిసిందే.

Comments

  1. చాలా గొప్పగా వ్రాసారండి. నేను ముంబయి, మాటుంగా UDCT లో చదువు కొనేటప్పుడు, కాలేజ్ కి దగ్గరలో అరోరా థీయేటర్ ఉండేది. అందలో "గురుదత్ వీక్" అని వారం పొడుగూతా వారి సిమాలు వేసేవారు..అప్పుడు చూసాను మీరు పేర్కొన్న గురుదత్ సినిమాలన్నీ.
    A fiiting tribute to a great actor, director....
    ధన్యవాదాలు .
    విజయ్ కొండ

    ReplyDelete
  2. గురుదత్, మహమ్మద్ రఫీ, ఓపీ నయ్యర్ నాకు నిత్య స్మరణీయులు. గురుదత్ నిర్మించిన, దర్శకత్వం వహించిన చిత్రాలు చూస్తే ఎప్పుడూ ఏదో ఓ కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది.

    ReplyDelete
  3. గురుదత్, మహమ్మద్ రఫీ, ఓపీ నయ్యర్ నాకు నిత్య స్మరణీయులు. గురుదత్ నిర్మించిన, దర్శకత్వం వహించిన చిత్రాలు చూస్తే ఎప్పుడూ ఏదో ఓ కొత్తదనం కనిపిస్తూనే ఉంటుంది.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము