వెండి తెరకు అమృతం తెచ్చిన జాబిలి కృష్ణకుమారి


ఇది "మా అమ్మ కృష్ణకుమారి " అనే పేరుతో ఆమె కుమార్తె దీపికా మయ్యా ఇంగ్లీషులో రాసిన పుస్తకం చదివాక నాకు కలిగిన స్పందన. ఇది సినీ తార కృష్ణకుమారి జీవిత చరిత్ర. జీవిత చరిత్రలు రెండు రకాలుగా రాస్తారు. ఒకటి తమకు తామే రాసుకునే స్వీయచరిత్రలు ,రెండు ఇతరులు తమ గురించి రాసే జీవిత చరిత్రలు. స్వీయచరిత్రలో సాధికారత గురించి ప్రశ్నించ వలసిన అవసరం లేదు.  ఎందుకంటే ఒక వ్యక్తి తన గురించి స్వయంగా చెప్పుకుంటాడు కాబట్టి, జీవిత చరిత్ర విషయానికొస్తే అది రాసే వారిని బట్టి వుంటుంది. ఆ రాసే వ్యక్తి అంటే రచయిత సదరు వ్యక్తి కి పరిచయం వున్న వాడయి వుండచ్చు లేదా అసలు ముఖమే ఎరుగని అపరిచితుడయి వుండవచ్చు, అయితే రచయిత ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి అయి వుండి, దగ్గరగా గమనించి నిస్పక్షపాతంగా రాస్తే ఆ పుస్తకానికొక సాధికారత నిస్సందేహంగా చేకూరుతుంది. అలా ఈ పుస్తకంలో కృష్ణ కుమారి గారి గురించి రాసిన విషయాలలోనూ,సమాచారంలోనూ ఒక అథెంటిసిటీ వుందని భావిస్తున్నాను ,రాసింది వారి అమ్మాయి కాబట్టి.

పుస్తకం రూపొందించిన విధానంలో కూడా ఒక వైవిధ్యముంది.ఆమె కుమార్తె దీపిక ,తన చిన్నతనంలో తల్లి నటించిన సినిమాల వీడియో కేసట్లు బడి నుండీవస్తూ తీసుకొచ్చి చూడటం దగ్గరనుండీ మొదలు పెట్టి తన తల్లి జీవితంలోని ఒక్కో ఘట్టాన్నీ,ఆమె పుట్టుక నుండీ జీవిత చరమాంకం వరకూ నెమ్మది నెమ్మదిగా విప్పి చెపుతూ మధ్య మధ్యలో ఆమె చేసే వంటల గురించి ప్రత్యేకంగా వివరిస్తూ వాటికి సంబంధించిన ఫోటోలూ, సమాచారమూ ఇవ్వడం వలన పుస్తకానికొక వింత ఫ్లేవర్ ని చేకూరింది

దీపిక సాధ్యమయినంతవరకూ తనకు తెలిసిన సమాచారాన్ని దాపరికం లేకుండా తాను ఆమె పెంపుడు కూతుర్నన్న విషయం కూడా మరుగు పరచ కుండా చెప్పడం ఆమె నిజాయితీనీ,వ్యక్తిత్వాన్నీ,పెరిగిన తీరునీ సూచించినట్టనిపించింది.అయితే ఆమె తల్లికీ, కుటుంబానికీ ఇబ్బంది కలిగిస్తాయనుకున్న సంఘటనలను చెప్పకుండా వదిలి వేసి వుండొచ్చు అది ఆమె విజ్ఞతకు సంబంధించిన విషయం, నేనీ పుస్తకంలో  తను చెప్పిన విషయాలకు మాత్రమే పరిమితమయి రాస్తున్నాను. ఆమె తన దృష్టి కోణం నుండీ తల్లికీ తనకూ వున్న అనుబంధాన్ని వివరిస్తూ మధ్య మధ్యలో గతంలోకి వెళ్లి ఆమె సినిమా జీవితం గురించీ,వ్యక్తిగత జీవితం గురించీ చెప్పడం దానికి సంబంధించిన పేపర్ కటింగ్సూ ,ఫోటోలూ జత  చేర్చడం చేసింది,వంటల ఫోటోలు సరే సరి.అందువలన ఇది కేవలం కృష్ణకుమారి జీవిత చరిత్రే కాదు,పడుగూ పేకా లాగా ఆమెతో జీవితమల్లుకున్న దీపిక జీవిత చరిత్ర కూడా.

ఇక కృష్ణకుమారి జీవిత ప్రస్థానం దీపిక మాటల్లో........

టేకుమళ్ల కృష్ణకుమారి రాజమండ్రికి చెందిన మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో టేకుమళ్ల వెంకోజి రావు,శచీదేవీ లకు పధ్నాలుగుమంది సంతానంలో ఒకతెగా జన్మించింది. అది వారు ఉద్యోగ రీత్యా పశ్చిమ బెంగాల్ లోని నైహతిలో వుండగా మార్చ్ ఆరున 1933లో ఆమె పుట్టింది. ఆమె తండ్రి పేపర్ మిల్స్ లో పని చేసే వారు, ఆ కారణంగా ఆయన దేశం లోని వివిధ ప్రాంతాలలో పని చేశారు.అలా ఆయన పిల్లలు ఒకో రాష్టృంలో ఒక్కొక్కరు పుట్టారట.  పుట్టిన పధ్నాలుగు మందిలో బతికి బట్టకట్టింది ఆరుగురే.  ముగ్గురు మగ పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు. వారిలో ప్రఖ్యాత నటి షావుకారు జానకి ఒకరు ఈవిడ  కృష్ణకుమారి అక్క. కృష్ణ కుమారి తెలుగు సినిమాలలో మంచి పేరు తెచ్చుకుంటే జానకి  తమిళ చిత్రాలలో ఎక్కువ నటించింది. అబ్బాయిలు రామ్ , రఘు, భాస్కర్ --అమ్మాయిలు జానకి, కృష్ణకుమారి, దేవకి.

వెంకోజీ రావు గారిని మద్రాస్ గవర్నమెంట్ పేపర్ తయారీ గురించీ, రీసైక్లింగ్ గురించీ పై చదువులకి లండన్ పంపించింది. ఆయనక్కడ రెండు సంవత్సరాలుండి ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకుని ఇండియా తిరిగి వచ్చారు. వారిదెంత సనాతన కుటుంబమంటే విదేశాలకి వెళ్లినందుకు ప్రాయశ్చిత్తంగా బంగారు తీగ కాల్చి నాలుకమీద వాత పెట్టారట.అయితే ఆయన చాలా విశాల భావాలూ,ఉన్నతమైన ఆలోచనలూ వున్నవ్యక్తి అనీ ఆయన పోలికే కృష్ణ కుమారి పుణికి పుచ్చుకుందనీ దీపిక రాస్తోంది.

సరే పిల్లల చిన్నతనమంతా దేశంలోని వివిధ ప్రదేశాలలో గడిచింది. తండ్రి విదేశాలు వెళ్లి రావడంతో పిల్లల పెంపకంలో కొన్ని యూరోపియన్ పధ్ధతులు పాటించేవారు. ఇంగ్లీషు ట్యూటర్ని పెట్టి చదువు చెప్పించడం,మాంసాహార వంటకాలు వండించి పెట్టడం ఇలాంటివి. కొంత కాలం గడిచాక అంతా ఇంగ్లీషే అలవాటయితే తెలుగు వాళ్ల సంబంధాలు కూతుళ్లకు రావేమో అనే ఆలోచనతో కుటుంబాన్ని మద్రాసు పంపించి తాను మాత్రం కలకత్తాలో వుండేవారట ఆమె తండ్రి.
మద్రాసులో జానకి, కృష్ణకుమారి దుర్గాబాయ్ దేశ్ ముఖ్ గారి స్కూల్లో చేరి చదువుకునే వారు.కృష్ణ కుమారి అలా మెట్రిక్ పాసయ్యారు.  

చిన్నతనం నుండీ కృష్ణ కుమారి  ముఖకవళికలూ, కదలికలూ గమనించిన తండ్రి ఆమెలో డాన్సరయ్యే లక్షణాలున్నాయని భావించి , ఆమెకు డాన్స్ నేర్పిస్తూ వుండే వారట , ఆమె మద్రాసు చేరాక వేదాంతం జగన్నాథ శర్మ గారి దగ్గర కూచిపూడి నాట్యంలో శిక్షణ పొందారు. ఆమె చిత్ర రంగ ప్రవేశం సమయంలో కూడా ఆమె సినీఫీల్డ్ మీద వుండే దురభిప్రాయం గురించి ఆలోచించి రావాలా వద్దా?  అని మథనపడుతుంటే తండ్రిగారు  ఒక మంచి ఉత్తరం రాశారట "చెడిపోయే వాళ్లు యెక్కడున్నా చెడిపోతారు, బాగుపడేవాళ్లు యెక్కడున్నా బాగుపడతారని" దానితో థైర్యం వచ్చి సినిమా ఫీల్డ్ లోకి ప్రవేశించారట ఆమె

కృష్ణ కుమారి  సినిమా ప్రవేశం వెనక కూడా చిన్న కథుంది. ఒకరోజు రాజకుమారి టాకీసులో తల్లితో పాటు "స్వప్నసుందరి "సినిమా మ్యాట్నీ చూడటానికి వెళ్లిన కృష్ణకుమారిని చూసిన ఒకామె "సినిమాలలో నటించే ఆలోచన వుందా? "అని అడిగింది.ఆమే ప్రఖ్యాత నిర్మాత సౌందర్ రాజన్ అయ్యంగారి కూతురు భూమాదేవి. వారు తలపెట్టిన సినిమా ’సిండ్రిల్లా ’ కథ ఆధారంగా "నవ్వితే నవరత్నాలు" .  "సరే ఆలోచించి చెబుతాం" అని కృష్ణకుమారి తల్లిగారు అన్న మర్నాడే ఆవిడ ఒక కెమేరా మేన్ తో, మేకప్ మాన్ తో ఇంటి ముందు తయారు.అలా వారు తీసుకున్న స్టిల్స్ చూసి పధ్నాలుగు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. మొట్ట మొదట ఒప్పుకుంది "నవ్వితే నవరత్నాలు "అయినా కృష్ణకుమారి  మొట్టమొదట షూటింగ్ లో పాల్గొన్న సినిమా నాగేశ్వరరావు హీరోగా నటించిన "మంత్రదండం" అందులో ఆమె మాంత్రికుడి సహాయకురాలిగా నటించింది.ఆమెకు మొదటి సారిగా మేకప్ వేసింది వాహినీ స్టుడియోలో పని చేసే పీతాంబరం.అది బోళ్ల సుబ్బారావుగారి చిత్రం.మొట్టమొదట గా షూటింగ్ లో పాల్గొన్నది వాహినీ స్టుడియోలో.మేకప్ వేసుకున్నాక అభినందించి ఆశీర్వదించిన వారు తల్లి తర్వాత చక్రపాణి,నాగిరెడ్డీ,సి.యస్ ఆర్, కస్తూరి శివరావు.మొట్టమొదటి సారిగా ఆమె చెప్పిన డైలాగ్ "రాణీ నూనె లో చూడు"..అలా 1951 లో మొదలయిన  కృష్ణ కుమారి  నట ప్రస్థానం 1969వరకూ నిరాఘాటంగా సాగింది


