విషాద నాయిక - మీనాకుమారి



ఆలోచిస్తే మన తెలుగు నటి సావిత్రికీ, హిందీనటి మీనాకుమారికీ వున్న పోలికలు, నట జీవితంలో కానివ్వండీ, వ్యక్తిగత జీవితంలో కానివ్వండీ ఆశ్చర్యమనిపిస్తుంది. ఇద్దరూ తాము నటించిన చిత్రాలలోని పాత్రలతో(1950-60 దశకాలలోని)మధ్య తరగతి కుటుంబ స్త్రీకి నమూనాగా నిలిచారు. ఇద్దరూ ఎక్కువ విషాద చిత్రాల నాయికలుగానే రాణించేవారు. ఇద్దరూ విషాద సన్నివేశాలలో గ్లిసరిన్ అవసరం లేకుండా(మరీ ఒక్క కంటి నుండే, రెండే కన్నీటి బొట్లు రాల్చడం లాంటి అతిశయోక్తులు కాదు గానీ) కన్నీరు కురిపించ గల సహజ నటీమణులుగా రాణించారు. సంభాషణలు పలకడంలో ఇద్దరికీ మంచి పేరుంది.

అమితాబ్ లాంటి సూపర్ స్టార్ కూడా మీనా కుమారి లాగా ఎవరూ డైలాగ్ చెప్పలేరంటారు. ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ కూడా మీనా కుమారి ముందు డైలాగ్ చెప్పడానికి జడిసే వాడంటారు .మన సావిత్రి విషయానికొస్తే యస్వీ రంగారావు "అమ్మో సావిత్రి తో నటిస్తున్నాం, జాగ్రత్తగా వుండాలి" అనే వారంటారు కదా! ప్రఖ్యాత దర్శకుడు సత్యజిత్ రాయ్ మీనాకుమారి నటన "సాహిబ్ ,బీబీ ఔర్  గులామ్ "లో చూసి" మీనా కుమారి ఉన్నత శ్రేణికి చెందిన నటీమణి "అని ప్రశంశించారంటారు. విచిత్రంగా మీనా కుమారీ, సావిత్రి  ఇద్దరూ రెండు పెళ్లిళ్లయి ,పిల్లలున్న వ్యక్తులనే భర్తగా స్వీకరించటమే కాక, ఇద్దరూ పెళ్లయిన తర్వాత కొంత కాలం వరకు  తమ వివాహాన్ని గోప్యంగా వుంచారు. మీనాకుమారి తమ వివాహమయిన విషయాన్ని ఒక సంవత్సరకాలం దాస్తే, సావిత్రి మరికాస్త ఎక్కువకాలం మూడు, నాలుగేళ్లు దాచినట్టుంది. మరణంలో కూడా ఇద్దరికీ సారూప్యత వుంది. అదేమిటంటే ఇద్దరూ మద్యపానమనే వ్యసనానికి బలయ్యి, చిన్నవయసులో మరణించడం.

మీనాకుమారి తన ముప్ఫై ఎనిమిదవ యేట మరణిస్తే,    సావిత్రి మరణించేటప్పటికి నలభైఅయిదేళ్ల వయసంటారు. ఇద్దరూ మరణించే సమయానికి భర్తలనుండీ విడిగా జీవిస్తూ వుండటం కూడా విచిత్రమయిన విషయమే. ఇద్దరికీ ఒకరితో ఒకరికి పరిచయముంది, ఒకరిపట్ల ఒకరికి గౌరవముంది. మీనాకుమారి నటించిన హిందీ చిత్రాలు తెలుగులో తీసినపుడు ఆమె పాత్ర సావిత్రి వేస్తే, తెలుగులో సావిత్రి నటించిన చిత్రాలు హిందీలో తీసినపుడు ఆమె పాత్ర లో మీనాకుమారి నటించింది. ఉదాహరణలు "మిస్సమ్మ --మిస్ మేరీ "ఏక్ హీ రాస్తా---కుంకుమరేఖ" అంతే కాదు ఒక హిందీ చిత్రానికి సావిత్రిని హీరోయిన్ గా తీసుకోమని మీనాకుమారి రికమండ్ కూడా చేసిందట. ఈ పోలికలన్నీ పక్కనబెడితే ఇద్దరూ చిత్ర ప్రపంచంలోనే కాక నిజ జీవితంలో కూడా విషాద రాణులు గా తయారవ్వడానికి కారణమేమిటీ,వారి మనస్తత్వమా? పరిస్థితులా? చిన్నతనం నుండీ కరువయిన ప్రేమాభిమానాలా? వీటన్నిటికీ సమాధానాలు కొంతవరకూ వారి జీవిత చరిత్రలను పరిశీలిస్తే అర్థమవుతాయి.

మీనాకుమారి బాలనటిగా  సినిమాలలో ప్రవేశించింది. ఆమెను సినిమాలకు పరిచయం చేసింది సొంత తల్లీ దండ్రులే. మీనాకుమారి తండ్రి పేరు ఆలీబక్ష్ . ప్రస్తుతం పాకిస్థాన్ కి చెందిన"బెహరా "అనే గ్రామానికి చెందిన వాడు. చిన్ననాటి నుండీ సంగీతం పట్ల మక్కువ చూపే వాడు, హార్మోనియం వాయించే వాడు .అందరూ మాస్టర్ ఆలీబక్ష్ అనేవారు.తన అదృష్టాన్ని వెతుక్కుంటూ బొంబాయి చేరి, నాటకాలలో హార్మోనియం వాయిస్తూ, సినిమాలలో కూడా చిన్నా చితకా పాత్రలు వేస్తూ, సంగీతం సమకూరుస్తూ వుండేవాడు అప్పటికే అతనికి పెళ్లయి పిల్లలున్నారు. మీనాకుమారి తల్లి అతని రెండో భార్య .

మీనాకుమారి తల్లి వేపు మూలాలు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యంగా వుంటుంది. మీనాకుమారికి ప్రముఖ కవీ, రచయితా రవీంద్రనాథ్ టాగూర్ తో బంధుత్వం వుంది. అదెలాగంటే మీనా అమ్మమ్మ హేమసుందరీ దేవి రవీంద్రుని సోదరుడయిన సుకుమార్ టాగూర్ కుమార్తె. ఆమె మొదటి భర్త చనిపోయాక  మీరట్ చేరుకుని ప్యారేలాల్ అనే క్రిస్టియన్ ని పెళ్లి చేసుకుంది.అతను ఒక ఉర్దూ పత్రికకి జర్నలిస్ట్ గా పనిచేసేవాడు.వారి కుమార్తెలిద్దరిలో ఒకారు మీనాకుమారి అమ్మ ప్రభావతి. ప్యారేలాల్ చనిపోయాక ఆ కుటుంబం కొన్నాళ్లు కలకత్తా తిరిగి వచ్చి తర్వాత బొంబాయి చేరుకుంది.

ప్రభావతి నాటకాలలో నటి గానూ ,డాన్సర్ గానూ పనిచేస్తుండగా, ఆలీబక్ష్ తో పరిచయం కలిగింది. ఇద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు . ప్రభావతి "ఇక్బాల్ బేగం" అయ్యింది. వారికి వరసగా ఖుర్షీద్ , మహజబీన్ , మధు అనే ముగ్గురు ఆడపిల్లలు కలిగారు. ఆ మహజబీనే మన "మీనాకుమారి". ఆమెను చిన్నప్పుడంతా "మున్నా" అని పిలిచే వారట. ఆమెకు ఇంకా రెండు నిక్ నేమ్స్ వున్నాయి .భర్త కమల్ అమ్రోహీ "మంజూ" అనేవాడు. మరోటి  "నాజ్ "అనే పేరు, ఈ పేరుతోనె  ఆమె కవితలూ, గజల్లూ ,కథలూ రాసేది.

సరే! మళ్లీ ఆమె బాల్యానికి వద్దాం .బాల్యంలో తల్లిదండ్రుల ప్రేమ లభించని వారికి ఆ లోటు జీవితాంతం వెంటాడటమే కాక వారి జీవన గమనంలో కొన్ని బలహీనతలకు లోనయ్యేట్టు కూడా చేస్తుందనుకుంటా. మీనాకుమారి పుట్టుకా ,పెంపకం ,ఆమె అనుభూతులూ పరిశీలిస్తే అలాగే అనిపిస్తుంది ఆమె తల్లిదండ్రులిద్దరూ పెద్దపిల్ల ఖుర్షీద్ తర్వాత, అబ్బాయి పుడతాడనుకుంటే  నిరాశ పరుస్తూ ఆడపిల్ల మహజబీన్ పుట్టింది. హాస్పిటల్ బిల్లుకూడా కట్టలేని పరిస్థితులలో ఈ పిల్లను భారంగా భావించిన ఆలీబక్ష్ ఒక అనాథాశ్రమం అరుగు మీద ఆ పిల్లను వదిలేసి వచ్చాడట. కొంతదూరం వెళ్లాక ఎందుకో చెవులలో ఆ పిల్ల ఏడుపు వినిపించినట్టయి వెనక్కు వచ్చి చూస్తే  ఒంటి నిండా చీమలు పీకుతుంటే ఎర్రగా కంది పోయి ఏడుస్తున్న పిల్లను ఎత్తుకుని ఇంటికి తిరిగి వచ్చాడట. ఆ చీమలు చేసిన గాయాలు అప్పుడే మానిపోయాయి అయితే తలిదండ్రులు తనవి వద్దనుకున్నారన్న విషయం చేసిన గాయం మాత్రం మీనాకుమారికి  మానలేదు తను ఎంత పెద్దయినా!  ఎంత పేరు తెచ్చుకున్నా.

ఆలీబక్ష్ ,ఇక్బాల్ ల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుండటంతో పాటు, ఇక్బాల్ బేగం ఆరోగ్య పరిస్థితి కూడా దిగజారడంతో, పెద్ద కూతురు ఖర్షీద్ తో పాటు మహజబీన్ కూడా బాలనటిగా సినిమాలలో "బేబీ మీనా "పేరుతో ప్రవేశించింది. అలా స్కూలుకెళ్లి చదువుకోవాలిసిన నాలుగేళ్ల వయసులోనే మీనాకుమారి తన కుటుంబానికి  సంపాదించి పెట్టే ఒక దిక్కయింది. ఆమెకు మొట్టమొదట అవకాశమిచ్చిన వాడు విజయభట్ . చిత్రం పేరు "లెదర్ ఫేస్ " పారితోషికం పాతిక రూపాయలు.

ఆగస్టు ఒకటి,1932(1933అని కొన్ని చోట్ల రాసుంది)న బొంబాయిలో జన్మించిన మహజబీన్ (మీనాకుమారి)బాల్యమంతా,దాదర్ తూర్పు రైల్వే స్టేషన్ ప్రాంతంలో,దాదాసాహెబ్ ఫాల్కే రోడ్డులో వున్న చిన్న ఒకే ఒక్క కిటికీ వున్న ఒంటి గది ఇంటిలో గడిచింది. ఒక పక్క అనాథాశ్రమం,ఇంకో పక్క రూప్ తారా స్టుడియో వుండేవి.ఆ స్టుడియో ఆవరణలో మహజబీన్ ఆడుకుంటూ వుండేది. మీనా బాల్యంలో మధుర జ్ఞాపకాలేమీ లేవు. తండ్రి ఆలీబక్ష్ కరుకుగా, క్రమశిక్షణగా, నిర్దాక్షిణ్యంగా వుండే మనిషయితే, తల్లి ఇక్బాల్ బేగం కొంత దయగా, ప్రేమగా, నవ్వుతూ, నవ్విస్తూ వుండే మనిషి. ఇలాంటి భిన్నధృవాల్లాంటి మనుషులని బహుశా సంగీతమే కలిపి వుంటుంది అంటాడు మీనా జీవిత చరిత్ర రాసిన వినోద్ మెహతా. అయితే తలిదండ్రులిద్దరూ కూడా తాముకోరుకున్న మగ సంతానానికి బదులుగా పుట్టిన మహజబీన్ ను వివక్షగానే చూసేవారు. ప్రతీక్షణం ఆ విషయం గుర్తు చేస్తూనీ వలన ఏం ఉపయోగం లేదుఅన్నట్టుగా ప్రవర్తించేవారు. అక్క ఖుర్షీద్ అప్పటికే బాలనటిగా సినిమాలలో నటిస్తూ వుండటంతో తనని  ప్రత్యేకంగా చూసేవారు. ఆమెతొడిగి వదిలేసిన బట్టలు తొడుక్కునీ, ఆమెతినగా మిగిలిన మిఠాయిలు తినీ (మిఠాయిలంటే  మెనా కుమారికి చాలా ఇష్టం) పెరిగింది మహజబిన్. నిన్న మొన్న మిగిలిన  రొట్టేల్లో ,ఉల్లిపాయా ,పచ్చిమిరపకాయా నంచుకుంటూ తినడం అలవాటయి అదే ఇష్టంగా మారి కూచుంది .అలాంటి రోటీని "బాసీరోటీ"అంటారట. బాసీ అంటే చద్దిది అన్నమాట!  తర్వారి రోజుల్లో  తను కూడా సినిమాలలో చేరి సంపాదించడం మొదలెట్టాక, తలిదండ్రుల ప్రవర్తనలో మార్పు రావడం , తనని విలువగా చూడటం గమనించింది మహజబిన్ . ఏ మనిషినీ నమ్మకూడదని ఆనాడే నిర్ణయించు కుందేమో!  అంటాడు వినోద్ మెహతా.

ఆర్థిక ఇబ్బందులతో పాటు ,ఇక్బాల్ బేగం అనారోగ్యం తోడయి భార్యా,భర్తల మధ్య తగాదాలు రేగుతూ వుండేవి .తల్లి దండ్రల తగాదాలమధ్య, చిన్న పిల్లలెలా నలిగి పోతారో,వారెలా బలిపశువులవుతారో తెలియడానికి మహజబీన్ బాల్యమే ఉదాహరణ. ఇలాంటి పరిస్థితులలో ఆమె నటిగా ఎలా ఎదిగిందో పరిశీలిస్తే-----నిర్మాతా ,దర్శకుడూ,ప్రకాష్ స్టుడియో అధినేతా విజయ్ భట్ తొలిసారి అవకాశమిచ్చాడు"లెదర్ ఫేస్ "అనే సినిమాలో అని చెప్పుకున్నాం కదా,అందులో జైరాజ్ అనే నటుడికి కూతురుగా నటించింది మహజబీ. ఈతనేర్చిన చేపపిల్లలా కెమేరా ముందు భయం లేకుండా నటిస్తున్న  మహజబీన్ ని చూసి ముచ్చటపడి  వరసగా తన సినిమాలలో అవకాశమిస్తూ,మహజబీన్ పేరును "బేబీ మీనా "గా మార్చాడు విజయభట్ . బేబీ మీనాగా ఆమె నటించిన చిత్రాలు"అధూర్ కహానీ, ఏక్ హీ ఫూల్ , పూజా, నయీ రోషనీ, బెహన్ , కసౌటీ, గరీబ్ "వీటిలో విజయ్ భట్ సినిమాలే ఎక్కువగా వున్నాయి. ఆమెది మధురమైన కంఠం, దానికి తండ్రి శిక్షణా, తల్లి ప్రోత్సాహం కూడా తోడయ్యింది. తన నటించిన చిన్ననాటి చిత్రాలలో ఆమె పాటలు ఆమే పాడుకునేది చాలావరకూ. ఆమె సామర్థ్యాన్ని గమనించిన ప్రముఖ సంగీత దర్శకుడు అనిల్ బిశ్వాస్ "బెహన్" అనే సినిమాలో ఆమె పాటలు ఆమెతోనే పాడించాడు. మీనాకుమారి  మంచి చదువరి కూడా , బడికి వెళ్లి చదవక పోయినా ఇంగ్లీషూ, హిందీ, ఉర్దూ భాషలను  ఇంట్లో ట్యూషన్ పెట్టించి చదివించాడు ఆలీబక్ష్. దానితో షూటింగ్ ల్లో సమయం  దొరికినప్పుడల్లా స్టుడియోలో ఒక మూలకెళ్లి చదువుకుంటూ వుండేది "రీడింగ్ మహజబీన్ "అని పిలిచే వారందరూ. ఉర్దూలో చక్కని కవిత్వమూ,గజల్సూ,కథలూ కూడా రాస్తుండేది .ఆమె కవిత్వం పుస్తకాలుగా వెలువడింది, తను రాసిన గజల్స్ ఖయ్యాం దర్శకత్వంలో ఆమె స్వయంగా పాడగా ఒక ఎల్ .పి. రిలీజయ్యింది. బాలనటిగా ఆమె చివరి చిత్రం "బచ్ పన్ కా ఖేల్ " అయితే అక్కడితో ఆమె "ఖేల్ "ముగియలేదు "బేబీ మీనా" "మీనాకుమారిగా యెదిగి పెద్ద పాత్రలలో నటించడం మొదలు పెట్టింది.

సాధారణంగా బాలనటులందరూ పెద్దయి ప్రముఖ నటులుగా గుర్తింపబడటం అరుదు .చాలామంది కరిగిపోయే వారి బాల్యంతో పాటు కనుమరుగవుతుంటారు. మీనాకుమారికి అలా కాకుండా వెంట వెంటనే చిత్రాలు రావడం, ఆమె మంచి నటి గా నిరూపించుకునే అవకాశం రావడం అదృష్టం. ఆమెతో పాటు బాలనటులుగా వుండి పెద్దయ్యాక నటులుగా పేరు తెచ్చుకున్న వారు "బేబీ ముంతాజ్ "గా పిలవబడిన అందాల తార "మధుబాల",ప్రముఖ నాట్య తార "కుకూ ". మీనా కుమారి సంపాదనతో ఆలీబక్ష్ ఆర్థిక పరిస్థితి మెరుగు పడింది, దాదర్ ప్రాంతం వదిలేసి 1946 లో బాంద్రా లో చిన్న బంగ్లా కొనుక్కున్నారు.అందులో ప్రవేశించిన సుమారుపధ్ధెనిమిది నెలల తరువాత  1947మార్చిలో ఇక్భాల్ బేగం ఊపిరి తిత్తుల కేన్సర్ తో బాధ పడి మరణించింది. ఇక ఆ ముగ్గురు ఆడపిల్లలకీ ఆలీబక్షే అమ్మా,నాన్నా. సుమారు 14ఏ ళ్ల వయసులోనే హీరోయిన్ గా మారిన "మీనాకుమారి" బాలనటి నుండీ సీరియస్ నటిగా యెదిగే మధ్య కాలంలో నటించినవన్నీ పౌరాణిక, జానపద చిత్రాలే!

ఆ చిత్రాలన్నిటికీ నిర్మాతా, దర్శకుడూ హోమీ వాడియా. ఆయనకొక స్వంత  స్టుడియో కూడా వుండేది. మీనాకుమారి  ముస్లిం అయినప్పటికీ "లక్ష్మీ నారాయణ్ ,వీరఘటోత్కచ్ ,హనుమాన్ పాతాళ్ విజయ్ ,శ్రీ గణేష్ మహిమ "లాంటి చిత్రాలలో చక్కటి హిందూ దేవతల పాత్రలు ధరించి ఒప్పించడం విశేషం. చివరగా ఆమె నటించిన జానపద చిత్రం పేరు"అల్లావుద్దీన్ లాంప్ "1950. ఆ చిత్రం పెద్ద హిట్ ,దానికి ఆమె అందుకున్న పారితోషికం పదివేలు, దానితో ఆమె ఒక సెకండ్ హాండ్ "ప్లిమత్ "కారు కొని డ్రయివింగ్ కూడా నేర్చుకుంది. ఆ తర్వాత తనను బాలనటిగా ప్రోత్సహించిన విజయభట్ పెద్దయ్యాక కూడా తన సినీ జీవితంలో మంచి బ్రేక్ కి కారణమయ్యాడు. ఆయన తీసిన "బైజుబావరా "విజయఢంకా మోగించింది. న టిగా మీనా కుమారినీ, గాయకుడిగా మహ్మద్ రఫీనీ, సంగీత దర్శకుడిగా నౌషాద్ నీ ఒక స్థాయిలో నిలిపిన చిత్రం బైజూబావరా , మీనాకుమారి విజయ పరంపర కొనసాగింది.

ఈలోపు "తమాషా "అనే సినిమా సెట్ లో అశోక్ కుమార్ తో హీరోయిన్ గా నటిస్తున్నపుడు ఆమె జీవితంలో కూడా ఒక తమాషా జరిగింది. అది ఆమె జీవితంలో ముఖ్యమయిన మలుపుకి కారణమయ్యింది. అదేమిటంటే ప్రముఖ రచయితా, కవి,  దర్శకుడూ, స్క్రీన్ ప్లే రైటర్ ,పర్ ఫెక్షనిస్ట్ గా పేరొందిన వాడూ, అప్పుడే తాజాగా సూపర్ హిట్టయిన "మహల్ "తో ప్రజలందరూ ఆరాధిస్తున్న కమల్ అమ్రోహిని ని అశోక్ కుమార్ మీనా కుమారికి పరిచయం చేశాడు. తొలి చూపులోనే ఆమె అతని ఆకర్షణలో పడిపోయింది.

మీనాకుమారిని అంతగా ఆకర్షించిన ఈ   కమాల్ అమ్రోహీ ఎవరో అసలు  కొంచెం తెలుసుకుందాం. ఇతని అసలు పేరు సయ్యద్ అమీర్ హైదర్ కమాల్ నక్వీ, ఇంట్లో  వాళ్లూ, దగ్గర వాళ్లూ "చందన్ "అని పిలుస్తారు,లోకానికంతటకీ కమాల్ అమ్రోహీ అనే తెలుసు. ఈయన ఆగస్టు 1వ తేదీ 1918న ఉత్తర ప్రదేశ్ లోని ,ఆగ్రా దగ్గరున్న అమ్రోహ అనే ఊరిలో జన్మంచాడు (అంటే మీనా కంటే పదిహేనేళ్లు పెద్దవాడు).చిన్నప్పటి నుండీ హిందీ,ఉర్దూలలో కవితలల్లుతూ వుండేవాడు. 1938 లో పై చదువులకు లాహోర్ చేరిన అతని ప్రతిభను గుర్తించి అతనిని బొంబాయి తీసుకు వచ్చి షోహ్రాబ్ మోడీకి పరిచయం చేసిన వాడు ప్రముఖ గాయకుడు కుందన్ లాల్ సైగల్ . అలా షోహ్రాబ్ మోడీ "మినర్వా మూవీటోన్ "లో చేరి "జైలర్ ,పుకార్ ,భరోసా "చిత్రాలకు పనిచేశాడు కమాల్ . ఎ.ఆర్ .కర్దార్ "షాజహాన్ "చిత్రానికి కూడా పని చేశాడు ఇతను బహుముఖ ప్రజ్ఞాశాలి.  కొన్ని సినిమాలకు  కథ నందించాడు, కొన్నిటికి సంభాషణల రచయితగా పనిచేశాడు, కొన్నిటికి పాటలు రాశాడు, కొన్ని సినిమాలకు రచనా,దర్శకత్వం కూడా నిర్వహించాడు. అలా అతను 1949 లో బాంబే స్టుడియోస్ వారికి రచనా ,దర్శకత్వం వహించిన చిత్రం "మహల్ ".అది సూపర్ హిట్టయి అతనికి ఎనలేని పేరు,ప్రఖ్యాతులు తెచ్చి పెట్టింది. నిర్మాతలూ,నటీనటులూ అతనితో పని చేయాలని తహతహలాడ సాగారు. మన మీనా కుమారి కూడా అతని గురించి సినీ జనాలు చెప్పుకునే మాటలు వినీ, అతని ఫోటో ఒక ఇంగ్లీషు పత్రికలో చూసీ ఆరాధనా భావంతో వుంది. కానీ అప్పటికే అతనికి రెండు పెళ్లిళ్లయ్యాయి,రెండో భార్య ద్వారా ముగ్గురు పిల్లలున్నారు. అతని మొదటి భార్య బిల్కీస్ బేగం మెహమూది. ప్రముఖ నటి నర్గిస్ తల్లి   జద్దన్ బాయ్ దగ్గర సహాయకు రాలిగా వుండేది. రెండో భార్య మొహమూది, ఆమెకు ఇద్దరు మొగపిల్లలు, ఒక ఆడపిల్ల. కమాల్ అమ్రోహీ   తన జీవితకాలంలో రచనా, దర్శకత్వం వహించినది నాలుగే సినిమాలు."మహల్ , దాయిరా, పాకీజా, రజియా సుల్తానా" . ముందు చెప్పినట్లు ఈయన ఒక  పర్ఫక్షనిస్టు,  ఎంత సమయం తీసుకునైనా సరే సబ్జక్ట్ కి న్యాయం చేయాలనుకునే వాడు. సరే తన మీద ఆరాధనతో వున్న మీనా కుమారిని అతను పెద్దగా పట్టించుకున్నట్టు కనపడలేదు కానీ,"తమాషా "రషెస్ చూశాక తన స్నేహితుడూ,సహాయకుడూ అయిన బాకర్ ఆలీతో "ఈమెపై ఒకకన్నేసి వుంచుదాం" అన్నాడు. కమాల్ అమ్రోహీ "ఒక కన్నేసి వుంచుదాం "అన్నాడు కానీ "ఒక చూపు చూద్దాం "అనలేదు మీనా కుమారి గురించి అందుకే అవకాశం వచ్చినపుడు తన పిక్చర్ లో బుక్ చేశాడు. మఖన్ లాల్ అనే నిర్మాత కమాల్ అమ్రోహీ  దర్శకత్వంలో "అనార్కలి "అనే సినిమా తీయాలని ఉత్సాహ పడ్డాడు. హీరోయిన్ గా అంతకు ముందు తన "మహల్ "లో నటించిన మధుబాలని బుక్ చేశారు.అయితే  ఆవిడ హీరో గా దిలీప్ కుమార్ ని బుక్ చేయాలని షరతు పెట్టడంతో ఆమెకి  ఉద్వాసన చెప్పి, ఆమె స్థానంలో మీనాని బుక్ చేశాడు కమాల్ అమ్రోహి.

ఆడబోయిన తీర్థం ఎదురయినంత సంతోషపడి వెంటనే అంగీకరించి మార్చి 13 ,1951 న అగ్రిమెంట్ మీద సంతకం చేసింది మీనా. ఆలీబక్ష్ ని కూడా పారితోషికం విషయంలో సంతృప్తి పరిచి, లొకేషన్ వెదికే పని మీద ఢిల్లీ ,ఆగ్రాలకు పయనమయి వెళ్లాడు కమాల్  ఈ లోగా జరిగిన సంఘటన వారిద్దరి జీవితాలలో పెను మార్పు తీసుకు వస్తుందని బహుశా వారు కూడా ఊహించి వుండరు.

మీనా కుమారి ఆరోగ్యం ఎప్పుడూ అంతంత మాత్రమేనట ,అలాంటిది ఆ సంవత్సరం ఏప్రిల్ లో వచ్చిన మూడు వారాల టైఫాయిడ్ తో చిక్కి శల్యమయితే గాలి మార్పుకని మహాబలేశ్వర్ వెళ్లారట. అక్కడ నుండీ తిరిగి బొంబాయి వస్తుండగా వారు ప్రయాణించే కారు ప్రమాదానికి గురయింది. మీనా ఎడమచేయి తీవ్రంగా దెబ్బతింది, తండ్రికి మూడుచోట్ల ఎముకలు విరిగాయి, చెల్లెలు మధు మాత్రం కొద్ది గాయాలతో బయట పడింది  ఆ సందర్భంగా పూనా లోని "ససూన్ హాస్పిటల్ "లో నాలుగు నెలలు ఉండి పోవాలిసి వచ్చింది.

మీనాకి తగిలిన గాయం తనని  చాలా ఆందోళన కలిగించింది , తిరిగి సినిమాలలో మామూలుగా పనిచేయగలుగుతానా?  అనే భయాందోళనలకు గురయి,నైరాశ్యంలో కూరుకు పోయింది మీనా కుమారి .చివరకు ఎలాగో ఎడమ చేతి ఉంగరం వేలూ,చి టికెన వేలు వంకరతో బయట పడగలిగింది. ఆ తర్వాత నటించిన ప్రతీ సినిమాలో ఎడమ చేతి చుట్టూ దుపట్టానో ,చీరకొంగునో కప్పి  ఆ వైకల్యం కనపడకుండా జాగ్రత్త పడేది. ఇదంతా జరిగింది మే 21,1951న.  ఈ ప్రమాదం వార్త తెలుసుకున్న కమాల్ ఢిల్లీ నుండి బయలు దేరి నేరుగా పూనా హాస్పిటల్ కి వచ్చాడట. అది మే 24వ తారీఖు సాయంత్రం మీనా చాలా దిగులుగా,నిస్పృహగా వుంది "తను మళ్లీ నటించ గలదా? తన కలల ప్రాజెక్ట్ అనార్కలిలో తనను వుంచుతారా? ఈ విధమయిన ఆలోచనలలో మునిగిన ఆమె కు తన ముందు గుమ్మంలో ప్రత్యక్షమయిన కమాల్ ని చూసి సంతోషంతో నోట మాట రాలేదు."ఆరోగ్యం ఎలా వుంది?  అని అడుగుతున్న అతనికి జవాబివ్వలేక పోయింది. ఇంతలో ఆమె సోదరి మీనా ఏమీ తీసుకోవడం లేదనీ  చివరికి ఒక గ్లాసు బత్తాయి రసం కూడా తీసుకోవడం లేదనీ ఫిర్యాదు చేసింది కమాల్ తో. అతను  మాట్లాడకుండా స్వయంగా  ఆ గ్లాసు తీసుకుని ఆమెకు తాగించాడు ,ఆమె మారుమాటాడకుండా తాగేసిందట .అలా "ఒక గ్లాసు బత్తాయి రసం తో వారి ప్రేమ మొదలయ్యింది " అంటాడు వినోద్ మెహతా. అలా కాబోయే అనార్కలీ కోసం దాదాపు ప్రతీ వారం వచ్చే అతనికీ  ఆమెకూ మధ్య ప్రేమ చిగురించి ,గాఢమవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ప్రతి రోజూ ఉత్తరాలు రాసుకునీ వారం చివరలో ఒకరికొకరు అంద జేసుకునే వారు. ఆమెకు అతనిలో సున్నితత్వమూ, మానవత్వమూ ,విశ్వాసమూ, నచ్చింది .తన ఆదర్శ పురుషుడతనే అనుకుంది. అతనికి ఆమెలోని విద్వత్తూ, స్పందించే గుణమూ, భావుకతా నచ్చాయి. వారిద్దరూ ఒకరికొకరు సరిజోడీ అనుకున్నారు. ఆమె అతనిని "చందన్ "అని పిలవసాగింది,అతను ఆమెను "మంజూ "అని పిలవసాగాడు. చివరకు హాస్పిటల్ నుండీ డిశ్చార్జ్ అవుతున్నందుకు మీనా ఒకరకంగా దిగులుపడిందంటే పరిస్థితి ఊహించండి. సరే  బొంబాయి తిరిగి వచ్చాక "అనార్కలి" షూటింగ్ ప్రారంభమయింది. దానితో పాటే మొదలయ్యాయి  వారి మధ్య తెల్లవార్లూ సాగే సుదీర్ఘ టెలిఫోన్ సంభాషణలు. ఆలీభక్ష్ నిద్రపోయాక అర్థరాత్రి మొదలయిన సంభాషణ తెల్లవారి కోడికూసాక  ముగిసేదట. రెండు షెడ్యూల్స్ షూటింగయ్యాక నిర్మాత మఖన్ లాల్ దివాళా తీయడంతో "అనార్కలీ" ఆగిపోయింది కానీ ఫోన్ సంభాషణలు ఆగలేదు.

చిత్ర పరిశ్రమ అంతా చెవులు కొరుక్కోసాగారు వీరిద్దరి అఫైర్ గురించి. కమాల్ మీద అంతకు ముందే "మహల్ "పనిచేస్తున్నపుడే మనసు పారేసుకున్న మధుబాల ఒకరోజు అతనిని పక్కకు పిలిచి వున్న భార్యాబిడ్డలను వదిలేసి  తనను పెళ్లిచేసుకుంటే  మూడులక్షలిస్తానని ఆశ చూపిందట. కమాల్ "నేను కథల్ని అమ్ముకుంటానే గానీ ,బిడ్డలని అమ్ముకోను "అని నిరాకరించాడట.అతనికి కావలసింది కేవలం అందమొకటే కాదు భావుకతా, కవిహృదయం నిండి వున్న వ్యక్తి అందుకే మీనా వేపు మొగ్గాడు అంటాడు వినోద్ .  వీరిద్దరీ ధోరణీ గమనించిన కమాల్ స్నేహితుడు బాకరాలీ  ఇర్వురిని పెళ్లి చేసుకోమని సూచించాడు. ఇటు మీనా వేపు నుండీ ఆమె చెల్లెలు మధూ కూడా అదే సలహా ఇచ్చింది.ఇద్దరూ పెళ్లి చేసుకోడానికి నిర్ణయించుకున్నాక ఒక షరతు పెట్టింది మీనా అదేమిటంటే ,తండ్రి ఆర్థిక ఇబ్బందులు తీరేదాకా, ఈ వివాహం సంగతి రహస్యంగా వుంచాలని, అలాగే అని ఒప్పుకున్న కమాల్ తనుకూడా ఒక షరతు పెట్టాడు , రాత్రుళ్లు టెలిఫోన్ సంభాషణలు కొన సాగాలని. ఫిబ్రవరి 14,1952 కేవలం ప్రేమికుల రోజే కాదు కమాల్ అమ్రోహీ,మీనా కుమారీల పెళ్లి రోజు కూడా. ప్రతి రోజూ సాయంత్రం ఫిజియోథెరపిస్ట్ దగ్గర చికిత్సకు చెల్లెలు మధుతో పాటు వెళ్లినట్టే ఆరోజు కూడా వెళ్లిన మీనా అటునుండీ బయటకు వెళ్లి పెళ్లి చేసుకుని మళ్లీ యేమెరగనట్టు క్లినిక్ కు తిరిగి వచ్చి ,ఇంటికి వచ్చేసింది. పెళ్లికి సాక్షులు చెల్లెలు మధూ,కమాల్ స్నేహితుడు బాకర్ ఆలీ.

కానీకాలం అన్నివేళలా సహకరించదు. ఒక సంవత్సరం గడిచాక ఆలీబక్ష్ కి ఉప్పందింది. వారి టెలిఫోన్ సంభాషణలే వారిని పట్టిచ్చాయి. నిజం తెలిసిన తండ్రి నిలదీశాడు, విడాకులిచ్చెయ్యమన్నాడు. అతనిని కలవవద్దనీ, మాటాడవద్దనీ ఆంక్షలు పెట్టాడు. అతను తీస్తున్న "దాయిరా " సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి వీల్లేదన్నాడు. అయితే ఇదంతా లెక్కచెయ్యని మీనా తండ్రిని కాదని, భర్త తీస్తున్న "దాయిరా" షూటింగ్ లో పాల్గొని వచ్చేసరికి పుట్టింటి తలుపులు శాశ్వతంగా మూసుకున్నాయి. వెంటనే ఆమె "చందన్ "వుంటున్న ఇంటి (రెంబ్రాంట్ )తలుపులు తట్టింది. సాదరంగా ఆహ్వానించాడు "చందన్ "అనే కమాల్ అమ్రోహీ. ఆగస్టు 14,1953న,కమాల్ అమ్రోహీ తో సంసారజీవితం ప్రారంభించింది మీనాకుమారి. అంతకు ముందున్న భార్య ఇతని ప్రేమ వివాహం సంగతి తెలిసి తగాదా పడి పిల్లలతో అమ్రోహ వెళ్లి పోయింది. ఆమె తన జీవిత కాలంలో ఎక్కువకాలం అక్కడే గడిపింది. చందన్ ,మంజూల వివాహ జీవితం మొదటి రెండూ మూడేళ్లూ"గృహమే కదా స్వర్గసీమ "అన్నట్టు సాగింది .ఖాళీ సమయాలలో ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకోవడం, కవిత్వం చదువుకోవడం, రమ్మీ ఆడుకోవడం. సాయంత్రమయితే అతని బ్యూక్ కారులో యే ఇంగ్లీషు సినిమాకో వెళ్లడం.... అలా ఆనందంగా గడుస్తున్నాయి రోజులు. అతను ఆమెకు సోక్రటీస్ అంతటి జ్ఞానిలాగా, ఆలీఖాన్ అంత అందంగా, ఇందిరా గాంధీ అంత తెలివిగా,రాజేష్ ఖన్నా అంత ఆకర్షణీయంగా కనపడే వాడు అంటాడు వినోద్ మెహతా. ఆమె ఎప్పుడూ తనను తాను మార్లిన్ మన్రో తోనూ,కమాల్ ని ఆర్థర్ మిల్లర్ తోనూ పోల్చుకునేదట. అతనూ ,బాకర్ ఆలీ కలసి ఆమె డేట్సూ,రెమ్యూనరేషన్ ,చిత్రాల ఎన్నికా తదితర విషయాలు చూసేవారు, ఇదివరకు ఆమె తండ్రి ఇవన్నీ చూసేవాడు. అలా ఆమె 1952 నుండీ 1964వరకూ తీరిక లేకుండా చిత్రాలలో నటిస్తూనే వుంది.నటిగా బాగా పాప్యులర్ అయింది.నటిగా ఆమె జీవితకాలంలో (బాలనటిగా మినహాయిస్తే)77చిత్రాలలో నటిస్తే అందులో 50చిత్రాలు ఈ కాలంలో నటించినవే.

ఆమె నటించిన అన్ని చిత్రాల గురించీ చెప్పడం సాధ్యపడదు కానీ కొన్ని ముఖ్యమయిన వాటిని మాత్రం తలుచుకోవాలి. ఆమె నట జీవితంలో మంచి బ్రేక్ ఇచ్చిన చిత్రం విజయ్ భట్ తీసిన "బైజు బావ్రా ".1952లో ఈ చిత్రం విడుదలయ్యే నాటికే ఆమెకు పెళ్లయింది.ఈ చిత్రం ఆమెకు "తార "హోదా కల్పించింది.దీనికి ఫిల్మ్ ఫేర్ నెలకొల్పిన మొట్టమొదటి అవార్డ్ (1954)మీనాకుమారికే దక్కడం గొప్ప విషయం, విశేషంగా  భావిస్తారు సినీజనాలు. అంతేకాదు వరసగా రెండో సంవత్సరం కూడా ఆ అవార్డు 1953లో ఆమె నటించిన "పరిణీత"కు దక్కింది . అప్పుడామె చాలా ఆనందించింది నిజంగా.  శరత్ నవల ఆధారంగా బిమల్ రాయ్ తీసిన ఆ చిత్రం ఆమె లోని నటనా ప్రతిభను వెలికి తీసిందంటారు. ఆమె జీవితకాలంలో ఆమెకు నాలుగు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి. 1.బైజుబావ్రా1952. 2.పరిణీత1953, 3.సాహిబ్ -బీబీ అవుర్ గులామ్ 1962, 4.కాజల్ 1966.
ఆమె నటించిన చిత్రాలలో చెప్పుకోదగిన చిత్రాలు దక్షిణాదిచిత్రాల రీమేక్స్ అవడం,దర్శకులు కూడా వారే అవడం విశేషం. ఉదాహరణకి "శారద-ఇలవేల్పు-ఎల్ .వి. ప్రసాద్ (నిర్మాత-దర్శకుడు ).ఇది సూపర్ హిట్టు,ఆమెకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. "ఆజాద్ "-అగ్గి రాముడు-యస్ .యమ్ .శ్రీరాములు నాయుడు "మిస్ మేరీ---మిస్సమ్మ "మైభీ లడ్కీహు--నాదీ ఆడజన్మ "మై ఛుప్ రహూంగీ---మూగనోము "దిల్ ఏక్ మందిర్ ----మనసే మందిరం.... ఇలా ఆమె ఒక పక్క తీరిక లేకుండా వుంటే ,కమాల్ అమ్రోహీ 1953లో తీసిన "దాయిరా "బొంబాయిలో రెండు రోజులు మాత్రమే ఆడి అటకె క్కింది . ఆ సినిమాని పూనా ఫిల్మ్ ఆర్కవ్స్ లో పాఠ్యాంశం కింద భద్ర పరచి వుంచారు అంటారు తాజ్ దార్ అమ్రోహీ. అతనికంటూ సినిమాలు లేవు. ఎప్పుడూ సినిమా ఫీల్డ్ లో లైమ్ లైట్లో వుండటం ముఖ్యం లేకపోతే ప్రజలు మర్చిపోతారు, తోటి వారు విలువివ్వరు. ఇప్పుడు అతను కేవలం మీనాకుమారి డేట్స్ చూసే మేనేజర్ లాగా అయిపోయాడు. నెమ్మదిగా వారి సంసారంలో పొరపొచ్చాలు మొదలయ్యాయి. ఆమె పట్ల అతను మొదట చూపినంత ప్రేమ చూపడం లేదనేది ఆమె ఫిర్యాదు.దాంట్లో అర్థం లేదనీ,రెండు మూడేళ్లుగా కాపురం చేస్తున్న భార్యా భర్తల మధ్య ప్రతి రోజూ ప్రేమకవిత్వాలు చెప్పుకోనక్కరలేదనీ, అంతా ఆమె అనవసరంగా ఊహించుకుంటోందనీ కొట్టిపారేశాడు. ఆమెకు కావలసిన "బాసీరోటీ "కూడా ఇంటో దొరకడం లేదనేది ఆమె అసంతృప్తులలో ఒకటవడం విచిత్రం.

క్రమంగా వారి వివాహ జీవితం బీటలు వారడం మొదలయింది.సినిమా ఫంక్షన్లలోనూ,పిక్చర్ ప్రీమియర్లలోనూ,"ఈయన మీనాకుమారి భర్త "అని పరిచయం చేస్తుంటే అభిమానం తోనూ,ఒకరకమయిన గర్వంతోనూ వుండే కమాల్ న్యూనత పడి అక్కడనుండీ వెళ్లిపోవడం,మీనా ఒక్కతే మిగిలి పోవడం జరుగుతూ వుండేది. చిత్రాల ఎన్నిక విషయంలో కూడా కొన్ని మంచి సినిమాలు అనుకున్నవి,ఆమెకు తెలియకుండానే కమాల్  తిరస్కరించడం ,ఆమెకు అది  తెలిసి బాధపడటం జరుగుతుండేవి. అలా చేజారినవే బిమల్ రాయ్ "దేవదాసు "లోని పాత్ర.గురుదత్ "సాహెబ్ బీబీ అవుర్ గులామ్ "లో పాత్ర కూడా మొదటి సారి అడిగినప్పుడు కమాల్ వీలవదు అంటే , గురుదత్ కొంతకాలం షూటింగ్ చేసి ఇతరులెవ్వరూ నచ్చక మళ్లీ నేరుగా మీనాని డైరెక్ట్ గా కలిసి అడిగితే అంగీకరించి నలభై అయిదు రోజుల కాల్షీట్లిచ్చింది.అందులోని "ఛోటీ బహు "పాత్ర ,ఆమె నట జీవితంలో మైలురాయి లాంటిది. ఈ విభేదాల గురించి నిలదీసిన మీనాతో "నువ్వు ఒక నటిగా కాదు మహజబీన్ గా ,ఒక గృహిణిగా నా ఇంట్లో కి అడుగు పెడతానన్నావ్ "అని గుర్తు చేశాడు కమాల్ ."అవున్నిజమే ఇప్పుడు నా చేతిలో వున్న సినిమాలు పూర్తి చెయ్యాలంటే విడాకులు తీసుకోవాలయితే "అన్న మీనాకి కొన్ని షరతులు విధించాడు భర్త అవి సాయంత్రం 6.30 కల్లా ఇంటికి రావాలి. తన మేకప్ రూమ్లోకి ఎవ్వరినీ రానీ కూడదు. తన కారులో ఎవ్వరినీ ఎక్కించకూడదు ,ఎవ్వరి కారు లోనూ తానెక్కకూడదు. 

సహజంగానే,  ప్రేమకే గానీ, అధికారానికి లొంగని స్వభావం కలిగిన మీనా షరతులకి లొంగినట్టే కనిపిస్తూ, అతని షరతులకు వ్యతిరేకంగా ప్రవర్తించి అబధ్ధాలు చెప్పడం మొదలెట్టింది. ఈ సమయంలో "బెనజీర్ "సినిమా సెట్స్ మీద పరిచయమయిన గుల్జార్ వలన ఆమెకు కొంత సాంత్వన లభించింది.అతనితో కవిత్వం గురించీ,గజల్స్ గురించీ ఆలోచనలు పంచుకుని ఇంట్లోని కలతలు మరిచిపోయేది. ఒకరోజు "పింజ్రేకీ పంఛీ"సినిమా షూటింగ్ ఫిల్మ్ స్థాన్ స్టుడియోలో జరుగుతుండగా,స్టుడియో లోకి అడుగు పెట్టిన మీనాకి కమాల్ తన మీద కాపలాగా బాకర్ ఆలీని పంపాడనీ, మేకప్ రూంలోకి ఎవ్వరినీ రానివ్వద్దన్నాడనీ తెలిసింది.అగ్గి మీద గుగ్గిలమయిన మీనా గుల్జార్ ని తన మేకప్ రూమ్ కి రమ్మని ఆహ్వానించింది, భయం భయంగా వస్తున్న గుల్జార్ ని బాకరాలీ అడ్డుకున్నాడు .మీనాకీ ,బాకరాలీకి మాటా మాటా పెరిగింది ,మీనా బాకరాలీ తన చెంపమీద కొట్టాడంటుంది. అభిమానం దెబ్బతిన్న మీనా మరి" రెంబ్రాంట్ "లో అడుగు పెట్టనంది(కమాల్ నివాసం). సాయంత్రం షూటింగయ్యాక చెల్లెలు మధూ,మొహమూద్ (హాస్యనటుడు)ఇంటికి చేరుకుంది ,పోలీస్ ఎస్కార్ట్ తో. ఊరంతా వెతికి, వెతికి,మధూ ఇల్లు చేరుకున్న కమాల్ ,మూసిన మీనా గది తలుపుల ముందు నిలచి అనేక రకాలుగా బతిమాలాడు. బాకరాలీని వెంఠనే పనిలోనుండీ తీసేస్తానన్నాడు,"నువ్వు నాభార్యవి, నేను నీ భర్తని తిరిగి ఇంటికి తీసుకు వెళ్లడానికి వచ్చానన్నాడు" ససేమిరా తలుపులు తెరుచుకోలేదు.ఎంతకూ తెరవని తలుపుల ముందు నిలచి ఆభిజాత్యం పుష్కలంగా వున్న కమాల్ "ఇదే ఆఖరి సారి ఇక మళ్లీ తిరిగి రానని "చెప్పి వెళ్లిపోయాడు.అలా మార్చ్ 5,1964న చందన్ ,మంజూల వివాహం విఛ్ఛిన్నమయింది

భార్యా ,భర్తలిద్దరిమధ్యా విభేదాలు పొడసూపినపుడు,రకరకాల ఊహాగానాలు బయలు దేరుతాయి, ఎవరిది తప్పూ?అని విచారించి తీర్పులు చెప్పడానికి బయలుదేరి పోతారు కొంతమంది,కానీ వారిద్దరీ మధ్యా జరిగినవీ,వారి పడకగది సంగతులూ ,వారికీ ఆ పరమాత్మకూ తప్ప వేరే వాళ్లకి యెలా తెలుస్తాయి ,తీర్పు చెప్పడానికి. కమాల్ అమ్రోహీకీ,మీనాకుమారికీ వచ్చిన విభేదాలు పెరిగి పెద్దవవడానికి చిత్ర పరిశ్రమలోని రెండు గ్రూపులు ప్రధాన పాత్ర పోషించాయంటారు. అవి ఒకటి బిమల్ రాయ్ , సలీల్ చౌధురీ,అ చలాసచ్ దేవ్ గ్రూపు, రెండు మొహమూద్ ,అతని భార్య మధూ గ్రూపు ఈ రెండు గ్రూపులూ మీనాకి కమాల్ గురించి చెడ్డగా చెబితే,కమాల్ కి మీనా గురించి చెప్పడానికి బాకరాలీ తదితరులు కృషి చేశారు. ఏది యేమైనప్పటికీ కమాల్ ,మీనాకి చివరి వరకూ విడాకులివ్వలేదు. అతను 1956లోమొదలు పెట్టిన "పాకీజా" సినిమా అతని కలల ప్రాజెక్టు, మీనా కుమారికి తను ఇవ్వబోతున్న  ప్రేమ కానుకగా అనుకున్నది. వీరు విడిపోవటంతో మధ్యలోనే  ఆ సినిమా ఆగిపోయింది. మీనాకుమారి అతని మీద కసి తీర్చుకోడానికి, దానిని పూర్తి చేయకూడదనుకుందని అనుకున్నారు.

1964లో మరిది మొహమూద్ ఇల్లు చేరిన మీనా తన జీవిత కాలంలో మూడు ఇళ్లు మారింది. మొదట కొంతకాలం మొహమూద్ బంధువుల ఇంటి పై భాగంలో (పారడైజ్ ,అంధేరీ) అయిదు నెలలు వుంది. ఆ తర్వాత ఆగస్టు 1964 లో "జానకీ కుటీర్ (జుహూ)అనే ఇంటికి మారింది.ఇక్కడ ఆమె చుట్టూ బంధువులు ఈగల్లా మూగారు.ఆమె సవతి సోదరి షమా, సోదరి మధూ, కిషోర్ శర్మా, వగైరా పాతిక మంది దాకా వుండే వారట. ఆమె సోదరి మధూ,మొహమూద్ కి విడాకులిచ్చి,కిషోర్ శర్మని పెళ్లాడి వచ్చి జానకీ కుటీర్ లో వుండ సాగింది .అతను మీనా తో కూడా సన్నిహితంగా మెలుగుతూ ఆమె డేట్సవీ చూస్తూ వుండేవాడు, భర్తతో విడి పోయాక.సుమారు అయిదు సంవత్సరాలు అక్కడ గడిపాక 1969 లో చివరగా కార్టర్ రోడ్ లోని "లాండ్ మార్క్ "అనే భవనం పదకొండవ అంతస్తులోని అపార్ట్ మెంట్ కొనుగోలు చేసి ,తన అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకుని చివరి వరకూ అక్కడే వుంది.

భర్తను వదిలేసి బయటకు వచ్చిన యెనిమిది సంవత్సరాలలో ఆమె జీవితం చాలా మలుపులు తిరిగింది. కమాల్ తో సుదీరర్ఘంగా సాగిన ఫోన్ సంభాషణల వల్ల సంక్రమించిన "నిద్రలేమి" అనే వ్యాధికి మందుగా డా"సయ్యద్ తిముర్జా ప్రిస్కృయిబ్ చేసిన ఒక పెగ్గు బ్రాందీ,ఆమె జీవితాన్ని క్రమక్రమంగా కబళించసాగింది. భర్త దగ్గరున్నపుడే ఆమె డోస్ మితీ మీరడం అతను గమనించాడు, బాత్రూములో డెట్టాల్ సీసాల్లో డెట్టాల్ బదులు బ్రాందీ వుండటాన్ని పసిగట్టి ,ఆమెను కంట్రోల్ చెయ్యడం మొదలెట్టాడు.ఇదంతా జరిగింది సుమారు 1963-64మధ్య కాలంలో.

 అయితే ఆవిడ ఎప్పుడయితే బయట అడుగు పెట్టిందో అప్పుడే మద్యం మీద ఆ నియంత్రణ  పోయింది. పగలూ,రాత్రీ తేడా లేకుండా రోజుకు రెండూ,మూడూ,ఫుల్ బాటిల్స్ తీసుకోవడం ఆరోగ్యం మీద అతి తక్కువకాలంలో ఎక్కువ  ప్రభావం చూపింది.అంటే కేవలం మూడు సంవత్సరాల కాలంలో 1965-68,ఆమె లివర్ సిర్రోసిస్ అనే వ్యాథికి గురయ్యింది. పదే,పదే హాస్పటల్ పాలవ్వడం మొదలయింది.

 చివరకు 1968జూన్ లో కిషోర్ శర్మని సహాయంగా తీసుకుని లండన్ వెళ్లి ,అక్కడ డా"షీలా షెర్లాక్ అనే లేడీ డాక్టర్ ఆధ్వర్యంలో మూడు నెలలు చికిత్సపొంది, అటునుండీ స్విట్జర్లాండ్ వెళ్లి కొంతకాలం విశ్రాంతి తీసుకుని ఇండియా తిరిగి వచ్చింది. 1968సెప్టెంబర్ లో తిరిగి వస్తున్న ఆమెను డాక్టర్లు మద్యం చుక్కముట్టు కోవద్దనీ ,వెంటనే పని ప్రారంభించ వద్దనీ హెచ్చరించారు.

1968 ఆగస్టులో కమాల్ ఆమెకొక లేఖ వ్రాశాడు ,అందులో సగంలో ఆగి పోయిన "పాకీజా" పూర్తి చేయాలనీ, ప్రతిఫలంగా ఆమె యేం కావాలంటే అదిస్తాననీ, చివరకు ఆమె కోరినట్టు విడాకులివ్వడానికయినా సిధ్ధమేననీ, ఆమెనే మనసులో వుంచుకుని,ఆమెకు నివాళిగా ప్రారంభించిన పాకీజా ప్రస్తుతం మునిగి పోతున్న ఒక ఓడ అనీ ,దానిని దరి చేర్చ గలిగినది ఒక్క మీనా యే ననీ ,ఆలోచించమనీ వుందందులో. నర్గీసూ,సునీల్ దత్తూ,ఖయ్యామూ అతని భార్య జగజీత్ కౌరూ కూడా"అంత చక్కని సినిమా పూర్తయితే బాగుంటుంది" అనడంతో,మీనా ఆ సినిమా పూర్తి చేయడానికి పూనుకుంది- అలా ఆగిపోయిన 5 సంవత్సరాల పన్నెండు రోజుల తర్వాత"పాకీజా "తిరిగి ప్రారంభ మయింది.పారితోషికంగా ఒక నాణెం ఇస్తే చాలంది.కమాల్ సంతోషంగా ఒక బంగారు నాణెం ఇచ్చాడు. షూటింగ్ ప్రారంభమయిన రోజు ఆమె కిష్టమయిన మిఠాయి "పేటా "తో ఆమెకు స్వాగతం చెప్పాడు.

అయితే ఆమె ఆరోగ్య కారణాల దృష్ట్యా తానా పాత్రకు న్యాయం చేయలేనేమో నని భయపడుతుంటే అన్నీ తాను చూసుకుంటానని ధైర్యం చెప్పాడు. శారీరకంగా ఎన్నో మార్పులు వచ్చిన ఆమె క్లోజప్స్ మాత్రం తీసుకుని,లాంగ్ షాట్స్ లోనూ,నృత్య సన్నివేశాలలోనూపద్మాఖన్నాని తీసుకుని పూర్తి చేశారు. 1956 లో మొదలు పెట్టిన పాకీజా చిత్రం సుమారు పదహారు సంవత్సరాల తర్వాత 1972లో విడుదలయింది.ఈ లోగా మ్యూజిక్ డైరెక్టర్ గులామ్ మొహమ్మద్ మరణిస్తే, నేపథ్య సంగీతమూ ,అక్కడక్కడా ఠుమ్రీలూ నౌషాద్ సమకూర్చారు. సినిమటోగ్రాఫర్ జె.విర్షింగ్ (జర్మన్ )కూడా మరణించారు.బ్లాక్ అండ్ వైట్ లో కొంత సినిమా తీసి మధ్యలో కలర్ ఫోటోగ్రఫీ వచ్చాక ,మొదటిదంతా చెరిపేసి కలర్లో తీశారు .ఆతర్వాత సినిమా స్కోప్ వచ్చాక మళ్లీ ఆ టెక్నిక్ ఉపయోగించారు. సినిమా ఎట్టకేలకు  పూర్తయి ఫిబ్రవరి నాలుగున బొంబాయి "మరాఠా మందిర్ "లో రిలీజయ్యింది.ఒకరోజు ముందు ఆ థియేటర్లోనే ప్రదర్శించిన ప్రిమియర్ షోని మీనా తన భర్త పక్కనే కూచుని చూసింది.ఎంతో సంతోషించింది,తన భర్తని "చాలా చక్కని దర్శకుడు "అని మెచ్చుకుంది,"ఇది అతను తన కిచ్చిన నివాళి "అంది. అయితే చిత్రం వసూళ్ల పరంగా ఆశా జనకంగా లేదు.

1972మార్చ్ 31న 38 ఏళ్ళవయసుకే  మీనా కుమారికి నూరేళ్ళు నిండిపోయాయి. ఆమె  అస్తమించిదన్న వార్త విన్న ప్రజలు తండోపతండాలుగా మీనాకుమారిని చూట్టానికి ఎగబడ్డారు. ఆమే మరణ వార్త పాకీజా చిత్రాన్ని  సూపర్ హిట్ చేసింది  "మొగలె ఆజం"తర్వాత క్లాసిక్ గా  జనాలు పాకీజాని  చెప్పుకున్నారు.

ఆమె నటించిన డెభ్భయ్యేడు సినిమాలలో నాలుగు యెన్నదగిన చిత్రాలు. బైజుబావరా, పరిణీత, సాహిబ్ బీబీ అవుర్ గులామ్ , పాకీజా.వీటిలో సాహిబ్ బీబీ అవుర్ గులామ్ లో ఆమె నటన అత్యున్నత ప్రమాణాలలో వుంటుంది. బిమల్ మిత్రా రాసిన నవలకి , గురుదత్ , అబ్రార్ అల్వీ సినిమా రూపాన్నిచ్చారు.దర్శకుడు అబ్రార్ అల్వీ అయినా పాటలు తీసింది గురుదత్ . తనకి నటించటానికి కష్టంగా అనిపించిన పాత్ర ఇదని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మీనా. నటనకు సంబంధించి కమాల్ ని కూడా సలహాలు అడుగుతూ వుండేదట ఈ సినిమాలో నటించేటప్పుడు. భర్తను ప్రేమించి,అతని కోసం యేమైనా చేసే ,చివరకు మద్యమైనా తీసుకునే "ఛోటీబహు"గా ఆమె నటన మెచ్చదగింది."నజావో సయ్యా "లో భర్తను కవ్విస్తూ సున్నితంగా ఆమె చూపే హావభావాలు శృంగారానికి పరాకాష్ఠగా అనిపిస్తాయి."పరిణీత "లోనూ, ఇందులోనూ ఆమె అచ్చమయిన బెంగాలీ స్త్రీ  లాగా కనపడటానికి ఆమెలో ప్రవహించే బెంగాలీ రక్తమే కారణ మంటారు కొందరు. నాకు కూడా వ్యక్తిగతంగా ఇష్టమయినది ఈ సినిమా. విచిత్రమేమంటే 1962లో వచ్చిన ఈ సినిమాలో తాగుబోతుగా నటించేటప్పటికి ఆమెకు తాగుడు అలవాటు లేదట. మొహం ఉబ్బినట్టుగా కనిపించడానికి ముక్కుకింద యూ-డి-కొలోన్లో ముంచిన దూది వుంచుకునేదట.

ఇక ఆమె హాబీలు ,కవిత్వం రాయడం,పుస్తకాలు చదవడం.ఆమె "నాజ్ "అనే పేరుతో హిందీలోనూ,ఉర్దూలోనూ కవితలూ,గజల్సూ,కథలూ రాసేది. ఆమె మంచం పక్కన అలెస్టర్ మెక్లీన్ ,గుల్షన్ నందా,ఎమిలీ బ్రాంటే పుస్తకాలు వున్నాయని వినోద్ మెహతా రాశాడు. 1971లో ఖయ్యామ్ దర్శకత్వంలో తను స్వయంగా పాడి "ఐరైట్ ,ఐరిసైట్ "అనే ఎల్ .పి విడుదల చేసింది.దానిలోవన్నీ ఆమె రాసిన కవితలే.అందులో ఆమె గొంతు ఎంత మధురంగా వుంటుందో!  గుల్జార్ తో కవిత్వం గురించి మాటాడేది అని చెప్పుకున్నాం కదా ,తన తదనంతరం తన డైరీలూ,తన కవితలూ గుల్జార్ కే అప్పజెప్పాలని వీలునామా రాసిందట. అతను ఆమె కవితలతో ఒక పుస్తకం ప్రచురించాడంటారు.వారిద్దరిదీ కవితానుబంధం మాత్రమేనట. అయితే కమాల్ తో విడిపోయే నాటికి సినీ నటుడు  ధర్మేంద్రతో పీకల్లోతు ప్రేమలో మునిగి వుందనీ, అతను పైకి రావడానికి ఆమే కారణమనీ, పైకి వచ్చాక అతను ఆమెను దూరం పెట్టాడనీ అంటుంటారు. ధర్మేంద్ర తర్వాత ,రాహుల్ అనే అతని పేరూ,సావన్ కుమార్ తక్ అనే దర్శకుడి పేరూ ప్రముఖంగా వినపడ్డాయి.ఈ సావన్ కుమార్ తక్ "గోమతీ కె కినారే" అనే సినిమా తీశాడు ఆమెతో.అదే ఆమె చివరి చిత్రం.

1968లో లండన్ నుండీ తిరిగి వచ్చాక మద్యం ముట్టలేదని కొందరూ,మద్యం తీసుకుందని కొందరూ అంటారు.సావన్ కుమార్ మాత్రం "ఆమె తీసుకోక పోవడమే కాదు ,నన్ను కూడా చుక్క ముట్టుకోనివ్వలేదు" అంటాడు. 1972వచ్చేనాటికి ఆరోగ్యం మరింత క్షీణించసాగింది.అక్క ఖుర్షిద్ తోనూ,ఆమె పిల్లలిద్దరి తోనూ "లాండ్ మార్క్ "లో తన సొంత ఇంటిలో తనకు నచ్చినట్టుగా ప్రశాంతంగా జీవించసాగింది. మార్చ్ 28,1972 తీవ్రమైన అనారోగ్యంతో మలబార్ హిల్ లో వున్న సెంట్ ఎలిజబెత్ నర్సింగ్ హోమ్ లో చేరింది,మార్చ్ 31న ఈ లోకాన్ని విడిచి పెడుతూ "నాకింకా బతకాలనుంది" అని ఆక్రోశించింది.

ఆమె సమాధి మీద ఇలా రాయమని కోరింది."విరిగిన వాయులీనంతో, తెగిన పాటతో, పగిలిన గుండెతో, ఆమె శెలవు తీసుకుంది. అయినా లేదు కించిత్ పశ్చాత్తాపం"

ఆమెగురించి ఆమే ఇలా  చెప్పుకుందట "నాలో చాలా లోపాలున్నాయి ,తప్పులున్నాయి, బలహీనతలున్నాయి, కానీ ఒంటరితనంలోవేగిపోయేటప్పుడూ ,నావిషాద క్షణాలలో ,ఈ లోకం నుండీ దూరంగా పారిపోయి ,నా మీద నేను జాలిపడేటప్పుడూ,నన్ను నేను తిట్టుకునేటప్పుడూ---అనిపిస్తుంది నేనేమంత చెడ్డదాన్ని కానని----అయినా నేనొక బలహీనతల పుట్టని"-------ఎవరు కాదని?

Comments

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము