దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

 


ఆ గొంతు వింటే "జననాంతర సౌహృదాని" అనే మాట గుర్తొస్తుంది,జన్మజన్మలుగా నేనెరిగిన గొంతు అనిపిస్తుంది.నేనింకా పూర్తిగా కళ్లు తెరవక ముందే రేడియోలోంచి వచ్చే పాటలలో వినబడి మెత్తగా, మధురంగా వెంటాడిందీ గొంతే అని తెలుసుకున్నది మాత్రం యవ్వనంలో అడుగు పెడుతున్న కొత్తల్లో హిందీ పాటల వెల్లువలో కొట్టుకు పోయేటపుడు
ఇదంతా ఇంకెవరి గురించీ గొంతు విప్పితే చాలు వినే వారి మనసులను మధురమయిన లయలో కరిగించి పూలదారులలో ,తేనె వాకలలో తేలించే మహ్మద్ రఫీ గురించే
ఇక్కడో చిన్న ముచ్చట నా అజ్ఞానం గురించి 9వక్లాసులో వున్నప్పుడనుకుంటా నేనూ,నా స్నేహితురాలూ మాటాడుకుంటూ నీ అభిమాన గాయకుడెవరంటే నీ అభిమాన గాయకుడెవరూ అని ప్రశ్నించుకున్నాం.నా స్నేహితురాలు మహ్మద్ రఫీ పేరు చెప్పింది నేను వెంటనే యేదీ తెలుగులో "ఎంత వారుగానీ వేదాంతులైన గానీ" అని పాడాడేఅయ్యో ఆయనా అని ఆమెను చూసి జాలి పడ్డాను .అప్పుడు తెలియదు నాకు ముందుంది ముసళ్ల పండగ అనీ"రఫీ" అనే మోహ సముద్రంలో నేను మునిగి పోబోతున్నాననీ.
నేనూ నాస్నేహితురాలు మృణాళినీ కూడా గాఢమయిన రఫీ అభిమానులం .మేమిద్దరం కలసినపుడు తన చిన్నప్పటి సంఘటన చెప్పుకుని నవ్వుకుంటాం అదేంటంటే మృణాళినికి మూడేళ్ల వయసున్నపుడు రేడియోలో రఫీ పాటొస్తున్నంత సేపూ రేడియోని కావలించుకుని వదిలేది కాదట.ఇప్పటికీ వాళ్లింటో వాళ్లు యీ విషయం చెప్పి వెక్కిరిస్తారట
ఎంతోమంది గాయకులున్నా,యే గొంతు కాగొంతే ప్రత్యేకమయినదయినా పాటకు అతను ప్రాణంపోసే తీరూ,ఆ గొంతు లోని మాధుర్యం,పలికే పదాలకి సొగసులద్ది అనుభూతిని వొలికించే వైనం అతనిని అసమాన గాయకుడిని చేశాయనిపిస్తుంది
చలం కూడా తన "మ్యూజింగ్స్ "లో మహ్మద్ రఫీక్ "పియా" అని మూలిగాడా ప్రాణం కొట్టుకు పోతుంది అని రాస్తాడు.ఇంకా ఆయనే చెప్పినట్టు "గొప్ప ఆత్మలేనిదే గొప్ప సంగీతం పలకదు" అన్నది రఫీ పట్ల నిజం అనిపిస్తుంది ఆయన జీవిత చరిత్రా,ఆయన ఇతరులను గౌరవించే విధానమూ చూస్తే.
రఫీ పంజాబ్ లోని అమృత్ సర్ జిల్లాలో కోట్ల సుల్తాన్ సింగ్ అనే గ్రామంలో డిసెంబర్ 24 వతారీఖున1924వసం"లో జన్మించాడు. ఆయన చిన్నతనం అంటే యెనిమిదేళ్లు వచ్చేవరకూ అక్కడే గడిచిందని చాలాచోట్ల చెప్పారు అయితే ఆయన కోడలు యాస్మిన్ ఖాలిద్ రఫీ రాసిన పుస్తకంలో రఫీ తల్లిగారు బంధువులను చూడటానికి ఆగ్రామం వెళ్లి అక్కడ కానుపు అయ్యారనీ ఆ తరువాత వారి సొంతవూరు లాహోర్ వచ్చేశారనీ ఆయన బాల్యమంతా లాహోర్లోనే గడిచిందనీ రాశారు.
ఆయన తండ్రి పేరు హాజీ ఆలీ అహ్మద్ ,తల్లి పేరుఅల్లా రఖీ. రఫీ ముద్దుపేరు "ఫీకూ".అతను ఆరుగురు అన్నదమ్ములలో అయిదవ వాడుగా జన్మించాడు కుటుంబంలో సంగీత వాసనలేవీ లేవు .తండ్రి కేటరింగ్ బిజినెస్ లో వుండే వారట ,సోదరునికి బార్బర్ షాపు వుండేదట .చిన్న రఫీ పాటలంటే చాలా ఇష్టం చూపిస్తూ, ప్రతిరోజూ వీధిలో పాడుతూ అడుక్కునే వొకఫకీరుని అనుసరిస్తూ, అతను పాడినట్టే పాడుతూ వుండేవాడట .ఒకరోజు ఇతని పాట విన్న ఆ ఫకీరు "గొప్ప గాయకుడవవుతావు" అని ఆశీర్వదించాడట.ఇదంతా జరిగింది అతని యెనిమిదీ తొమ్మిదేళ్ల వయసులో ....
చిన్నతనంలో రఫీ సంగీతాభిరుచి పట్ల ఇంట్లో వ్యతిరేకత వుండేది ముఖ్యంగా తండ్రి నుండీ వ్యతిరేకత యెదురయింది అయితే తల్లి ప్రోత్సాహం కొంతా అన్న గారయిన మహ్మద్ దీన్ ప్రోత్సాహం కొంత తనని ముందుకు నడిపాయి.ఇక్కడ మహ్మద్ దీన్ స్నేహితుడయిన అబ్దుల్ హమీద్ పాత్ర మరువలేనిది ఆయన చిన్న రఫీలోని ప్రతిభను గమనించి బాగా ప్రోత్సహించడమే కాక బొంబాయి వెంటపెట్టుకుని తీసుకువెళ్లి గాయకుడుగా నిలదొక్కుకునే వరకూ సహాయంగా వున్నాడు.ఇకరఫీ సంగీతశిక్షణ తీసుకున్న గురువులు బర్కత్ ఆలీఖాన్ ,ఛోటే గులామ్ ఆలీ సాబ్ ,అబ్దుల్ వహీద్ ఖాన్ ,(కిరానా ఘరానాకు చెందిన వారు ),బడే గులామ్ ఆలీఖాన్ ,పండిట్ జీవన్ లాల్ మట్టూ ,జవహర్ లాల్ మట్టూ,ఫిరోజ్ నిజామీ.
లాహోర్ లో వున్న రోజులలో లాహోర్ రేడియోలో ఘజల్స్ అవీ పాడుతూ కాలం గడుపుతుండగా, అతని జీవితంలో ముఖ్యమైన మలుపుకి కారణమైన సంఘటన వొకటి సంభవించింది
1937లో లాహోర్లో "పాన్ ఇండియా యెగ్జిబిషన్ " లో కె.యల్ .సైగల్ ,జోహ్రాబాయ్ అంబేలీవాలాల పాట కచేరీ వొకటి యేర్పాటు చేశారు నిర్వాహకులు.వేలాది మంది సంగీతాభిమానులతో పాటు రఫీకూడా హాజరయ్యాడు .ఈ లోగా అదృష్టవశాత్తూ కరెంట్ పోయి మైకులు పనిచెయ్యలేదు అదృష్టవశాత్తూ అని యెందుకన్నానంటే అది రఫీ పాలిట అదృష్టంగానే పరిణమించింది.మైకులేకుండా సైగల్ పాడలేడు యేంచేయాలో పాలుపోని నిర్వాహకులు జనాన్ని వూరుకోబెట్టడానికి రఫీకి పాడటం వచ్చని తెలుసుకుని పాడమన్నారు .రఫీ మైక్ సహాయంలేకుండానే తన గాత్రమాధుర్యంతో శ్రోతలని మైమరపించాడు.ఇదంతా చూసిన విన్న సైగల్ "ఏనాటికైనా నువ్వో గొప్ప గాయకుడవవుతావని "ఆశీర్వదించాడు.అక్కడే ప్రేక్షకులలో వున్న శ్యామసుందర్ అనే సంగీత దర్శకుడు రఫీ ప్రతిభ గమనించి పంజాబీ సినిమా "గుల్ బలోచ్ "లో పాడే అవకాశమిచ్చాడు .అలా రఫీ తన మొట్టమొదటి పాట ఫిబ్రవరి28న1941లో జీనత్ బేగం తో కలసి "సోనియేని,హీరియేని"అని పాడాడు. తర్వాత నటుడూ-నిర్మాత నసీర్ ఖాన్ బొంబాయి రావలసిందిగా ఆహ్వానించాడు.
రఫీ కూడా బొంబాయి వెళ్లి అక్కడ సినిమాలలో అవకాశాలకోసం ప్రయత్నించాలనుకున్నాడు.అయితే ఇంట్లో వాళ్ల అంగీకారం అతికష్టం మీద పొంది,తన అన్నగారి స్నేహితుడూ తనని ప్రోత్సహించే వాడూ అయిన అబ్దుల్ హమీద్ ని తోడు తీసుకుని బొంబాయి బయల్దేరాడు రఫీ.
లాహోర్ రైల్వే స్టేషన్ కి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన తండ్రి వొకటే మాట చెప్పాడు బాధనిండిన గొంతుతో "విజయం పొందితేనే తిరిగిరా,లేకపోతే నాకు రఫీ అనే కొడుకు లేడనుకుంటాను"అని బహుశా యీ మాటలే రఫీ లో విజయం సాధించటానికి కావలసిన పట్టుదల నింపి వుంటాయి.
కోటి ఆశలతో 1942లో బొంబాయిలో అడుగు పెట్టి "భేండీ బజార్ " ఏరియాలో ,ప్రిన్సెస్ బిల్డింగ్ లో వొక చిన్న గదిలో వుండి అవకాశాలకోసం ప్రయత్న చేయసాగాడు రఫీ.ఆ సమయానికి సైగల్ హవా నడుస్తోంది ,పంకజ్ మల్లిక్ ,జి.యమ్ .దుర్రానీ కూడా మంచి పేరులో వున్నారు.తలత్ మహ్మద్ ,మన్నాడే ,ముఖేష్ అవకాశాలకోసం పోటీ పడుతున్నారు.రఫీకి ఒక రకంగా భేండీ బజార్లో మహ్మద్ ఆలీ రోడ్లో షిరాజుద్దీన్ బారీ గారి ఇంట్లో స్థానం దొరకడం తోనే దశ తిరిగిందని చెప్పాలి .షిరాజుద్దీన్ గారి అల్లుడు లక్నోకి చెందిన వాడు ఆయన ఇంటి పక్కనే నౌషద్ ఆలీ తండ్రి వాహిద్ ఆలీ వుండే వాడు ఆయనకీ షిరాజుద్దీన్ అల్లుడు గారికీ వున్న స్నేహాన్ని పురస్కరించుకుని వాహిద్ ఆలీ రఫీ బాగా పాడుతాడనీ సినిమాలలో అవకాశం ఇమ్మనీ కొడుకైన నౌషద్ కి వొక వుత్తరం రాశాడు. ఆ లేఖ తీసుకుని రఫీ నౌషద్ ని కర్దార్ స్టుడియోకి వెళ్లి కలిశాడు.తండ్రి రాసిన లేఖ చదువుకుని ,రఫీ పాట విన్నాక నౌషాద్ రఫీకి "పెహలే ఆప్ "అనే సినిమాలో బృంద గానంలో అవకాశం కల్పించాడు అది "హిందూస్థాన్ కే హమ్ హై,హిందూస్థాన్ హమారా "అనే పాట.అలా చిన్నా చితకా అవకాశాలు రాసాగాయి మొదట పంజాబీలో అవకాశ మిచ్చిన శ్యామసుందర్ హిందీలో కూడా "గావ్ కీ గోరీ "అనే సినిమాలో అవకాశ మిచ్చాడు. రఫీ ప్రతిభ పసిగట్టిన నౌషద్ తను అంతవరకూ ప్రోత్సహిస్తూ వచ్చిన తలత్ ని పక్కన బెట్టి రఫీకి యెక్కువ ఛాన్సులివ్వడం మొదలు పెట్టాడు.1949 లో "దులారీ" లో నౌషద్ దర్శకత్వంలో పాడిన "సుహానీ రాత్ ఢల్ ఛుకీ "రఫీ కెరీర్ ని వొక మలుపు తిప్పితే "బైజుబావరా "లో పాటలు రఫీనీ ,నౌషద్ నీ సమున్నత స్థానంలో నిలిపాయి .వారిద్దరి మధ్య వొక ఆత్మీయ అనుబంధం నెలకొని వుండేది.
అయితే నేపథ్య గాయకుడుగా స్థిరపడే వరకూ రఫీ పడ్డ కష్టం సామాన్యమయినది కాదు "సైగల్ " అనే మహా వృక్షపు నీడను తప్పించుకుని తన సొంత శైలిలో మనగలగటం అందరూ సైగలే కావాలనుకునే రోజుల్లో తనకొచ్చిన అవకాశాలు వినియోగించుకుని సత్తా చూపించడం ఇవన్నీ చెప్పినంత తేలిక కాదు.వీటికి తోడు ఆర్థిక పరిస్థితి వలన స్టుడియోలకు రెండు మూడుసార్లు తిరగ వలసి వస్తే ఇంటికి వెనక్కి తిరిగి రాకుండా దగ్గరలో వున్న రైల్వే స్టేషన్లో పడుకునే వాడట.
సినిమాలలో ప్రవేశించిన కొత్తల్లో రెండు మూడు సినిమాలలో చిన్నా చితకా వేషాలు కూడా వేశాడు రఫీ .నాకెందుకో రఫీకీ మన ఘంటసాలకీ చాలా పోలికలు కనిపిస్తాయి దాదాపు ఇద్దరూ రెండు సం"లు అటూ ఇటూగా ఆయన హిందీలో ఈయన తెలుగులో ప్రవేశించారు .ఇద్దరూ మొదట్లో చిన్న చిన్న వేషాలు వేశారు ,ఇద్దరిదీ మృదువైన ప్రవర్తనా,మధురమైన గాత్రంఇంకా విచిత్రం ఇద్దరూ రెండు సార్లు పెళ్లి చేసుకున్నారు.
ఇకరఫీ నటించిన సినిమాలు "జుగ్నూ,లైలామజ్నూ,సమాజ్ కో బదల్ దాలో" ఆతర్వాత సినిమాలలో నటించ లేదు.అతని కుటుంబం విషయాని కొస్తే అతనికి పదమూడవ యేటే లాహోర్లో తండ్రి ఆఖరి సోదరుని కుమార్తె బషీరున్ బేగంతో పెళ్లి జరిగింది .సయ్యీద్ రఫీ ఆమె కొడుకే అయితే ఇండియా పాకిస్థాన్ విడిపోయే సమయంలో ఆమె తన తలిదండ్రులను కోల్పోయిందట .ఆమె పాకిస్థాన్ విడిచి రావడానికి ఇష్టపడలేదట రఫీ ఇండియాలోనే వుండదలచుకున్నాడట అలా వారిద్దరూ చాలా కొద్దికాలమే కలసి వుండి తర్వాత విడాకులు తీసుకున్నారట.సయూద్ రఫీ బొంబాయిలో రఫీ వద్దే పెరిగి తర్వాత లండన్లో స్థిర పడ్డాడట.ఆయన రెండో పెళ్లి తనున్న ఇంటి వోనర్ షిరాజుద్దీన్ బారీ కూతురైన బిల్కీస్ బేగంతో జరిగింది ఆమెకు ముగ్గురు కొడుకులూ ముగ్గురు కూతుళ్లూ యెందుకో బిల్కీస్ రఫీ ఆమె కుటుంబమూ రఫీ మొదటి పెళ్లి గురించి మాటాడటానికి ఇష్టపడే వారు కారట ఆయన కోడలు రాసింది.ఆయన బావమరిది జహీర్ బారీ ఆయన డేట్స్ అవీ చూస్తూ సెక్రటరీగా వ్యవహరించే వాడు.
ఇక ఆయన పాటల ప్రస్థానానికి వస్తే "బైజు బావరా "తర్వాత వెనుదిరిగి చూడలేదు 1950 -1970 మధ్యలో రఫీ స్వర్ణయుగం అనవచ్చు సంగీత దర్శకులందరికీ బాగా కావలసిన గాయకుడు రఫీనే ఏ పాట తీసుకున్నా భజన్ ,ఖవ్వాలీ,ఘజల్ ,ప్రేమగీతం ,విరహగీతం, విషాద గీతం,చివరికి హాస్యగీతంలో కూడా ఆయన చూపే వైవిధ్యం మరెవ్వరూ సాధించలేనిది .నేపథ్య గాయకుడికీ నటుడికీ మధ్య దూరాన్ని చెరిపేశాడు రఫీ అంటాడు జావేద్ అఖ్తర్ .సూర్యుడి ముందు దివిటీ యెత్తుతున్నాను మిత్రులు ఆశీర్వదించండి ....
1942లో హిందీ సినిమాలలో నేపథ్య గాయకుడిగా ప్రవేశించిన రఫీకి వొక సుస్థిర స్థానం సంపాదించుకోడానికి సుమారు ఆరేడు సం"రాలు పట్టింది.ఈ కాలంలో అతను పాడిన సినీ గీతాలతో పాటు వొకటి రెండు ప్రయివేటు గీతాలు కూడా అతను నిలదొక్కుకోడానికి సహాయపడ్డాయి.దేశానికి స్వతంత్రం వచ్చిన సందర్భంగా ఎర్రకోటలో జరిగిన సంబరాలలో రఫీ పాడాలని వుత్సాహ పడ్డాడు ,అతనికి అవకాశం దొరికింది కూడా మూడు నిమిషాలు అనుకున్నది శ్రోతలకోరికపై ముఫ్ఫయి నిమిషాలు పాడవలసి వచ్చింది.ఆయన పాట విన్న నెహ్రూ ప్రశంసించటమే కాక గాఢంగా గుండెకు హత్తుకుని తను నివసిస్తున్న తీన్ మూర్తి భవన్ లో పాడవలసిందిగా ఆహ్వానించాడు.ఇది జరిగింది 1947లో పాడిన పాట "లెహరావో తిరంగా లెహరావో ".తర్వాత బాపూజీ మరణంతో జాతి అంతా విషాదంలో మునిగి వున్నపుడు హుసన్ లాల్ భగత్ రామ్ సంగీత దర్శకత్వంలో రాజేంద్రకిషన్ రచించిన "సునో సునో యే దునియా వాలో బాపూజీకి అమర్ కహానీ"అని రఫీ పాడిన పాట ప్రజలనే కాదు ప్రధాన మంత్రి నెహ్రూని కూడా కదిలించింది .ఆయన రఫీని తన ఇంటికి పిలిచి మళ్లీ పాడించుకుని సిల్వర్ మెడల్ బహూకరించటం రఫీ ఇష్టంగా తలుచుకునే వారట.ఈ పాట స్ఫూర్తితో తెలుగులో మన ఘంటసాల కూడా గాంధీ గురించి వొక ప్రయివేట్ రికార్డు ఇవ్వాలనుకుని, రఫీ పాట విన్నాక ,ఆ ప్రయత్నం విరమించుకున్నారట.
అలా 1950వచ్చేటప్పటికి ప్రతీ సంగీతదర్శకుడూ తనకి రఫీయే కావాలనే పరిస్థితి యేర్పడింది రఫీ యెవరినీ నిరుత్సాహ పరచగూడదని శాయ శక్తులా ప్రయత్నించే వారట.ఒకరా ఇద్దరా యెంతమంది సంగీత దర్శకుల పాటలు పాడారు చెప్పాలంటే కష్టం కొన్ని పేర్లు మాత్రం చెపుతాను
నౌషాద్ ,రోషన్ ,యస్ .డి.బర్మన్ ,ఆర్ .డి బర్మన్ ,ఓ.పి. నయ్యర్ ,జయదేవ్ ,చిత్రగుప్త్ ,మదన్ మోహన్ ,శంకర్ జైకిషన్ ,రవి,ఖయ్యామ్ ,లక్ష్శీకాంత్ -ప్యారేలాల్ ,హేమంత్ కుమార్ ,దత్తారామ్ ఇంకా యెందరో సంగీత దర్శకుల పాటలు పాడి మెప్పించారాయన .మచ్చుకి వొకరిద్దరి తో అనుబంధం ముచ్చటించు కుందాం.
నౌషద్ తో వున్న అనుబంధం ప్రత్యేకమయినది అని చెప్పుకున్నాం కదా రఫీ టాలెంట్ ని దాదాపు పూర్తిగా వినియోగించుకున్నాడు నౌషాద్ అనిపిస్తుంది క్లాసికల్ బేస్ వున్న పాటల్నించీ అన్ని రకాల పాటలూ పాడించాడు .ఆయనకు 149 పాటలు పాడాడు రఫీ.