పత్రికల్లో ఆమె ఫోటోలు పడ్డాక వరసగా 14సినిమాల్లో బుక్కయింది,అయితే మొట్ట మొదటగా ఆమెను హీరోయిన్ గా బుక్ చేసిన సౌందర్ రాజన్ అయ్యంగారూ , ఆయన కుమార్తె కొన్ని కంపెనీల కాంట్రాక్ట్స్ మంచివి కాదనీ ఇబ్బందులు వస్తాయనీ చెప్పి కాన్సిల్ చేయించారు.అలా కెరీర్ మొదట్లో ఆమెకు వారు మార్గదర్శకత్వం చేశారుట. ఇంతలో 1958లో చిత్రరంగంలో కాస్త నిలదొక్కుకుని మంచి పేరు తెచ్చుకుంటోంది అనుకుంటుండగా తండ్రి వెంకోజీ రావు గారు హఠాత్తుగా సెరిబ్రల్ హెమరేజ్ తో మరణిండం ఆ కుటుంబానికొక పెద్దషాక్ . కుటుంబ భారమంతా కృష్ణకుమారి మీద పడింది. ఆమె తల్లీ,సొదరుడూ ఆమె పక్కనే వుండి చూసుకునే వారు. తల్లి ఆమెకు వేళకు సరైన ఆహారం ఇవ్వడం, షూటింగుల్లో తోడుగా వెళ్లడం లాంటివి చూసుకుంటే,సోదరుడు కాల్షీట్లూ తదితర వ్యవహారాలు చూసుకునే వారు, ఆ అనుబంధం అలాగే చివరి వరకూ కొనసాగినట్లు ఈ పుస్తకం చదివితే తెలుస్తోంది.

కృష్ణ కుమారి అక్క జానకికి అప్పటికే పెళ్లికావడం ఒక బిడ్డకు తల్లి కావడంతో ఆమె విడిగా వుంటూ వుండేది. ఆమె కృష్ణకుమారి కంటే ముందే విజయావారి మొదటి చిత్రం "షావుకారు "తో(1950) సినిమాలలో ప్రవేశించి , తను నటించిన "షావుకారు "సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకుంది. అలా టేకుమళ్ల జానకి పెళ్లయ్యాక శంకరమంచి జానకి అయ్యి తర్వాత "షావుకారు "జానకి అయింది .చెల్లెలు తెలుగు సినిమాలలో ఎక్కువ నటిస్తే ,ఆమె తమిళ సినిమాలలో ఎక్కువ నటించింది.

కృష్ణ కుమారి 1951-1969 వరకూ దాదాపు 150 తెలుగు సినిమాలు,15తమిళ సినిమాలూ,15కన్నడ సినిమాలలో నటించింది. 1969లొ పెళ్లయ్యాక హఠాత్తుగా చేతిలో వున్న సినిమాలు పూర్తి చెసి,ఒప్పుకున్న కాంట్రాక్టులు రద్దు చేసుకుని ,సినిమాలకు వీడ్కోలు చెప్పి బెంగుళూరు వెళ్లిపోయింది. తర్వాతెప్పుడయినా స్నేహితుల బలవంతం మీద అడపాదడపా తనకు తగిన కారెక్టర్ రోల్స్ వేసేది ,అలా నటించిన చిత్రాలే "భార్యాబిడ్డలు, మానవుడు-దానవుడు, యశోదాకృష్ణ, జ్యోతి,బంగారు భూమి." "అడవి సింహాలు"(1983)ఆవిడ ఆఖరి సినిమా .తర్వాత నటించలేదేమని అడిగిన వాళ్లకి కూతురు పెద్దవుతోంది,ఆమెను చూసుకోవడానికి ఇబ్బందవుతోందని మానేశాను అని చెప్పేది.

సరే ఒకసారి  1951నుండీ ఆమె సినిమా ప్రయాణం ఎలా సాగిందో ఒక సారి పరిశీలిద్దాం ,మొదట తెలుగు సినిమాల తో మొదలు పెడితే ,1951 నుండీ 1960 దాకా "నవ్వితే నవరత్నాలతో మొదలయి , మంత్రదండం, ప్రియురాలు,పిచ్చిపుల్లయ్య, బంగారు పాప, ఇలవేల్పు, వీరకంకణం, దీపావళి, పెళ్లి కానుక, నిత్య కల్యాణం-పచ్చతోరణం "లాంటి సినిమాలలో నటించింది. ఇవి ఆమె కు సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి తోడ్పడినాయి, అయితే 1961లో వచ్చిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి "భార్యాభర్తలు" ఆమె సినీ జీవితాన్నో మలుపు తిప్పింది.(హీరో నాగేశ్వరరావు,దర్శకుడు ప్రత్యగాత్మ). అప్పటినుండీ అందానికే కాదు నటనకి ప్రాధాన్యత వున్న పాత్రలు లభించాయి.తనకు నచ్చిన సినిమాలుగా "భార్యాభర్తలు" తో పాటు "చదువుకున్న అమ్మాయిలు,వాగ్దానం ,గుడిగంటలు,పునర్జన్మ "పేర్లు చెప్పేవారు. ఇంకో విశేషమేమంటే ఆమె నటించిన సినిమాలలో సాంఘికాలే కాదు,పౌరాణికాలూ,జానపదాలూ కూడా వున్నాయి.జానపద బ్రహ్మగా పిలవబడే విఠలాచార్య గారికి అభిమాన హీరోయిన్ ఆమె.

ఇక హీరోల సంగతికొస్తే తెలుగులో అప్పట్లో వున్న అగ్ర హీరోలందరితో నటించారు.ఎన్ .టి. ఆర్ .తో పాతిక సినిమాలలో హీరోయిన్ గా నటించారు."పిచ్చి పుల్లయ్య"తో మొదలయిన వారి జోడీ "వరకట్నం (1969)వరకూ కొనసాగింది. వారిది హిట్ పెయిర్ అనుకునే వారు.ఆమె ఆయనతో నటించిన సినిమాలలో పౌరాణికాలూ,జానపదాలూ ,సాంఘికాలూ ఇలా అన్ని రకాల సినిమాలూ వుండటం విశేషం." ఉదా హరణకి కొన్ని సినిమాలు చూద్దాం --"వినాయక చవితి , దీపావళి" సినిమాల్లో రుక్మిణిగా ,"శ్రీకృష్ణ తులాభారం "లో జాంబవతిగా నటించింది."బందిపోటు,అగ్గిపిడుగు ,చిక్కడు-దొరకడు"సినిమాల్లో జానపద పాత్రలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టిన పాత్రలు."లక్షాధికారి, ఇరుగుపొరుగు, దేవాంతకుడు,తిక్క శంకరయ్య ,వరకట్నం,ఉమ్మడి కుటుంబం "సాంఘికాలు. ఇక్కడ "లక్షాధికారి "సినిమాలో నటించేటపుడు ఆమెను ప్రాణ ప్రమాదానికి గురిచేసే ఒక సంఘటన గురించి దీపిక రాసింది అదేమిటంటే-సముద్రంఒడ్డున ఒక పాట చిత్రీకరణ సమయంలో ఒక పెద్ద అల వచ్చి ఆమెను కింద పడవేసి ఉక్కిరి బిక్కిరి చేసిందట, ఈత రాని ఆమె భయంతో బిగుసుకు పోతే యన్ .టి. ఆర్ సమయస్ఫూర్తి తో ఆమె చేయి గట్టిగా పట్టుకుని వదలకుండా ఇవతలకు లాక్కొచ్చారట.ఈ సంఘటనతో ఆమె భయభ్రాంతురాలయిందట  దాంతో ఆ రోజు షూటింగ్ కాన్సిల్ చేశారట.

ఇక పోతే అగ్రహీరో అక్కినేని నాగేశ్వరరావుతో ఆమె 18 చిత్రాలలో కథానాయికగా నటించారు,అందులో "భార్యాభర్తలు "ఆమె చిత్ర జీవితంలో మైలురాయి లాంటిది. ఆమె1961,62,63 లలో ప్రత్యగాత్మ దర్శకత్వంలో నటించిన మూడుచిత్రాలు వరసగా హిట్టవ్వడమే కాక,రెండు సినిమాలకి ప్రెసిడెంట్ అవార్డ్ లభించింది,అవి "భార్యాభర్తలు, కులగోత్రాలు".మూడో హిట్ సినిమా "పునర్జన్మ".ఈ మూడు సినిమాలలోనూ బలమైన స్త్రీ పాత్రలు ఆమెకు లభించాయి. ఇక మిగతా సినిమాలలో "వాగ్దానం"(శరత్ -దత్త నవల ఆధారం,ఆత్రేయ సొంత సినిమా ,ఆయనే దర్శకుడు) పెళ్లికానుక, కలిమి లేములు, డాక్టర్ చక్రవర్తి , "చెప్పుకోదగినవి , ఇక్కడ "చదువుకున్న అమ్మాయిలు" (డాక్టర్ శ్రీదేవి నవల కాలాతీత వ్యక్తులు ఆధారం)లో ఒక పాటలో నటించేటపుడు జరిగిన తమాషా గురించి చెప్పాలి. ఆ సమయంలో ఆమె పంటి కురుపుతో బాధపడుతున్నారు బుగ్గ వాచి వుంది ఎలా పాట తియ్యడం? పోనీ షూటింగ్ ఆపుదామంటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు . ఇక ఆవిడ  ఉపాయంగా వాచిన బుగ్గ కనపడకుండా తలకు స్కార్ఫ్ కట్టుకుని నటించారు ,విచిత్రంగా అది పెద్ద ఫేషన్ గా పరిగణింపబడింది తర్వాత్తర్వాత. ఆపాట "కిలకిల నవ్వులు చిలికిన "అనే చక్కటి యుగళం

పెళ్లయ్యాక మళ్లీ వచ్చి నటించిన "భార్యాబిడ్డలు"లోది కూడా మంచి పాత్రే . నటి  శ్రీదేవి ఆమెకూతురుగా నటించిందీ ఆ సినిమాలో. ఆమె గురించి అక్కినేని మాటలు "నాతో నటించిన అద్భుతమైన ,ప్రతిభావంతమైన హీరోయిన్లలో కృష్ణ కుమారి ఒకరు", అందంతో పాటు చక్కని అభినయం ఆమె సొంతం. ఇద్దరం చాలా సినిమాలలో కలిసి నటించాం వాటిల్లో "భార్యాభర్తలు "హీరోయిన్ కి ప్రాధాన్యత వున్న సినిమా,ఆమె దర్శకుడు చెప్పినట్టు నడుచుకునే హీరోయిన్ " వీరిద్దరి తర్వాత ఎక్కువ సినిమాలలో నటించింది కాంతారావు పక్కన దాదాపు అన్నీ జానపదాలే,విఠలాచార్య గారి సినిమాలలో చాలా వాటిల్లో వీరిద్దరే జోడీ-"గురువును మించిన శిష్యుడు" మంచి హిట్  జగ్గయ్య గారితో అనుపమా వారి (తిలక్ ,ఆరుద్ర ,పెండ్యాల )"ఉయ్యాల-జంపాల" వంటి  చిత్రాలలో కనిపించారు.  ఇంకా చాలా మందితో నటించి వుండవచ్చు ముఖ్యమైనవి చెబుతున్నా. కొత్తగా పరిశ్రమలో అడుగు పెట్టిన కృష్ణంరాజుతో అప్పటికే సీనియర్ హీరోయిన్ అయిన ఆమె నటించడానికి కారణం తనకి హిట్ చిత్రాలిచ్చిన ప్రత్యగాత్మ మీదున్న గౌరవ భావం,ఆ సినిమా "చిలకా గోరింక". ఈ సినిమాలో ఇంకో విచిత్రం హిందీ నటి నూతన్ ఒక పాటలో మణిపురి భాషలో కొన్ని లైన్లు ప్లేబాక్ పాడటం ,దానికి కూడా ప్రత్యగాత్మే కారణం

ఇక తమిళ సినిమాల విషయానికొస్తే ఆమె దాదాపు పదిహేను తమిళ చిత్రాలలో నటించారు. వాటిలో శివాజీ గణేషన్ తో ఎక్కువ చిత్రాలలో నటించారు,"మణిదన్ , విడుదలై, పుదుయుగం, తూలివిషం," బాగా హిట్టయి ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. మాటల రచయిత కరుణానిధి తాను రాసి స్వయంగా నేర్పించిన డైలాగులు చివరి వరకూ మర్చి పోలేదావిడ. చాలా తమిళ పత్రికలు ఆవిడ ముఖచిత్రాన్ని చాలా సార్లు ప్రచురించాయి.మద్రాసులో చాలాకాలంగా వుండటం,భాషమీద మంచి పట్టు వుండటం తమిళంలో నిల దొక్కుకోవడానికి తోడ్పడినా తనకెందుకో తెలుగు తన మాతృభాషనీ,అందులో నటించడమే సౌకర్యంగానూ,ఇష్టంగానూ వుంటుందని చెప్పారు. కన్నడం విషయానికొస్తే దాదాపు పది హేను సినిమాలలో నటించారు, కన్నడం లో సూపర్ స్టార్ రాజ్ కుమార్ సరసన కూడా నటించి పేరు తెచ్చుకున్నారు "భక్త కనకదాస, స్వర్ణ గౌరి "మంచి హిట్లు ,అందులో "భక్త కనక దాస "కి ప్రెసిడెంట్ అవార్డ్ లభించింది.అలా ఆమె మూడుసార్లు ప్రెసిడెంట్ అవార్డ్ పొందారు. అయినా ముందు చెప్పినట్లు  ఆమె దృష్టి ఎక్కువగా తెలుగు సినిమాల మీదే వుండేది

ఆవిడ 1958లో ఆవిడ "రతి" పేరుతో హిందీ సినిమాలలో ప్రవేశించి "కభీ అంధేరా కభీ ఉజాలా "అనే సినిమాలో కిశోర్ కుమార్ చెల్లెలు గా నటించింది. కిశోర్ అంటుండేవాడట "అరే! అచ్చు  మీనాకుమారి లాగా వుంది కదా ఈ అమ్మాయి " అని. బాగా హిందీ చదవడం,రాయడం ,మాటాడటం వచ్చిన ఆమెకి హీందీ పరిశ్రమలో  పెద్ద ఇబ్బందేమీ ఎదురు కాలేదు కానీ ,ఆమెకు కాబోయే భర్త అజయ్ ఖైతాన్ గారికి తమ బంధువులు హిందీ సినిమాలలో నటించే ఆమెను పెళ్లాడడాని అభ్యంతరం పెడతారేమోననే భయం వుండటం మూలాన, ఆమెకి కూడా మద్రాస్ ని వదిలి వుండటానికి బెంగ అనిపించడం మూలాన వచ్చిన ఆఫర్లని తిరస్కరించి మద్రాస్ తెలుగు పరిశ్రమకి తిరిగి వచ్చారట.

ఇంక ఆమె వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే ఆర్థికంగా నిలదొక్కుకుని ,పెద్ద కుటుంబాన్ని పోషించుతూ 1962లో వాలేస్ రోడ్డులో నుంగంబాక్కంలో ఒక చక్కని ఇల్లు కట్టుకుంది గృహప్రవేశానికి అతిథి గా తాను అక్కలాగా ఎంతో అభిమానించే భానుమతి రావడం చాలా ఆనందాన్నిచ్చింది.ఆ సందర్భం జరిగిన "జయలలిత"నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కూడా. అజయ్ మోహన్ ఖైతాన్ రాజస్థానీ మార్వాడీ కుటుంబానికి చెందిన వ్యాపార వేత్త ,కలకత్తాలో స్థిరపడ్డారు ,వ్యాపార రీత్యా మద్రాస్ కి రాకపోకలు సాగిస్తూ వుండేవారు. (ఆయనఅప్పటికే ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఎడిటర్ ,స్క్రీన్ ,బిజినెస్ మాన్ పత్రికల వ్యవస్థాపకుడు,ఈ విషయాలూ ఇంకా ఆయన గురించిన మిగతా వివరాలూ దీపిక రాసిన పుస్తకంలో లేవు ).

నటి కృష్ణ కుమారికీ ,అజయ్ మోహన్ ఖైతాన్ కీ పరిచయం ఎలా అయ్యిందంటే ,ఆయన స్నేహితుని ఫాక్టరీ ప్రారంభోత్సవానికి, ముఖ్య అతిథిగా కృష్ణకుమారి వెళ్లారు. అక్కడ ఆమెను చూసిన మొదటి క్షణంలోనే ప్రేమలో పడిపోయారు అజయమోహన్. ఇహ అక్కణ్ణించీ జరిగినదంతా "దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే "హిందీ సినిమాకథే అంటుంది పుస్తకం రాసిన ఆమె కుమార్తె దీపిక. ఆమెతో పరిచయం పెంచుకోవాలని తహతహ లాడుతూ ఆయన చేసే ఫోన్ కాల్స్ కి బదులే రాకపోవడంతో, లాభం లేదని ఒక రోజు యేకంగా ఇంటికే వెళ్లిపోయారాయన. అలా వచ్చిన ఆయనతో పరిచయం పెరిగిన కొద్దికాలానికే, కృష్ణ కుమారి తల్లిదండ్రులకి ఆయనంటే మంచి అభిప్రాయం కలిగిందట
ఆయనతో మాట్లాడమని ప్రోత్సహించే తల్లిదండ్రులతో "ఆయన తెలుగు వాడు కాదుమార్వాడీ,పైగా నేను చూసిన వారికంటే గొప్ప అందగాడు కాదు,మరి మీరెందుకు నన్నతనితో మాట్లాడమంటున్నారో అర్థం కావడంలేదు"అనే వారట కృష్ణకుమారి.
క్రమేణా ఆయన నిజాయితీ ,స్నేహ స్వభావమూ ఆమెను ఆకర్షించాయనుకుంటా . తరచుగా వాళ్లిద్దరూ కలుస్తూ వుండేవారు ,తర్వాత చాలా సంవత్సరాలకి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారని వుంది పుస్తకంలో.

ఇక్కడ ఆయన గురించి రెండు మాటలు ,ఆయన అందరు మార్వాడీల్లాగే మంచి భోజనప్రియుడూ,స్నేహశీలీ. ఏ మనిషినయినా ఇట్టే నమ్మే స్వభావం.కొత్తగా పరిచయమైన వాళ్లనయినా "అయ్యో ఆయన నా అన్నలాంటి వాడూ లేదా ఆమె నా అక్క లాంటిది ,వారడిగినప్పుడు సహాయం చేయకపోతే యెలా?" అనే ఆయన మాటలు వినీ వినీ తల బొప్పి కట్టిందట కృష్ణ కుమారికి. దైనందిన జీవితంలో ప్రతీదీ పధ్ధతిగా వుండాలని భావిస్తారట, డైనింగ్ టేబుల్ మీద అమర్చిన వంటకాలతో సహా.టేబిల్ మీద ఎన్ని వున్నా తన భార్యచేసిన వంటకం కోసం వెతుక్కునే వారట. ఆమె కూడా మన తెలుగు వంటలు కొన్ని అలవాటు చేసిందట ఆయనకి. కూతురుతో ఆయన వంట చెయ్యడంలో "మీ అమ్మను అనుసరించెయ్ " అనే వారట.

1969మార్చి 16న వారి పెళ్లి జరిగినట్టు ఆమె సినిమాలలో నటిస్తూనే వుంటానని చెప్పినట్టూ "విజయచిత్ర " పత్రికలో రాసినట్టు తెలుస్తోంది కానీ వాస్తవానికి ఆమె చేతిలో వున్న సినిమాలు పూర్తిచేసి ,కొత్త కాంట్రాక్టులు రద్దు చేసుకుని చిత్ర సీమను వదిలి వేశారు హఠాత్తుగా. ఇద్దరూ మద్రాస్ ను వదిలి బెంగుళూర్లో కాపురం పెట్టారు .మొట్టమొదట జయనగర్ ప్రాంతంలో అద్దెకు వుండే వారట. ఆ తర్వాత ఊరికి దూరంగా గుబ్బలాల అనే ప్రాంతంలో యెనిమిదెకరాల స్థలంలో దీపిక పేరుతో ఒక ఫార్మ్ హౌస్ యేర్పాటు చేసుకున్నారు .అక్కడికి వెళ్లేటప్పటికి తనకి రెండేళ్లని రాసింది దీపిక. ఆమె వారి దత్త పుత్రికని పుస్తకం ముందు మాటలో వుంది. ఇక ఆఫార్మ్ హౌస్ వారి కలల సౌధం,అందులో గులాబి తోట, రాక్ గార్డెన్ ,జలపాతం , డైరీ ఫార్మ్ ,చింత తోపు తో సహా వారి కుటుంబానికి కావాలసినవన్నీ అందులో యేర్పాటు చేసుకున్నారట.

కృష్ణకుమారి గురించి ఆలోచిస్తే కొన్ని సంవత్సరాల పాటు ఆర్క్ లైట్ల కింద,"లైట్స్ ఆన్, లైట్స్ ఆఫ్ ,ప్లేబాక్ ఆన్ , కట్ "అనే కేకల మధ్య ,గ్లామర్ ఫీల్డ్ లో జీవితం గడిపి హఠాత్తుగా , నిశ్శబ్దంగా గృహజీవితానికెలా అలవాటు పడింది?  అని ఆశ్చర్యం కలగక మానదెవరికయినా. ఆమెకు ఈ జీవితానికి అలవాటు పడటానికి సంవత్సరం పట్టిందట,మాటిమాటికీ స్టుడియోల్లో కేకలే చెవుల్లో వినపడుతూ వుండేవట. క్రమంగా ఆవిడ తోటపనిమీదకీ,వంటపని మీదకీ తన ధ్యాస మళ్లించుకున్నారట.ఆమెకు వీటిలో మంచి సాంత్వన లభించింది. అప్పటి వరకూ కనీసం టీ పెట్టడం చేతకాని ఆవిడ వంటల్లో ఎక్స్ పర్ట్ అయిపోయారట. రకరకాల వంటలు తల్లి దగ్గరనుండీ ,వదినగారి దగ్గరనుండీ నేర్చుకుని చక్కని హోస్ట్ గా ఇంటికి వచ్చే బంధువులకీ,స్నేహితులకీ వండి వడ్డించే వారట

క్రమంగా ఆమె తల్లీ ఆమె సోదరుడూ కూడా  వచ్చి ఫార్మ్ హౌస్ లో నివసించ సాగారు. వారి బంధువులలో కొంతమంది ,వారి పక్కనే స్థలాలు కొనుక్కుని స్థిరపడ్డారు.ఆమె అక్క "షావుకారు "జానకి కూడా ఆ పక్కనే ఇల్లు కట్టుకుని స్థిరపడ్డారు.దీపికా పెరిగి పెద్దవుతోంది, ఆమె గానీ ఆమె తల్లిగానీ యేం కోరుకుంటే అది వెంటనే దొరికే యేర్పాటు చేస్తారు ఆమె తండ్రి .దీపికా ఫార్మ్ హౌస్ అంటే బంధువులకూ,స్నేహితులకూ ,దీపికా స్నేహితులకీ అభిమానం యేర్పడటానికి ఆమె తల్లీ దండ్రీ చూపే ఆదరణా ,ఆప్యాయతా,  ప్రేమతో ఆమె తల్లి వండి వడ్డించే వంటకాలే కారణ మనిపిస్తుంది. దీపిక స్నేహితులు ఆమె ఆప్యాయాభిమానాల గురించి రాసిన మాటలు చదువుతుంటే అది మరింత నిజమనిపిస్తుంది. దీపిక యేమంటుందంటే తన స్నేహితులని ,నాలుగుకాళ్ల స్నేహితులతో సహా యే సమయంలో వచ్చినా ,వాళ్ల అవసరాలని కనిపెట్టి అప్పటికప్పుడు వాళ్లక్కావాలసిన యేర్పాట్లు తల్లీ దండ్రీ చేసేవారనీ ,ఈ గుణాలన్నీ వారి నుండీ తనకు కూడా సంక్రమించాయనీ.

అలా ఆమె భర్తతో కుమార్తె తో తనకు నచ్చిన వాతావరణంలో ,ప్రకృతికి దగ్గరగా,చుట్టూ తన ఆత్మీయులతో ప్రశాంత జీవితం గడపసాగారు.అప్పుడప్పుడూ కుటుంబమంతా విహారయాత్రలకు ఊటీ మొదలయిన ప్రదేశాలకు వెళుతుండేవారుఅయితే కృష్ణ కుమారికి విమాన ప్రయాణమంటే తగని భయం,దానికీ తగిన కారణముంది. ఒక సారి బొంబాయి నుండీ మద్రాస్ వచ్చే విమానం తుఫాన్లో చిక్కుకుంటే,వైజాగ్ లో దింపేశారు,మర్నాడు మద్రాస్ బయలుదేరిన విమానం మళ్లీ వెనక్కు తిరిగి వైజాగ్ వచ్చింది,ముచ్చటగా మూడోసారి బయలుదేరి విపరీతమైన కుదుపులతో ఎట్టకేలకు మద్రాస్ లో లాండయిందట. ఇంకోసారి, మద్రాస్ నుండీ హైద్రాబాద్ బయలుదేరిన విమానం వీల్స్ విప్పుకోక బెల్లీ లాండింగయ్యిందట,అప్పుడు భయంతో తిరుపతి వెంకన్నకు బ్రహ్మోత్సవం చేయిస్తానని మొక్కుని తర్వాత తీర్చుకుందట. ఆ భయం తర్వాత దీపిక తో లండన్ వెళ్లినప్పుడు గానీ తీరలేదట.అలాగే ఆమెకు పాములంటే భయం,సముద్రమంటే భయం.

ఇష్టాల గురించి చెప్పాలంటే తెలుగు వంటలంటే ఇష్టం ,హిందీ సినిమాలంటే ఇష్టం అమీర్ ఖాన్ ఆమె అభిమాన నటుడు,ఇంకా నగలంటే ఇష్టంఆమె భర్త గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అజయ్ మోహన్ ప్రేమా ,దాతృత్వమూ,ఏ పరిస్థితుల్లోనూ చెక్కు చెదరకుండా బలమైన స్తంభం లాగా నిలిచి వుండమూ ఆ కుటుంబాన్ని నిలిపి వుంచాయనిపిస్తుంది .అందుకే దురదృష్ట వశాత్తూ అనారోగ్యంతో ఆయన 2012లో మరణించడం ఆమెకు తీరని విఘాతంగా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. అప్పటికే కూతురు దీపిక తనకు తగిన వరుణ్ణి వెదుక్కుని జీవితంలో స్థిరపడింది,ఒక బిడ్డకు జన్మనిచ్చింది.మనవడు పవన్ అంటే కృష్ణకుమారికి చాలా ఇష్టం. కూతురు కుటుంబంతో సిటీలో స్థిరపడినా తరచూ ఫార్మ్ హౌస్ కి వస్తూనే వున్నారు.తన చుట్టూ తన వాళ్ల కుటుంబాలున్నాయి. పార్టీలివ్వడం,స్నేహితుల రాకపోకలూ ఇదివరకటి కంటే తగ్గి పోయినా,అప్పుడప్పుడూ ఎవరో ఒకరు రావడం,ఆమె యేదో ఒకటి చేసి పెట్టడం మామూలే

ఒక సారి టీవీలో యేదో పాత తెలుగు సినిమా వస్తోంది,మనవడూ తనూ కలిసి చూస్తున్నారు,"అమ్మమ్మా అది నువ్వేనా ?" అన్నాడు పవన్ "అవును "అందామె ,కొంచెం సేపు ఊరుకుని "నువ్విప్పటికీ బాగున్నావ్ "అన్నాడు.

ఏ నావైనా రేవు చేరక తప్పదు,యే జీవితానిమైనా యేక్కడో ఒకచోట ముగించాలిసిందే .మనుషుల రచనలలోనే కాదు,దేవుని రచనలలో కూడా ముగింపు వాక్యం పలకాలిసిందే. జనవరి24వ తేదీ2018----ఆంధ్రులని తన అందంతో నటనతో అలరించిన కృష్ణకుమారి తిరిగి రాని దివ్యలోకాలకి తరలిపోయిన రోజు. తన మెత్తని స్వభావంతో ,ఆదరణతో తన చుట్టూ వున్న వారి జ్ఞాపకాలలోనూ,తను నటించిన చిత్రాలతో అభిమానుల జ్ఞాపకాలలోనూ శాశ్వతంగా జీవించే వుంటుందని భావిస్తూ అల్విదా

-భార్గవి

Comments

  1. చాలా వివరం గా రాశారు. సినిమా తారల వ్యాసాలు ఇష్టపడే నేను "కృష్ణ కుమారి" గారి వ్యాసాన్ని బాగా ఎంజాయ్ చేసాను. మీకు, ఈ లింక్ నాకు పంపి చదివించిన అన్వర్ గారికి నమొన్నమః 🙏

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

దైవం కొలువైన గొంతు......మహ్మద్ రఫీ.

షికాగో ఆర్ట్ మ్యూజియమ్ - సాల్వడార్ డాలీ

మరణానంతరము