యస్ .డి.బర్మన్ అద్భుతమయిన పాటలు పాడించాడు రఫీచేత "ప్యాసా,గైడ్ "లలోవి యెలాంటి మధురాలు.ఆయన దగ్గర 96పాటలు పాడాడు.
ఓ.పి. నయ్యర్ కీ రఫీకి మంచి స్నేహం వుండేదట ,ఇద్దరూ లాహోర్ కే చెందిన వారవడం కూడా దానికి వొక కారణమట .అయితే ఆయన చండశాసనుడూ, ముక్కోపి ,సమయానికి రికార్డింగ్ కి రాకపోతే వూరుకోడు.ఒకరోజు శంకర్ -జైకిషన్ దగ్గర రికార్డింగ్ ఆలస్యమయిందట రఫీకి దానితో తన దగ్గరకు ఆలస్యంగా వచ్చిన రఫీని చూసి అగ్గిమీద గుగ్గిలమయిన నయ్యర్ రికార్డింగ్ కాన్సిల్ చేసి మూడు సంవత్సరాలు అవకాశాలివ్వడం మానేశాడట.ఇదేమీ మనసులో పెట్టుకోని రఫీ కొంతకాలం తర్వాత యేదో ఫంక్షన్లో యెదురు పడిన నయ్యర్ ని యెప్పట్లాగే ఆత్మీయంగా పలకరించాడట .నయ్యర్ వొక్కసారిగా పశ్చాత్తాపపడి ఇంత మంచి మనిషినీ ,గాయకుడినీ వదులుకున్నానా నేను అని మళ్లీ పిలిచి అవకాశా లిచ్చాడట .
రవి సంగీత దర్శకత్వంలో కూడా మంచి పాటలున్నాయి ఒకపాటకి ఫిల్మ్ ఫేర్ అవార్డు ఇంకోదానికి రాష్ట్రీయ అవార్డూ లభించాయి.ఇలా చెప్పాలంటే యెంతో వుంది .
చివరగా వొకముక్క ఆశ్చర్యం కలిగించే విషయం అందరి కంటే యెక్కువ పాటలు లక్ష్శీకాంత్ -ప్యారే లాల్ కి పాడాడు 369.
మొత్తంగా అన్ని భాషలలో కలిపి ఆయన పాడిన పాటలు 4941ఇది మ్యూజిక్ కలెక్టర్ మహ్మద్ సలీమ్ -ఉల్ -హక్ గారు రాసిన పుస్తకంలో వుంది అయితే ఏడు వేల చిల్లర అని ఇంకో చోట చదివాను.ఎన్ని పాటలు పాడాడు అనే లెక్క కంటే యెంత క్వాలిటీతో పాడాడు అనేది గమనించాలిసిన విషయం రఫీకూడా అలాగే భావించే వాడట "దేవుడు నా గొంతులో క్వాలిటీ తగ్గకుండా చూడాలి"అని ప్రార్థించే వాడట ఆయన కోడలు రాసింది.
రఫీపాటలోని ఇంకో విశేషం యే నటునికి పాడుతుంటే ఆ నటునికి తగ్గట్టు వాయిస్ క్వాలిటీని మార్చడం.దిలీప్ కుమార్ కీ,దేవానంద్ కీ,రాజేంద్రకుమార్ కీ, షమ్మీ కపూర్ కీ పాడిన విధానానికీ మొహమూద్ కీ,జానీ వాకర్ కీ పాడిన విధానానికీ వున్న తేడా గమనిస్తే తెలుస్తుంది
ఆయన గానప్రస్థానం సాగిన నలభై సం"రాలలో ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులూ,రెండు నేషనల్ అవార్డులూ వచ్చాయి .1967లో ప్రభుత్వం పద్మశ్రీ తో గౌరవించింది.ఇవన్నీ పక్కన పెడితే గాయకులకే గాయకుడాయన అంటే గాయనీై గాయకు లందరూ ఆయన పాటనీ ప్రవర్తననీ అమితంగా ఇష్టపడతారు మన్నాడే,మహేంద్ర కపూర్ మరీనూ అయితే లతాతో వొకసారి రికార్డుల రాయల్టీ గురించి వొకసారి వివాదం వచ్చింది ఆవిడ రఫుతో ఆరు సంవత్సరాలు పాడలేదు జైకిషన్ మధ్యవర్తిత్వంతో ఆ వివాదం సమసి పోయి ఇద్దరూ కలిసి పాడటం మొదలు పెట్టారు.ఆయన కిషోర్ కి "షరారత్ "అనే సినిమాలో ప్లేబాక్ పాడాడు.
ఆయన వ్యక్తి గత జీవితానికొస్తే ఆయన చాలా సింపుల్ మాన్ స్టుడియో కెళ్లడం పాట పాడటం ఇంటికి రావడం.ఏ అలవాట్లూ లేవు భోజన ప్రియుడు వేపుడు కూరలూ,తియ్యని పదార్థాలూ ఇష్టంగా తినేవాడు .రోజుకు మూడుసార్లు చల్లని తీపి లస్సీ వుండాలిసిందే.పిల్లలతో కలిసి పతంగులెగరెయ్యడం,కారమ్స్ ఆడటం ఇష్టమయిన హాబీలు కొన్నాళ్లు బాడ్మింటన్ కూడా ఆడే వాడట .బాక్సింగ్ ఛాంపియన్ మహ్మదాలీని చూడాలని తహతహలాడి ఆయనతో ఫోటో తీయించుకుని సంతోషించాడట.చివరి రోజులలో డయాబిటిస్ తో,స్థూలకాయంతో బాధపడి చివరకు హార్ట్ అటాక్ తో 1980జూలై 31ఇదే రోజు తన బంధువులనూ అభిమానులనూ దఃఖ సాగరంలో ముంచి రఫీ దివ్యలోకాలకు తరలి పోయాడు .ఆయన మరణించాడని నేనను అనుకోను ఆయన పాటల ద్వారా ఆయన చిరంజీవి .ఆయన కు లండన్లోని అభిమానులు బర్మింగ్ హామ్లో వొకగుడి కడితే ప్రపంచ వ్యాప్తంగా వున్న ఆయన అభిమానులు తమతమ గుండేల్లో కట్టిన గుళ్లు కొన్ని కోట్లు . రఫీ కి వీడ్కోలు చెప్పే రోజు ఆకాశమే దుఃఖిస్తోందా అన్నట్టు కురిసే వర్షంలో లక్షలాది అభిమానులు తమ మనసులే గొడుగులుగా చేసుకుని ఆయన అంతిమ యాత్రలో పాల్గొన్నారు .2010లో జుహూ లో వున్న సమాధిని చోటుచాలక తవ్వేశారట ఆయన విశ్రమించిన చోటుని వొక కొబ్బరి చెట్టు ఆధారంగా అభిమానులు గుర్తిస్తారట ఇంతకన్నా విషాదముందా!
శ్రీశ్రీ చెప్పినట్టు రఫీ అనే సముద్రాన్ని వొక చెంచా తో తోడే సాహసం చేయడానికి కారణం నా మనసును కలచి వేసే సందర్భాలలో ,నిరాశ మూసిన చీకటి వేళలలో,నిద్రపట్టని రాత్రులలో రఫీ పాట నన్ను సేదతీర్చడం,లాలించడం,నాకు తోడై నిలవడం,అందుకే "ఓ జబ్ యాద్ ఆయే బహుత్ యాద్ ఆయే "అని పాడుకుంటూ లాంగ్ లివ్ రఫీ సాబ్ వియ్ లవ్ యూ .తప్పులుంటే రఫీ అభి మానులూ క్షమించండి
- భార్గవి

Comments

  1. రఫీ అంటే నాకు పిచ్చి అభిమానం . రఫీ చనిపోయాడని తెలీక బతికి ఉన్నాడనే నమ్మెదాన్ని.1988 లో రఫీ 1980 పోయాడని తెలిసి ఎంతగా ఏడ్చానో..రఫీ మీద కవితలు రాసేదాన్ని. అంత ఆరాధన రఫీ అంటే.మీ వ్యాసం నా రఫీ ని మళ్ళీ నా కళ్ళ ముందు సాక్షాత్కరింపచేసింది.అభినందనలు భార్గవి గారు.నా పేరు గీతాంజలి.రచయత్రిని. నా వాట్సాప్ నెంబర్ 8897791964

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము